మరణంపై కలాంకు ముందే తెలుసా, ఆఖరి కోరిక?
తన మరణం గురించి కలాంకు ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నారు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన అరుణ్ తివారీ. కలాంతో 33 ఏళ్లపాటు సన్నిహితంగా మెలిగిన ఆయన సహాయకుడు, పుస్తక రచనలో సహకారం అందించారు అరుణ్ తివారీ.
కలాం తాజా పుస్తకం ‘ట్రాన్సెండెన్స్'లో తాత్వికపరమైన ప్రకటన చేశారని అన్నారు. ‘‘చివరకు ప్రముఖ స్వామీజీ నన్ను భగవంతుడి సమతుల్య కక్ష్యలోకి నెట్టారు. ఇక ఎలాంటి యుక్తులు అవసరం లేదు. శాశ్వతమైన అంతిమ స్థితికి నన్ను చేర్చారు'' అంటూ కలాం ఆ పేజీలో రాశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్న తివారీ, కలాంకు తన మరణంపై ముందే తెలిసిపోయిందని చెబుతున్నారు.
ఆ మాటలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పంక్తులను చదువుతుంటే ఆయన ముందుగానే ఏదో హెచ్చరించినట్లే ఉందని చెప్పారు. జులై 20న గుజరాత్లోని సారంగపూర్లో ప్రముఖ్ స్వామీజీకి ఆ పుస్తకాన్ని అందజేసిన తర్వాత తిరుగు పయాణంలో కారులో తమ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న సంభాషణ కూడా అదే భావనను కలిగించిందన్నారు.
కాగా, పది రోజుల కిందట తన మనవరాలితో మాట్లాడుతూ ‘ఇక నేను నీ దగ్గరికి రాను, నీవే నా దగ్గరికి రావాలి' అన్నారని తెలిసింది. అబ్దుల్ కలాం చనిపోవడానికి ఒక రోజు ముందు షిల్లాంగ్నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 99 ఏళ్ల తన సోదరుడు మహమ్మద్ ముతు మీరా లెబ్బాయి మారైకర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే.
షిల్లాంగ్లో చాలా చలిగా ఉందని కూడా కలాం చెప్పారని ఆయన తెలిపారు. త్వరలోనే 100వ ఏడులోకి ప్రవేశిస్తున్న మారైకర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు కలాం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే, ఆ కలతీరకుండానే కలాం తుదిశ్వాస విడిచారని సలీం కన్నీటిపర్యంతమయ్యారు.