ఇది ఖచ్చితంగా హెచ్చరికే: పాక్కు గుదిబండ సీపీఈసీ ప్రాజెక్ట్
వడ్డీ వ్యాపారి ముందు కొంచెం డబ్బు ఇస్తాడు. తర్వాత మళ్లీ అవసరానికి ఆదుకొంటాడు. చివరకు డబ్బు కట్టలేని స్థితికి వచ్చాక రుణ గ్రహీత ఆస్తి పాస్తులు రాయించుకుంటాడు.
న్యూఢిల్లీ: వడ్డీ వ్యాపారి ముందు కొంచెం డబ్బు ఇస్తాడు. తర్వాత మళ్లీ అవసరానికి ఆదుకొంటాడు. చివరకు డబ్బు కట్టలేని స్థితికి వచ్చాక రుణ గ్రహీత ఆస్తి పాస్తులు రాయించుకుంటాడు. ప్రపంచంలోని పేదదేశాలకు అభివృద్ధి పేరుతో రుణాలను ఇచ్చి కొంతకాలానికి అక్కడ ఉన్న విలువైన ప్రాజెక్టులను తక్కువ మొత్తానికి లీజుకు తీసుకునే దేశాలు వస్తున్నాయి. వీటితో చైనా అగ్రభాగంలో ఉన్నది. అభివృద్ధి పేరుతో శ్రీలంకకు చైనా భారీ ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. చైనా నుంచి తీసుకున్న రుణం భారత్ దాయాది దేశం పాకిస్థాన్కు హెచ్చరికగా మారనున్నది.
1971 - 2012 మధ్య శ్రీలంకకు మౌలిక వసతుల కల్పన పేరుతో చైనా 5 బిలియన్ డాలర్ల దాకా ఇచ్చింది. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిశాక మరిన్ని పెట్టుబడులు పెట్టింది. కానీ అనుకున్నంత ఆదాయం రాక 99 ఏళ్ల పాటు హంబన్టొటా నౌకాశ్రయంతో పాటు సమీపంలోని వేల ఎకరాలను భూములను చైనా స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.
వన్ బెల్ట్ వన్ రోడ్డు లో హంబన్ టోటా పోర్ట్ కీలకం
చైనా తలపెట్టిన 'వన్ బెల్ట్ వన్ రోడ్'లో ఈ పోర్టు ఉన్న ప్రాంతం అత్యంత కీలకం. అందుకే చైనా ఈ ప్రాంతంలో తిష్ఠవేయడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక ఓడరేవుల మంత్రి సమరసింఘే చెబుతున్నదాని ప్రకారం ఈ రేవు రక్షణ బాధ్యత శ్రీలంక నౌకాదళమే చూసుకుంటుంది. విదేశీ నావికాదళం దీన్ని బేస్గా ఉపయోగించుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. శ్రీలంకలో ట్రేడ్ యూనియన్లు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది దేశ ఆస్తులను చైనాకు తాకట్టు పెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రభుత్వం మాత్రం దీన్ని బాకీ తీర్చే ప్రయత్నంగా చూపుతోంది. ఇలా ఇది చైనా పనుపున చేరి, ఆ దేశం నుంచి రకరకాల రూపాల్లో వేల కోట్ల రూపాయల సాయం పొందుతున్న పాకిస్థాన్కు హెచ్చరిక వంటిదే.
కబ్జాలకు ఇదే చైనా పద్ధతి
''ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అధి క వడ్డీలకు అప్పులు ఇవ్వడం.. ఆయా ప్రాజెక్టుల్లో వాటా పొందడం.. ఆ దేశం అప్పు తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాక ఆయా ప్రాజెక్టుల యాజమాన్యం తానే స్వీకరించడం, ఆ పేరుతో ఆ దేశంలో భూమిని కబ్జా చేయడం'' ఇదే చైనా వ్యూహాత్మక విధానమని ఆర్థిక, రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం చైనా - పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) పేరుతో చైనా పాకిస్థాన్లో చేస్తున్న పని ఇదేనని.. శ్రీలంకను చూసైనా పాక్కు కనువిప్పు కలగాలని వారు చెబుతున్నారు. పాకిస్థాన్ భూభాగంలో శాశ్వతంగా పట్టు సాధించే ప్రయత్నంలో భాగమే సీపీఈసీ.. ఆ దేశం చైనా 'రుణ ఉచ్చు'లో పడుతోందని వారు హెచ్చరిస్తున్నారు. చైనా ఇచ్చే రుణాలకు వడ్డీలు ఎంత దారుణంగా ఉంటాయో కూడా వారు వివరిస్తున్నారు. హంబన్టోటా పోర్టు నిర్మాణానికి చైనా నుంచి శ్రీలంక రూ.1931 కోట్ల రుణం తీసుకున్నది. దీనికి చైనా వేసిన వడ్డీ 6.3శాతం పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థపై రూ.3,20,000 కోట్ల అప్పు పిడుగుపాటేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అప్పు తీర్చలేకపోతే శ్రీలంక తరహాలోనే పాకిస్థాన్ కూడా తన భూమిని చైనాకు కోల్పోవాల్సి ఉంటుంది.