కల కంచికి!: ఐటీ ఉద్యోగుల డ్రీమ్స్ క్లోజ్.. పెళ్లి మాటే వద్దు..
ఆటోమేషన్.. పాశ్చాత్య దేశాల స్థానికత డిమాండ్లు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొలువులపై మెత్తని కత్తి వేలాడుతోంది.
హైదరాబాద్: ఆటోమేషన్.. పాశ్చాత్య దేశాల స్థానికత డిమాండ్లు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొలువులపై మెత్తని కత్తి వేలాడుతోంది. తత్ఫలితంగా ఉద్యోగ భద్రత లేక ఐటీ రంగ ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
ఇల్లు, వాహనాల కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు తగ్గుముఖం పడుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.
ఇక విలాసంగా కనిపించే కార్ల కొనుగోలుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. అమెరికాలోనూ ఒక్క ఉద్యోగానికి పది మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే కన్సల్టెన్సీ సంస్థలు కనుమరుగవుతున్నాయి. మొహం చాటేస్తున్నాయి.
సొంత కల నెరవేరుతుందని...
రమేష్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. భాగ్య నగరంలో విలాసవంతమైన ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ఇల్లు కొనేందుకు బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. బ్యాంక్ రుణానికి దరఖాస్తు చేయడం, బ్యాంక్ ఆ మొత్తం మంజూరు చేయడం చకచకా జరిగి పోయాయి. సొంతింటి కల నెర వేరుతుందని ఆశపడ్డాడు. అంతలోనే ఆయన పని చేస్తున్న ఆఫీసులో ఒకేరోజు 25 మందిని ఉద్యోగాల్లోంచి తొలగింపునకు అభద్రతాభావానికి గురయ్యారు. బిల్డర్ వద్దకు వెళ్లి తాను చెల్లించిన అడ్వాన్స్లో 10 శాతం వదులుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసేసుకున్నారు.
Recommended Video
మూడు నెలల ముందు ఇలా కంపెనీలు ఉద్వాసన
ఇంజనీరింగ్ కోర్సు పూర్తి కాగానే ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరి ఐదేళ్లుగా పని చేస్తున్న నానికి తల్లిదండ్రులు ఒక పెళ్లి సంబంధం చూశారు. ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. పెళ్లికి సరిగ్గా మూడు వారాల ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాలని కంపెనీ నుంచి అరవింద్ అనే వ్యక్తికి ఆదేశం అందింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆ కుర్రాడు ఏకంగా పెళ్లిని రద్దు చేసేసుకున్నాడు.
మూతబడ్డ 23 కంపెనీలు
ప్రముఖ ఐటీ కంపెనీలు ఎడాపెడా ఉద్యోగాలు తొలగిస్తుండటంతో వాటిలో పని చేస్తున్న వేల మంది అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటున్నారు. గత మూడు నెలల్లోనే హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు 4000 మంది ఉద్యోగులను తొలగించాయి. 23 చిన్నాచితక సాఫ్ట్వేర్ సంస్థలు మూతపడ్డాయి. కళ్ల ముందే సహచరులు ఉద్యోగాలను కోల్పోతుండటంతో మిగతా వారు భవిష్యత్పై బెంగ పెట్టుకున్నారు. ఎప్పుడేమవుతుందో తెలియక కొందరు.. ఇల్లు కొనుగోలుకు ఇచ్చిన అడ్వాన్స్ను వెనక్కి తీసుకుంటున్నారు. సైబరాబాద్ ప్రాంతంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల సముదాయంలో ఫ్లాట్ బుక్ చేసుకున్న ఐటీ ఉద్యోగుల్లో మూడొంతుల మంది డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొమ్ము వెనక్కి తీసుకుంటున్నామన్న వారి ఆవేదనను అర్థం చేసుకున్న సదరు సంస్థ అడ్వాన్స్ బుకింగ్ నగదులో 10% కోత పెట్టకుండానే వెనక్కి ఇచ్చేసింది. మరికొన్ని సంస్థలు మాత్రం కొత్త బుకింగ్ వస్తేనే డబ్బులు వాపస్ చేస్తామని మొండికేస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలపై ఆధారపడ్డ స్టార్టప్ కంపెనీలు కూడా ప్రాజెక్టుల్లేక పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇలా తగ్గిన కార్ల కొనుగోళ్లు
‘రూ.48 వేల నెలసరి వాయిదాతో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అందుకే నేను ఇల్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నా..''అని మాదాపూర్లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న చంద్ర వాపోయాడు. తన వంటి వారు వందల మంది ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక అయోమయంలో పడ్డారని, కొందరైతే పెళ్లిళ్లు కూడా రద్దు చేసుకున్నారని చెప్పాడు. మాదాపూర్లో కార్ల డీలర్లు.. గత ఏడాది విక్రయించిన కార్లలో ఈసారి సగం కూడా అమ్మడం లేదు. ‘అమ్మకాల సంగతెలా ఉన్నా... కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదు. కారు బుక్చేసి డెలివరీ అయ్యే సమయానికి రద్దు చేసుకుంటున్నారు' అని ప్రముఖ కార్ల డీలర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.
తగ్గిన కొత్త ఆర్డర్లు ఇలా
గత ఏడాది నుంచి కొత్తగా ప్రాజెక్టులు లేక సీనియర్ ఉద్యోగులను వదులుకోవాల్సి వస్తోందని బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఐటీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఓ వెబ్సైట్లో వ్యాఖ్యానించారు. ‘2012 - 2014 సంవత్సరాలతో పోలిస్తే 2014 - 2016లో దాదాపు అన్ని కంపెనీలకు 26 నుంచి 40 శాతం మేర కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయి. ఆ మేరకు తమ ఖర్చులు తగ్గించుకుంటేనే తమ ఆదాయాన్ని స్థిరంగా కాపాడుకోగలుగుతామని పేర్కొంటున్నారు. అప్పుడే తమ ఇన్వెస్టర్లకు తమపై విశ్వాసం సడలకుండా ఉంటుంది. అందుకు.. అవసరం లేని ఉద్యోగులను వదులుకోవడం తప్ప మరో మార్గం లేదని టెక్కీలు చెప్తున్నారు. వృత్తి నైపుణ్యం లేనివారిని వదిలించుకుంటే సమస్య ఏమిటి? దానికి అంతగా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అదే వెబ్సైట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే నైపుణ్యం లేని వీరికి ఐదారేళ్లలో వారి వేతనాలను 300 నుంచి 400 శాతం ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారికి కేవలం వారి కంపెనీల బాగు తప్ప సామాజిక బాధ్యత లేదని మండిపడుతున్నారు.
అలా కొత్త ఇంజినీర్ల నియామకాలు..
ఒక వైపు సీనియర్ ఉద్యోగులను వదిలించుకుంటున్న కంపెనీలు మరోవైపు ఈ ఏడాది జోరుగా క్యాంపస్ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. వివిధ కాలేజీల నుంచి అందిన సమాచారం ప్రకారం.. గత ఏడాది కంటే ఈ ఏడాది కంపెనీలు 10 శాతం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ‘మా కాలేజీకి వచ్చే దాదాపు అన్ని కంపెనీలు ఈ ఏడాది 10 శాతం ఎక్కువకు ఇండెంట్ ఇచ్చాయి. వాటిలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు బహుళజాతి కంపెనీలు కూడా ఉన్నాయి' అని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు రాని సంస్థలు కూడా ఈసారి నియామకాలకు ముందుకొస్తున్నాయని చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగులకు తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడానికి ఐటీ సంస్థలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వాదనలను నాస్కామ్ వీటిని తిప్పి కొడుతోంది. కొత్తగా ప్రాజెక్టులు లేనప్పుడు కొత్త ఉద్యోగులతో 75 శాతం పనులు చేసుకోగలుగుతామని చెబుతోంది.
ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీ
అమెరికాలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఐటీ ఉద్యోగాల కోసమే ఎంఎస్ చేసేందుకు అక్కడికి లక్షల సంఖ్యలో వెళ్లిన విద్యార్థులకు ఉద్యోగం దొరకడం గగనమైంది. గడచిన నాలుగేళ్లలో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారంటే ఉద్యోగాల కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ ఏడాది 1.25 లక్షల మంది ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేట ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కన్సల్టెన్సీ సంస్థల ద్వారా తేలిగ్గా ఉద్యోగం సాధించిన వారికి ఇప్పుడు అది అంత ఈజీగా లేదు. కన్సల్టెన్సీ సంస్థలు దొంగ సర్వీసు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. దీంతో ఈ ఏడాది 13 శాతం కన్సల్టెన్సీలు మూతపడ్డాయి.
నిరుద్యోగిత పెరుగుదలకు ఇవీ కారణాలు
దానికి తోడు ఐటీ వృత్తి నిపుణులు ఏటా లక్షల సంఖ్యలో యూనివర్సిటీల నుంచి బయటకు వస్తుండటం కూడా ఉద్యోగాలు దొరకకపోవడానికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక ప్రత్యేక కథనంలో విశ్లేషించింది. ‘ఇప్పుడు అమెరికాలో ఒక వృత్తి నిపుణుడు అవసరం ఉంటే పది మంది పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాన్ని ఇక్కడి విశ్వవిద్యాలయాలు పెంచి పోషిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాచుర్యం కల్పించి విదేశీ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే పనిలో బిజీగా ఉన్నాయి' అని విరుచుకుపడింది. దానికి తోడు కనీస వార్షిక వేతనం 80 వేల డాలర్లు చేయడంతో ఐటీ సంస్థలు నియామకాలను తగ్గించుకుంటున్నాయి. గతేడాది అమెరికాలో విశ్వవిద్యాలయాల నుంచి జరిపిన రిక్రూట్మెంట్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది 65 శాతం నియామకాలు తగ్గాయి.