కెసిఆర్పై కోదండరామ్ ఫైట్: ఎక్కడ చెడింది?
కోదండరామ్కు, కెసిఆర్కు మధ్య పూర్తిగా చెడినట్లే. కెసిఆర్పై కోదండరామ్ సమరం సాగించడానికే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. దీన్నెలా చూడాలి...
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కృష్ణార్జునుల మాదిరిగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పనిచేశారని స్థానిక ప్రజలు భావిస్తారు. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు ముదిరాయి. ఈ విభేదాలకు కారణాలు ఏమిటనేది ఎవరికి వారు చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ, అసలు కారణం ఏమై ఉంటుందా అనేది తెలియడం లేదు.
కెసిఆర్కు వ్యతిరేకంగా కోదండరామ్ క్రమక్రమంగా గొంతు పెంచుతూ వచ్చారు. చివరకు హైదరాబాద్లో నిరుద్యోగ ర్యాలీని పెట్టి, అరెస్టు కూడా అయ్యారు. ప్రభుత్వాలు ఏవైనా సరే ఒకే రకంగా ఉంటాయనేది కోదండరామ్కు తెలియంది కాదు. అయినా, ఆయన పట్టు విడవడం లేదు. ఈ పట్టు వీడకపోవడం వెనక మతలబు ఏమై ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.
నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్కు కెసిఆర్ ఏదైనా సముచిత స్థానం కల్పించి ఉంటే బాగుండేదని తెరాసకు చెందినవారే అంటూ ఉంటారు. కానీ, ఆ మాట బయటకు చెప్పరు. అలా చెప్పడం కెసిఆర్కు ఇష్టం ఉండదు.
- కె. నిశాంత్
కోదండరామ్పై పుకార్లు ఇలా...
కెసిఆర్తో దూరం పెరిగిన తర్వాత కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి, పూర్తి స్తాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కోదండరామ్కు చాలా కాలమే పట్టింది. తెలంగాణలో ప్రతిపక్షాలు చాలా బలహీనపడ్డాయి. ఈ స్థితిలో కెసిఆర్కు బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోయింది. ఈ స్థితిలో కోదండరామ్ బలమైన శక్తిగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఆయన పార్టీ పెడుతారనే పుకార్లు కూడా బలంగానే ఉన్నాయి. ఆ అవకాశం కోదండరామ్ తన నర్మగర్భ ప్రకటనల ద్వారా ఇస్తూనే ఉన్నారు.
అసలు ఎక్కడ చెడింది...
కెసిఆర్కు, కోదండరామ్కు ఎక్కడ చెడిందనే విషయంపై బలమైన కారణం ఒక్కటి చెబుతూ ఉంటారు. అది కాంగ్రెసుతో కోదండరామ్ పెట్టుకున్న సంబంధాలకు చెందింది. ఉద్యమ కాలంలో కెసిఆర్కు మాట మాత్రంగానైనా చెప్పకుండా కోదండరామ్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశాడని అంటారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తెలంగాణలో కెసిఆర్తో పొత్తును కూడా కుదిర్చి పెడుతానని ఆయన సోనియాకు హామీ కూడా ఇచ్చారని చెబుతారు. తొలుత కెసిఆర్ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటానని చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. దాంతో కాంగ్రెసు తెలంగాణలో తీవ్రంగా దెబ్బ తిన్నది.
ఇకపోతే తెలంగాణలో ఇది కూడా...
తెలంగాణలో రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉంది. మొదటిసారి వెలమలు రాజ్యాధికారాన్ని చవి చూస్తున్నారు. కెసిఆర్ పట్ల రెడ్లు అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసులో అత్యధికంగా రెడ్లు నాయకులుగా ఉన్నారు. వారి కోసం కోదండరామ్ పనిచేస్తున్నారనే అభిప్రాయం బలంగానే ఉంది. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశంలో ఉన్నప్పటికీ రెడ్లు అధికారంలోకి వస్తారని సూత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోదండరామ్ను ఆలంబనగా చేసుకుని రెడ్లు తిరిగి ప్రాబల్యంలోకి రావాలని చూస్తున్నారనే అభిప్రాయం ఉంది. అయితే, కోదండరామ్ మొదటి నుంచి కూడా వామపక్షవాది. పౌరహక్కుల ఉద్యమంలో బలంగా పనిచేశారు. ఆయన కుల ప్రాతిపదికపై ముందుకు వెళ్లే అవకాశం లేదు. కానీ, ఆయన చుట్టూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన రెడ్డి నాయకులే కనిపిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి...
తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చాలా వరకు ప్రజలు హర్షిస్తున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మొదటిసారి వ్యవసాయం చేసుకోవడానికి నీరు అందుతోంది. కరెంట్ కోత లేదు. దాంతో ఒక రకంగా రైతులు సంతృప్తితో ఉన్నారనే చెప్పాలి. కెసిఆర్ ప్రకటించిన హామీలన్నీ అమలయ్యాయా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. చాలా హామీలు ఇంకా పెండింగులో ఉన్నాయి. క్రమక్రమంగా అవుతాయనే నమ్మకం ఇంకా ప్రజల్లో సడలలేదు. కెసిఆర్ ఉద్యమ కాలంలో ఆలోచనలు లేకుండా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం ఉద్యోగ, నిరుద్యోగుల్లో, ముఖ్యంగా చదువుకున్నవారిలో కొంత అసంతృప్తికి కారణమవుతోంది. దానికితోడు, ఆంధ్రులకు స్థానాలు కల్పిస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది.
ఈ స్థితిలో కోదండరామ్ ఏం చేస్తారు..
కోదండరామ్ మాత్రమే కాకుండా కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న గ్రూపులు ఉన్నాయి. తమను కెసిఆర్ నిర్లక్ష్యం చేశారని బయటకు వెళ్లిపోయినవారు, మొదటి నుంచీ ఉద్యమంలో ఉండి ఫలితాలు దక్కకనివారు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర కూడా పోషించనివారు ఇప్పుడు ప్రధానం కూడా అసంతృప్తికి కారణమవుతోంది. అయితే, కెసిఆర్ తనకు పనికి వచ్చేవారికి మాత్రమే పదవులు, అవార్డులు కట్టబెట్టారనే విమర్శ ఉంది. ఆయన ఏ విధమైన అసంతృప్తిని గానీ, ఏ విధమైన వాదనలను గానీ వినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా దుర్లభంగానే ఉందనే అభిప్రాయం ఉంది. ఈ స్థితిలో ఈ అసంతృప్తిని అంతటినీ కోదండరామ్ తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతారా అనేది ప్రశ్న. అదే సమయంలో చాలా మందికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకుల మీద సానుకూల వైఖరి లేదు. ఈ స్థితిలో కోదండరామ్ చుట్టూ వారే ర్యాలీ అవుతున్నారు. అందువల్ల కొత్త శక్తులను కోదండరామ్ కూడగట్టుకోగలిగేతనే ఏమైనా ఫలితం ఉండవచ్చు.