అడ్రస్ పంపితే చాలు..: కొత్త జంటలకు పోస్టులోనే శ్రీవారి ఆశీస్సులు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది. అంతేకగా, భక్తులు పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు.. శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది.
వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు. ఇందుకు ప్రతీకగా.. శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు.
నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపడం జరుగుతుంది. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన 'కల్యాణ సంస్కృతి' పేరిట ఓ పుస్తకాన్ని, టీటీడీ ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.
ఇందుకోసం నూతన వధూవరులు 'కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కెటి రోడ్డు, తిరుపతి- 517501' పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని టీటీడీ సూచించింది.