ఔను! ఇక జీమెయిల్ ద్వారా డబ్బులు బదిలీ చేసుకోవచ్చు!
ఇప్పుడు టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఓ సరికొత్త మనీ ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెడుతోంది. యూజర్లు కేవలం ఓ జీమెయిల్ ఐడీ కలిగి ఉంటే చాలు, దాని ద్వారా డబ్బులు పంపేందుకు, తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు సందేశాలు, ఫైల్స్ పంపేందుకు, రిసీవ్ చేసుకునేందుకు పరిమితమైన జీమెయిల్ మరో కీలక ఫీచర్తో ముందుకు వచ్చింది. ఐఎంపీఎస్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఆధార్ పే వంటి రక రకాల మార్గాల్లో ప్రస్తుతం వినియోగదారులు డబ్బులు బదిలీ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఓ సరికొత్త మనీ ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెడుతోంది. యూజర్లు కేవలం ఓ జీమెయిల్ ఐడీ కలిగి ఉంటే చాలు, దాని ద్వారా డబ్బులు పంపేందుకు, తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
జీమెయిల్ యాప్ను ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంపై వాడుతున్న యూజర్లు ఇకపై నేరుగా ఈ-మెయిల్స్ పంపడం ద్వారానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అందుకు గాను ఓ కొత్త ట్రాన్స్ఫర్ పద్ధతిని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రస్తుతం యూఎస్ఏలోని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీని వల్ల యూజర్లు అవతలి వ్యక్తి మెయిల్ ఐడీ, ఎంత డబ్బు పంపుతున్నారో ఆ మొత్తాన్ని మెయిల్లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్లో ఎంటర్ చేస్తే చాలు.
దీంతో అవతలి వ్యక్తులకు క్షణాల్లోనే మెయిల్ ద్వారా డబ్బు అందుతుంది. దాన్ని వారు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకు గాను ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.