ఎఫెక్ట్ ఐటిపైనే: హెచ్1బీ వీసాలో మార్పుతో భారమేనా?
ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం, హెచ్ 1 బీ వీసాల జారీ విధానంలో మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రుష్టి పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
న్యూఢిల్లీ: ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం, హెచ్ 1 బీ వీసాల జారీ విధానంలో మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రుష్టి పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దాని ప్రభావం ఎంతో తెలియజేయాలని భారత పారిశ్రామిక రంగం, ప్రత్యేకించి నాస్కామ్, ఐటీ పారిశ్రామికవేత్తలను కోరింది. వీసా సంబంధిత సమస్యల పరిష్కారంపై అమెరికాతో చర్చలకు వీలుగా దాని ప్రభావం వివరాలు అందజేయాలని కోరింది.
వీసాల జారీలో ఆంక్షల వల్ల వ్యాపారాలపై పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలేమిటో సవివరంగా సమాచారం ఇవ్వాలని సూచించింది. ఈ విషయమై నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖరన్, సీఐఐ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, ఐటీ దిగ్గజాలతో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించారు కూడా.
ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయనున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖరన్ తెలిపారు. భారత కంపెనీల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న లబ్ది, భారతదేశంలో అమెరికా కంపెనీలు పొందుతున్న ప్రయోజనాలు, రెండు దేశాలపై పడే ప్రభావం తదితర వివరాలు ఇవ్వాలని కేంద్రం కోరింది.
ఇలా ఐటీపై ప్రభావం
ఇప్పటికిప్పుడు అమలులోకి రాకపోయినా హెచ్ 1 బీ వీసాల జారీలో భారీ మార్పులు రానున్నాయి. ఇందుకోసం ఇద్దరు సీనియర్ సెనెటర్లు అమెరికా సెనెట్లో బిల్లును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లు ఆమోదం పొంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంచేస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా మారుతుంది. హెచ్ 1 బీ వీసాల జారీ విధానం మారిపోతుంది. ఐటీ నిపుణులకు కనీస వేతనంగా ప్రస్తుతం ఉన్న పరిమితి 60 వేల డాలర్ల (ఈ వేతనం 1989లో నిర్ణయించింది) నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంచడం వల్ల ఐటీ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడనున్నది. దీంతోపాటు నిర్వహణ భారం పెరిగిపోతుందని అంచనాలు ఉన్నాయి.
అసలు పరిస్థితి ఇదీ..
ఔట్ సోర్సింగ్ సేవల కింద భారత ఐటీ సంస్థలు ఏటా రూ.7.46 లక్షల కోట్ల (110 బిలియన్ డాలర్ల) టర్నోవర్ సాధిస్తున్నాయి. ఇది భారత దేశ జీడీపీలో 9.3 % కాగా, సుమారు 30 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఐటీ పరిశ్రమలోనే అత్యధిక ఉపాధి లభిస్తోంది. ఐటీ సేవల్లో అమెరికా తర్వాతీ స్థానంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఉంది. అమెరికాలో 62%, ఈయూలో 23% ఐటీ సేవలు అందిస్తున్నాయి.
ట్రంప్ నిర్ణయాలతో కలవరం
ఎన్నారైలతోపాటు అమెరికాలోని లక్షల మంది శరణార్థులు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో కలవర పడుతున్నారు. అమెరికానుంచి భారీగా శరణార్థులను తరిమేస్తానని ట్రంప్ ప్రకటస్తే. తాజాగా వారిని స్వదేశాలకు పంపేందుకు ప్రత్యేకంగా ఓ దళం ఏర్పాటుచేస్తారన్న ఊహాగానాలు వస్తుండటంతో వారిలో కలవరానికి కారణంగా కనిపిస్తున్నది. వలసలు, కస్టమ్స్ విభాగం (ఐసీఈ) వందల సంఖ్యలో వలసదారులను అదుపులోకి తీసుకుంది. అట్లాంటా, ఆస్టిన్, షికాగో, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ల్లో పెద్ద స్థాయిలో తనిఖీలు చేపట్టింది. కాలిఫోర్నియా పరిధిలో 160 మందిని అరెస్టు చేసినట్లు.. వారిలో 75 శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఐసీఈ అధికారులు తెలిపారు. గత వారాంతం వరకు 37 మంది అక్రమవలసదారులను మెక్సికోకు పంపినట్లు తెలిపారు. చట్టాలను అతిక్రమించి దుందుడుకు చర్యలకు పాల్పడబోమని, వలసదారులు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని ఐసీఈ అధికారులు అంటున్నారు. చికాగో, లాస్ఏంజిల్స్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో ఐసీఈ అధికారుల విస్తృత తనిఖీలతో అమెరికానుంచి తమను తరిమేసేందుకు ప్రత్యేక డిపోర్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు శరణార్థులు ఆందోళన చెందుతున్నారు.
శరణార్థులపై ఐసీఈ తనిఖీలు..
ఐసీఈ తనిఖీలతో మానవహక్కులను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆమ్నెస్టీ పేర్కొన్నది. దీనిపై ఐసీఈ అధిపతి థామస్ హోమన్తో అత్యవసరంగా భేటీ కావాలని ఆమ్నెస్టీ భావిస్తున్నట్లు తెలిపిం ది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వాగ్దానం చేసిన డిపోర్షన్ ఫోర్స్.. ఇప్పుడు పూర్తిగా దిగినట్లు భావిస్తున్నా మని హోమన్కు ఆమ్నెస్టీ ఓ లేఖ కూడా రాశారు. సోమ, మంగళవారాల్లో న్యూయార్క్లో జరిగే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన పాకిస్థాన్ సెనేట్ డిప్యూటీ చైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైద్రీ వీసాలను అమెరికా తిరస్కరించింది. దీనికి అమెరికా సాంకేతిక కారణాలను చూపినట్లు ఓ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సెనేట్ చైర్మన్ రబ్బానీ సూచనతో మిగతా ప్రజాప్రతినిధులు సైతం పర్యటనను రద్దు చేసుకున్నారు.