లక్ష్మినారాయణ కాల్ లిస్టు: మహారాష్ట్రలో మూలాలు
లక్ష్మినారాయణ కాల్ లిస్టును మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగులు కొంత మంది నాందేడ్ పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్నారు. కెవిపి రామచందర్ రావుకు బంధువైన వ్యాపారవేత్త రఘురామ కృష్ణరాజు ఈ ఏడాది జనవరిలో - లక్ష్మినారాయణ ఓ వర్గానికి చెందిన మీడియాకు సమాచారాన్ని లీక్ చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన తర్వాత ఆ పటిషన్ను ఉపసంహరించుకున్నారు.
మహారాష్ట్రలోని ముద్ఖేడ్కు చెందిన ఓ వ్యక్తి నుంచి నాందేడ్ కింది స్థాయి పోలీసులు లక్ష్మినారాయణ కాల్ లిస్టును పొందినట్లు విచారణలో తేలిందని ఆంగ్లపత్రిక రాసింది. నాందేడ్ పోలీసులు సిడిఆర్ రిక్వెస్టును సెల్యులార్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ నోడల్ అధికారికి పంపినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి దాన్ని హైదరాబాద్ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. నెంబర్ హైదరాబాదులో రిజిష్టర్ కావడంతో సిడిఆర్ రిక్వెస్ట్ను హైదరాబాద్ కార్యాలయానికి పంపినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ కార్యాలయం కాల్ లిస్టును మహారాష్ట్ర కార్యాలయానికి పంపడానికి బదులు నేరుగా నాందేడ్ పోలీసులకు పంపించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే ఆ కాల్ లిస్టు వ్యాపారవేత్తకు, టీవీ చానెళ్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును నాందేడ్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ నిర్మలాదేవి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.