సెక్స్ లేకుండా 120 ఏళ్లు: గిన్నిస్ బుక్లో చోటు
న్యూఢిల్లీ: సెక్స్ కోరికలు చంపుకుని, ఉప్పు, కారం లాంటి మసాలాలు లేని భోజనం తినకుండా ప్రతి రోజూ యోగా చేస్తే సుదీర్ఘకాలం బతుక వచ్చని ఆధ్యాత్మిక వేత్త స్వామి శివానంద చెబుతున్నారు. ప్రస్తుతం స్వామి శివానంద వయసు 120 ఏళ్లు. భూమి మీద ఇంకా జీవించి ఉన్న అత్యంత కురు వృద్ధుడుగా స్వామి శివానంద ఓ రికార్డును సొంతం చేసుకోనున్నారు.
పాస్పోర్ట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన 1886 ఆగస్టు 8న జన్మించారు. పాస్ పోర్ట్లో పేర్కొన్న వివరాలు సరైనవే అయితే ఈయన మూడు సెంచరీలు(19, 20, 21)లకు సాక్ష్యంగా నిలిచిన వ్యక్తిగా ఓ అరుదైన ఘనతను సాధిస్తాడు. 120 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతి రోజూ చురుకుగా యోగా చేస్తుంటారు.
ప్రస్తుతం స్వామి శివానంద గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో తన పేరును చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు భూమి మీద ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా జపాన్కు చెందిన జిరోమాన్ కిమురా పేరిట రికార్డు నమోదైంది. కిమురా 116 ఏళ్ల 54 రోజులు జీవించి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.
పాస్పోర్ట్ అధికారులు సైతం స్వామి శివానంద వయసుని ధ్రువీకరించారు. ఓ ఆలయంలోని రిజిస్టర్లో ఆయన పేరు నమోదై ఉందని దాని ప్రకారమే ఆయనకు పాస్ పోర్ట్ జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. భారత్లో స్వాతంత్ర్యానికి ముందు పుట్టిన చాలా మంది పుట్టిన తేదీలను గుర్తించడం చాలా కష్టమేనని అందరికీ తెలిసిందే.
వారణాసికి చెందిన శివానంద పేదరికంలో పట్టడంతో చిన్నతనంలోనే స్వామీజీగా మారాడు. అంతేకాదు ఎక్కువ కాలం జీవించి ఉండటానికి కారణం ఏంటని అడుగ్గా పాలు తాగను. పండ్లు తినను. చిన్నతనంలో చాలా రోజులు ఖాళీ కడుపుతోనే పడుకొన్నాను. నేను నూనెలు, మసాలాలు లేకుండా ఉడికించిన అన్నం, పప్పులో రెండు మూడు పచ్చి మిరపకాయలు కలిపి తింటాను అని ఆయన చెప్పారు.
తలకింద చెక్కపీటను పెట్టుకొని నేల మీద చాపపై పడుకోవడం తనకు అలవాటని తెలిపారు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోవడం, బాల్యంలో పేదరికం వెంటాడటంతో తనను తన బంధువులు ఓ సాధువుకు అప్పగించారని పేర్కొన్నారు. పబ్లిసిటీ అంటే ఇష్టం లేని స్వామి శివానంద తన ఫాలోవర్స్ కోరిక మేరకు గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో తన పేరును చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్న స్వామి శివానంద తనంతట తానుగా దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా రైళ్లలోనే ఒంటరిగానే ప్రయాణం చేస్తుంటారు. ఎలక్ట్రసిటీ, కార్లు, టెలిఫోన్లు లేని కాలంలో జన్మించిన స్వామి శివానంద తన కళ్ల ముందే వృద్ధి చెందిన టెక్నాలజీని చూసి అప్పుడప్పుడు ఆశ్చర్యానికి లోనవుతుంటానని చెప్పారు.