నోట్ల రద్దుపై.. నశిస్తోన్న సామాన్యుడి ఓపిక.. మోడీపై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. కేంద్రం చేసిన ప్రకటనకు నేటికి ఐదు రోజులు పూర్తయిపోయాయి. ఇలాంటి సంచలన నిర్ఱయాలు తీసుకున్నప్పుడు.. సహజంగానే జనంలో ఆందోళన, గందరగోళం అంతా కామనే అనుకున్నారు. రెండు రోజులు ఓపిక పడితే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది.. ఆపై అంతగా ప్రభావం ఉండదు అనుకున్నారు.
కానీ ఇప్పటికీ.. బ్యాంకుల మందు, ఏటీఎంల ముందు అదే క్యూ కనిపిస్తోంది. ఆఖరికి గంటల తరబడి క్యూ లో నిలుచున్న వ్యక్తులు ఓపిక నశించి బ్యాంకు అద్దాలు ధ్వంసం చేస్తున్న ఘటనలు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చోట చేసుకుంటున్నాయి. ఓవైపు రూ.2వేల నోటుకు సరిపోయే సాఫ్ట్వేర్ ను తయారుచేసి.. దాన్ని ఏటీఎంలలో ప్రవేశపెట్టడానికి మరికొన్ని రోజులు పడుతాయని ఆయా బ్యాంకు సంస్థలు ప్రకటిస్తున్నాయి.
దీంతో సామాన్యుల నోట్ల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్పితే తగ్గట్లేదు. క్యూ లో నిలబడి రూ.2వేల నోటును సంపాదించినా.. దానికి చిల్లర వెతుక్కోవడం ప్రస్తుతానికి అసాధ్యంగానే మారింది. ఒకవేళ రూ.2వేల నోటుతో ఏదైనా కొనడానికి వెళ్లినా.. కొంటే 2వేల ధరకు సమానమైన వస్తువును కొనుగోలు చేయాలి, లేదా కాస్త అటు ఇటుగా.. 1500 పైబడిన వస్తువును కొనుగోలు చేస్తేనే దుకాణదారులు చిల్లర చెల్లిస్తున్న పరిస్థితి. అంతకుమించి వారి వద్ద కూడా వంద నోట్లు ఎక్కువగా ఉండే అవకాశం లేకపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తుతోంది.
రూ.500 కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చేదాకా ఈ ఇక్కట్లు తప్పేలా లేవు. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగడం సామాన్యలను ఆర్థికంగాను దెబ్బ తీస్తుంది. ఇప్పటికే మాంసం దుకాణాలు, సినిమా థియేటర్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు నోట్ల రద్దుతో కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గానీ, ముందస్తు చర్యలు గానీ చేపట్టకపోవడం వల్లే సామాన్యులకు ఇంత ఇబ్బంది ఏర్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆర్థిక నిపుణలు చెబుతున్న మాటేంటంటే.. రూ.2వేల నోటును ప్రవేశపెట్టడంలో చూపించిన శ్రద్ద రూ.500నోటుపై చూపిస్తే ఇంత బాధ ఉండకపోయేదనేది వారి అభిప్రాయం. ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి మరో రెండు మూడురోజులు పట్టవచ్చని చెబుతున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో.. నిజంగా రెండు మూడు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందా? అన్నది అనుమానంగానే మారింది.
మొత్తానికి ప్రధాని మోడీ నిర్ణయం సామాన్యుడి సహనాన్ని పరీక్షించేదిగా మారింది. ఇప్పటికే ఐదురోజులు ఓపిక పట్టిన జనంలో.. ఇక ఆ ఓపిక నశిస్తుండడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.