నిబంధనలు మరింత కఠినం: హెచ్1బీ వీసా కలే!
భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉపయోగించే హెచ్1-బీ వీసా నిబంధనలు కఠినతరం చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ అభ్యర్థి జెఫ్ సెషన్స్ సంకేతాలిచ్చారు.
వాషింగ్టన్: భారత ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉపయోగించే హెచ్1-బీ వీసా నిబంధనలు కఠినతరం చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ అభ్యర్థి జెఫ్ సెషన్స్ సంకేతాలిచ్చారు. హెచ్1బీ, ఎల్1 వీసాలను దుర్వినియోగం చేయకుండా చట్టాలను రూపొందిస్తామని చెప్పారు.
'మనం ఓపెన్ వరల్డ్లో ఉన్నాం. ఏ అమెరికన్ జాబ్నైనా తక్కువ జీతానికి పనిచేసే మరో విదేశీయుడితో భర్తీ చేస్తామనుకుంటే అది పొరపాటే అవుతుంది' అని సెషన్స్ ఇతర చట్టప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మనకూ హద్దులు ఉంటాయని, మనం మన పౌరుల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని అన్నారు. ఆ దిశగా మీతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కింది అని సెషన్స్ అన్నారు.
కాగా, యూఎస్ సెనేట్ కూడా ఓకే చెప్తే జెఫ్ సెషన్స్ అటార్నీ జనరల్గా నియమితులవుతారు. అప్పుడు ఇమ్మిగ్రేషన్ సంబంధిత స్పెషల్ కౌన్సిల్ కూడా సెషన్స్ చూసే జస్టిస్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఇమ్మిగ్రేషన్కు సంబంధించి వివక్షరహిత, జాతీయత చట్టాలను ఈ శాఖ రూపొందిస్తుంది.
నిజానికి ఇది వీసాల విషయంలో విదేశీయులపై వివక్ష లేకుండా చూసేందుకు ఏర్పాటైన విభాగమే అయినా.. అమెరికన్ల పట్ల కూడా పనిచేసే స్థలంలో వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత దీనిపై ఉంటుంది. ఇప్పటికే స్థానిక అమెరికన్లను తొలగించి వారి స్థానంలో తక్కువ జీతానికి పనిచేసే హెచ్1బీ వీసాలున్న విదేశీయులను నియమిస్తున్నారని సెనెట్ జూడిషియరీ కమిటీ ఛైర్మన్, సెనెటర్ చార్లెస్ గ్రాస్లీ అన్నారు.
'ఒబామా ప్రభుత్వం అమెరికా ఉద్యోగుల హక్కులను కాపాడటంలో విఫలమైంది. మరి మీరు ఏం చేయబోతున్నారు' అని గ్రాస్లీ.. సెషన్స్ను ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ.. 'ఇది కచ్చితంగా స్థానిక అమెరికన్లపై వివక్ష చూపడమే అవుతుంది. దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది' అని సెషన్స్ చెప్పారు.
గతంలో గ్రాస్లీ, సెషన్స్తోపాటు డిక్ డర్బిన్ అనే మరో సెనేటర్ కలిసి స్థానిక అమెరికన్లకు అనుకూలంగా హెచ్1బీ వీసా బిల్లును రూపొందించారు. ఇప్పటికే 50 మందికిపైగా లేదా కంపెనీలో 50 శాతానికిపైగా హెచ్1బీ వీసా ఉద్యోగులు ఉంటే.. అలాంటి కంపెనీలకు కొత్తగా హెచ్1బీ వీసా ఉద్యోగులను తీసుకొనే అవకాశం ఉండదని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. తాజా నిబంధనలు అమల్లోకి వస్తే ఐటీ ప్రొఫెషనల్స్కి వీసా లభించడం కష్టసాధ్యమే అవుతుంది.