బుసకొట్టడమే కాదు, కాటు వేస్తోంది, జాగ్రత్త!
భూమి అనే ఆస్తి వల్లనే రెడ్లు లేదా ఇతర అగ్రకులాలవాళ్లు సామాజిక హోదాను పొందుతున్నారని, దానివల్లనే దళితులను వారికి గౌరవం ఇస్తున్నారని బీసీలు నమ్ముతూ ఉండవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా ఉన్న కె. శ్రీనివాస్ చాలా ఏళ్ల క్రితం ఓ ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ సోదరుడు అజయ్ నడుపుతున్న ప్రజాతంత్ర పత్రికకు కాలమ్ రాస్తుండేవారు. అంటే అప్పటికి ఆంధ్రజ్యోతి పునర్ముద్రణ ప్రారంభం కాలేదు. ఇదంతా ఎందుకంటే చూచాయగా కాలాన్ని గుర్తించడానికే. అది ఏ సంవత్సరం అనేది గుర్తుకు లేకపోవడం వల్ల.
ఆయన వేసిన ప్రశ్న ఏమిటంటే, తెలంగాణలో ఇటువంటి దాడులు జరగడమేమిటి అని. ఆ సమయంలో పాత మహబూబ్నగర్ జిల్లాలో ఓ చోట (పేరు గుర్తు లేదు) దళితులపై మూకుమ్మడి జరిగింది. దాడి చేసింది బీసీలు. ఆంధ్ర ప్రాంతంలో కారంచేడు, చుండూరు ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన ఆ ప్రశ్న. శ్రీనివాస్కు తెలియదని కాదు. ఆయన నిజానికి సూక్ష్మగ్రాహి. అయితే, ఆయనకో అలవాటు ఉంది.
ఔట్ డేటెడ్: నేనూ, నా ఆల్విన్ వాచీ అబ్షెషన్
తాను అనుకుంటున్న విషయం ఎంత వరకు సరైంది, ఎంత వరకు కాదు అని బేరీజు వేసుకోవడానికి ఎదుటివాళ్లను అడుగుతారు. బహుశా నన్ను కూడా అలాగే అడిగి ఉంటారు. కులపరమైన దాడులు తెలంగాణలో జరగడమేమిటని ఆయన ప్రశ్నలోని ఆంతర్యం.
తెలంగాణలో మేం చూసినంత వరకు కులపరమైన ఘర్షణలు లేవనే చెప్పాలి. కానీ, అందుకే ఆ దాడి శ్రీనివాస్ను ఆశ్చర్యానికి గురి చేసి ఉంటుంది. తెలంగాణలో కులపరమైన వివక్షలు ఘర్షణల స్థాయికి, మూకుమ్మడి దాడుల స్థాయికి చేరుకోకపోవడానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు పోరాటాలు, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమాలు కారణం. ఈ ఉద్మమాలు కులాన్ని తెలంగాణలో అప్రధానం చేశాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించినవారిలో రావి నారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఆరుట్ల రామచంద్రా రెడ్డి వంటి రెడ్లు ఉండడం గమనించవచ్చు. వారంతా పేదరికాన్ని ప్రామాణికంగా లేదా, అణచివేతకు గురవుతున్న ప్రజలను ప్రామాణికంగా తీసుకుని పోరాటం చేశారు తప్ప కులాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
అంతెందుకు, జోగిపేట ఆంధ్ర మహాసభలో దళితుడైన భాగ్యరెడ్డి వర్మను వేదిక ఎక్కించడానికి అగ్రవర్ణ నాయకులు వ్యతిరేకిస్తే, వారికి ఎదురొడ్డి నిలబడినవారు సురవరం ప్రతాపరెడ్డి. అయితే, తెలంగాణ భూస్వాములపై పోరాటం చేసిన నాయకుల్లో రెడ్లు చాలా మంది ఉన్నారని ముందె చెప్పుకున్నాం.
అయితే, నిజాం హయాంలో సకల దౌర్జన్యాలకు, పీడనకు కారకులు రెడ్లు అనే ప్రచారం ముమ్మరంగా సాగింది. సాగుతోంది. గ్రామాల్లో దొరతనం చేసిన కులాల్లో రెడ్లతో పాటు వెలమలు, ముస్లింలు కూడా ఉన్నారు. (ఎక్కువ మంది రెడ్లు ఉండవచ్చు లేదా విసునూరి రామచంద్రారెడ్డిపై జరిగిన పోరాటం ప్రధానంగా ముందుకు రావడం కావచ్చు, ఈ విషయాన్ని చరిత్రకారులు తేల్చాలి).
ఆ విషయాన్ని పక్కనపెడితే, మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన సామూహిక దాడి వద్దకు వద్దాం. నా అవగాహనను శ్రీనివాస్కు చెప్పాను.. తెలంగాణలో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల, నక్సలైట్ ఉద్యమాల వల్ల రెడ్లు భూములను అమ్ముకుంటూ వచ్చారు. వాటిని ఎక్కువగా బీసీలు కొనుక్కుంటూ వచ్చారు. ఆస్తి సామాజిక హోదాను తెచ్చి పెడుతుందనే నమ్మకం ఒకటి అంతర్గతంగా ఉండి ఉంటుంది.
భూమి అనే ఆస్తి వల్లనే రెడ్లు లేదా ఇతర అగ్రకులాలవాళ్లు సామాజిక హోదాను పొందుతున్నారని, దానివల్లనే దళితులను వారికి గౌరవం ఇస్తున్నారని బీసీలు నమ్ముతూ ఉండవచ్చు. భూమిని సొంత ఆస్తిగా కలిగి ఉండి, సామాజిక గౌరవం పొందుతున్న అగ్రకులాలకు ఇచ్చే గౌరవం తమకు ఎందుకు ఇవ్వడంలేదనే కోపమేదో అంతర్గతంగా భూములను కొనుక్కున్న బీసీలకు కలిగి ఉంటుంది. అందుకే దళితులపై బీసీలు దాడి చేసి ఉంటారు. ఇదీ నా అవగాహన. ఇదే చెప్పా.. దానితో శ్రీనివాస్ సంతృప్తి చెందినట్లే ఉన్నారు. ప్రజాతంత్రలో కాలమ్ రాశారు.
అంటే, కులం అనేది ఆస్తుల ద్వారా రూపుమాసిపోవడమో, ఉనికిని చాటుకోవడమో ఉండదని నాకు అర్థమైన విషయం. అది తరతరాలుగా అంతరంగాన్ని పట్టుకుని పీడిస్తున్న దురాచారం. అది భౌతికపరమైంది కూడా కాదు. పూర్తిగా మానసికపరమైంది. ఆర్తికపరమైంది కాదు, సాంస్కృతికమైంది. పైపెకి, దళితులు, ఇతర కులాల వాళ్లు ఆస్తులను కూడబెట్టుకోవడం ద్వారా లేదా బ్రాహ్మణ సంప్రదాయాలను పాటించడం ద్వారా కులం రద్దవుతుందని భావించవచ్చు గానీ సందర్భం వచ్చినప్పుడు అది బుసకొడుతూనే ఉంటుంది.
ఇదంతా రాయడానికి సందర్భమేమిటంటే, మంథని సంఘటన తీవ్రత, యాదాద్రి జిల్లా దౌర్జన్యం చూసిన తర్వాత తెలంగాణలో కులం బుసకొట్టడం మాత్రమే చేయడం లేదు, కాటు వేస్తందని చెప్పడానికే. తెలంగాణలో అగ్రకుల దురహంకారం జడలు విప్పారుస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం.
చర్చలో పాల్గొనదలిచినవారు ఈ కింది మెయిల్ అడ్రస్కు రాయవచ్చు, వాటిని ప్రచురిస్తాం.
- కాసుల ప్రతాపరెడ్డి