వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్: వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి, తెలంగాణలోని వరంగల్ను వారసత్వ నగరాలుగా గర్తించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
భారతదేశంలోని ప్రాచీన కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలోని 12 నగరాలను వారసత్వ నగరాలుగా గుర్తించామని తెలిపారు. జనవరి, 2015 నుంచి దేశంలో వారసత్వ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, పేదల గృహ నిర్మాణం కోసం రూ. 101 కోట్లు మంజూరు చేశామని అన్నారు. వరంగల్లో రూ. 70 కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. అలాగే రామగుండంలో 17.75 కోట్లతో 280 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో తమ ప్రభుత్వం లోక్సభలో అత్యధిక బిల్లులు ప్రవేశపెట్టిందని తెలిపారు.
లోక్ సభలో తమకు స్పష్టమైన ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఒక్క సెషన్ లోనే రికార్డు స్థాయిలో 17 కీలక బిల్లులకు ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. రాజ్యసభలో కాస్త ఎక్కువ బలం ఉన్న విపక్షాలు, కీలక బిల్లులకు అడ్డుపడుతున్నాయని అన్నారు.
ప్రస్తుత సెషన్లో రాజ్యసభలో 11 బిల్లులకు మాత్రమే ఆమోదం లభించడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలని వెంకయ్య సూచించారు.