'అనంత' కరువు, తాగునీటి సమస్యలతో విలవిల
కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న అనంతపురం జిల్లాలో వరుసగా ఆరో ఏడాది కరువు తాండవిస్తున్నది. ఇది రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఒకటి. ఈ జిల్లా పూర్తిగా పొడి వాతావరణానికి, కరువుకు పెట్టింది పేరు.
హైదరాబాద్: తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ జిల్లా అనంతపురం కూడా పూర్తిగా కరువుకు మారుపేరు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలో వరుసగా ఆరో ఏడాది కరువు తాండవిస్తున్నది. ఇది రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఒకటి. ఈ జిల్లా పూర్తిగా పొడి వాతావరణానికి, కరువుకు పెట్టింది పేరు.
తక్కువ వర్షపాతం నమోదు కావడంతో అధికార వర్గాల అహంకార పూరిత ధోరణి, స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తదితర కారణాలు అనంతపురం వాసులకు మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. మానవ హక్కుల వేదిక, ఆశా - కిసాన్ స్వరాజ్ నెట్ వర్క్, మహిళా సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వరుసగా ఆరో ఏడాది అనంతపురం జిల్లా కరువు బారీన పడింది. దీంతో 4.87 లక్షల మంది ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల మందిలో 10 శాతానికి పైగా ఉంటుంది. ఫలితంగా ప్రజలు తాగునీటి కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తక్కువ వర్షపాతంతో పశుగ్రాసం కూడా లభించని వైనం
మరోసారి తక్కువ వర్షపాతం నమోదు కావడమే కాదు పశువులకు సరిపడా గ్రాసం కూడా లభించని దుస్థితి నెలకొంది. దీంతో పశువులు వ్యధశాలలు తరలిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయి. దీంతో గ్రామాలకు గ్రామాలే భారీస్థాయిలో వలసలు వెల్లువెత్తుతున్నాయి. 42 శాతం వ్యవసాయ బోర్లు పూర్తిగా పని చేయడం లేదు. భూగర్భ జలాలు 70 - 90 మీటర్ల లోతుకు పడిపోయాయి.
రైతుల సమస్యలు, బాగోగుల పట్ల అధికార యంత్రాంగం అహంకార పూరిత వైఖరి, స్థానిక అధికారుల నిర్లక్ష్యం ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లుల్లో సుమారు రూ.57 కోట్ల మేరకు గత ఎనిమిది నెలలుగా పెండింగ్ లోనే ఉన్నాయి. దీనికి కారణం భారీగా కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడమే. ప్రత్యేకించి కదిరి రీజియన్ పై ఎక్కువ ప్రభావం ఉన్నది.
బెంగళూరు నుంచి తమిళనాడు, కేరళ వరకూ వలసలే
అనంతపురం, నల్లమడ, అమడగురు, ఒడిస్సి డివిజన్లలోని ప్రజలు పని కోసం బెంగళూరు, కోచి, చెన్నై, కోయంబత్తూరు తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. వరుసగా ఆరో ఏడాది వర్షాభావంతో సతమతం అవుతున్న అనంతపురం జిల్లాలో పూర్తిస్థాయిలో కరువును తొలగించే వరకు తన జన్మ దినోత్సవ వేడుకలను ఇదే జిల్లాలో చేసుకుంటానని గత నెల 28న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 68వ జన్మ దినోత్సవ వేడుకల్లో పేర్కొనడం గమనార్హం.
మరోవైపు నెర్రలు తీసిన చెరువులు, భూగర్భ జలాలు అడుగంటి నీరందక మొరాయిస్తున్న మోటార్లు, ట్యాంకర్లతో అరకొరగా సరఫరాతో గ్రామాలు దాహంతో అల్లాడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు రోజుల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు. కొందరు నీటి ట్యాంకర్లను అప్పు చేసి కొనుక్కొంటుంటే..ఆ స్థోమత లేనివారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటికోసం పనులు మానుకుని ఇంటివద్ద కాచుకు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎండాకాలం ప్రారంభం నుంచి తాగునీటి సరఫరాపై ప్రభుత్వం తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా భూగర్భ జలాలు నానాటికీ అడుగుంటిపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతూనే ఉన్నది. నలుగురు సభ్యులు ఉన్న తమ కుటుంబానికి కనీసం 150 లీటర్ల నీరు కావాలని ఆర్టీసీ డ్రైవర్ చంద్రశేఖర్ తెలిపాడు. తమ వీధిలో నీరు సరఫరా చేసి 100 రోజులు దాటిందని ఆయన చెప్పాడంటే నీటి కొరత సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. చంద్రశేఖర్ వంటి వరకు నెలకు రెండు ట్యాంకర్ల నీరు ప్రైవేట్ నీటి సరఫరా సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కానీ సామాన్యుడి పరిస్థితే తలచుకుంటేనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వం రూ.73 కోట్లు కేటాయించినా లభించని ఉపశమనం
తాగునీటి సమస్య తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.73 కోట్లు కేటాయించింది. భూగర్భ జలాలు అడుగంటడంతో అవసరంలో సగం కూడా గ్రామాలకు ట్యాంకర్లు పంపలేని పరిస్థితి అధికార్లకు ఎదురవుతోంది. ప్రయివేట్ ఆధ్వర్యంలోని చెరువులు, వ్యవసాయ బావులను తాత్కాలిక ప్రాతిపదికన అద్దె/లీజుకు తీసుకొని నీటిని సరఫరా చేయాలి.
బోర్లు లోతు పెంచడం, బావుల్లో పూడికలు తొలగించి నీటి సరఫరా మెరుగు పరచాల్సి ఉన్నా అనుకున్నంత వేగంగా ఈ పనులు జరగడం లేదు. అత్యవసరంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం మరో రూ.4 కోట్లు కేటాయించింది. సమస్య తీవ్రతను బట్టి కలెక్టర్ ఈ నిధులు ఖర్చు చేయవచ్చు. ప్రతి మండలానికి మళ్లీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సి ఉంది.
జిల్లాలోని గోరంట్ల మండల కేంద్రంలో బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. ప్రభుత్వం అరకొరగా సరఫరా చేయడంతో గోరంట్ల మండల కేంద్రంలో 100 రోజులుగా పది శాతం ప్రజలకే నీరు అందుతోంది. మిగతా 90 శాతం మంది ప్రయివేట్ వ్యాపార సంస్థల నుంచి ట్యాంకర్లు తెప్పించుకొంటున్నారు.