నది అడుగు భాగాన.. 300 ఏళ్ల నాటి భారీ గుప్తనిధి
దాదాపు 300 ఏళ్ల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.
బీజింగ్: దాదాపు 300 ఏళ్ల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10 వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని వారు పేర్కొన్నారు.
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు చెప్పారు.
మిన్ జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్ జియాంగ్ నదీ గర్భంలో ఈ సంపద బయటపడినట్లు సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ వెల్లడించారు.
1646లో ఆ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్ జియాంఝాంగ్.. మింగ్ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరో చోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నదిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయటపడిందని చెప్పారు.
సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా మొదలు పెట్టడంతో ఈ నిధి బయటపడింది.