పత్తి సాగు తగ్గించేదెలా? బాబు సర్కార్ అంతర్మథనం
ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై రైతుకు అవగాహన కల్పించేదెలా? అని వ్యవసాయశాఖ సతమతం అవుతోంది. గత ఏడాది పెరిగిన మిర్చి, కంది, పత్తి పంటల సాగు తదనుగుణంగా ధరలు పడిపోవడంతో వచ్చే ఏడాది అలాంటి పరిస్థితి పునరావృతం.
అమరావతి/ హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై రైతుకు అవగాహన కల్పించేదెలా? అని వ్యవసాయశాఖ సతమతం అవుతోంది. గత ఏడాది పెరిగిన మిర్చి, కంది, పత్తి పంటల సాగు తదనుగుణంగా ధరలు పడిపోవడంతో వచ్చే ఏడాది అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది.
రైతుల్లో అవగాహన కల్పిస్తే పత్తి సాగు తగ్గుతుందా? నియంత్రణ విధించాలా? అనే కోణంలోనూ అభిప్రాయాలు తీసుకుంటోంది. నియంత్రణ విధిస్తే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలో ఖరీఫ్లో పంటల సాగుపై వ్యవసాయశాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక తయారుచేసింది. 42.06 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.20 లక్షల హెక్టార్లు అదనమని తెలుస్తున్నది.
పత్తి సాగు భారీగా పెరిగే ఛాన్స్
రాష్ట్రంలో గత ఏడాది పత్తిసాగు 30 శాతం తగ్గింది. గులాబీరంగు పురుగు ఆశించే ప్రమాదం ఉన్నదని వ్యవసాయశాఖ ముమ్మరంగా ప్రచారం చేయడంతో రైతులు మిర్చి, కంది వైపు మొగ్గు చూపారు. ఫలితంగా వీటి విస్తీర్ణం పెరిగి ధరలు పడిపోయాయి. పత్తికి క్వింటాలుకు రూ.5వేలకు పైగా లభించడంతో రైతులంతా తెల్ల బంగారం వైపు చూస్తున్నారు. ఫలితంగా సాగు విస్తీర్ణం 6.05 లక్షల హెక్టార్లకు చేరనున్నదని వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. అంటే ఏకంగా 1.53 లక్షల హెక్టార్ల వరకు పెరుగుదల ఉంటుంది. ఇందులో గుంటూరులో అత్యధికంగా 50 వేల హెక్టార్ల వరకు, కర్నూలులో 35వేల హెక్టార్లు, ప్రకాశంలో 34 వేల హెక్టార్లు, కృష్ణాలో ఏడువేల హెక్టార్లు పెరగనున్నది. దీన్ని తగ్గించడం ఎలా అని వ్యవసాయశాఖ తల పట్టుకుంటోంది.
1.55 లక్షల హెక్టార్లకు మిర్చి?
ధరల పతనంతో మిర్చి సాగుకు రైతులు వెనకంజ వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాది 2.03 లక్షల హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 1.55లక్షల హెక్టార్లకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏకంగా 48 వేల హెక్టార్లు తగ్గించడం కష్టమే. గుంటూరులో ఏకంగా 15 వేల హెక్టార్ల విస్తీర్ణం తగ్గాల్సి ఉండగా ప్రకాశంలో 16వేలు, కర్నూలులో 3000, కృష్ణాలో 10 వేల హెక్టార్ల వరకు తగ్గితేనే సాధారణ విస్తీర్ణానికి చేరువ అవుతుంది. జూన్ నుంచి ధరల్లో కొంత కదలిక వస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. ఇదే జరిగితే రైతులు మళ్లీ మిర్చికి మొగ్గే అవకాశాలూ ఉన్నాయి.
పెరగనున్న వరి సాగు
గత ఖరీఫ్లో 14.70 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ఈ ఏడాది 16.25లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా. అంటే 1.35లక్షల హెక్టార్లు పెరగనుంది. రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ సాగు ఎక్కువ. వర్షాభావ పరిస్థితులతో గత ఖరీఫ్లో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విస్తీర్ణం 79వేల హెక్టార్ల వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. గతేడాది ఖరీఫ్లో 4.25లక్షల హెక్టార్లలో కంది, మినుము ఇతర పప్పు ధాన్యాల పంటలు సాగయ్యాయి. ఇందులో కంది విస్తీర్ణమే 3.30లక్షల హెక్టార్ల వరకు ఉంది. ధరలు పడిపోవడంతో ఇది 2.77 లక్షలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
తొలకరికి ముందు అడుగేస్తేనే..
ఖరీఫ్కు ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. వచ్చేనెల తొలి వారంలో తొలకరి అవుతుందని వాతావరణశాఖ సంకేతాలిస్తోంది. రైతులు ఇప్పటికే విత్తనాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఏది సాగు చేస్తే లాభదాయకం? వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి? గిట్టుబాటు ధరలపై వారిలో చైతన్యం తెచ్చేలా వ్యవసాయ, ఉద్యానశాఖలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.