హౌస్ వైఫ్ పాకెట్ మని రాకెట్ లా బయటకు
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చెయ్యడంతో ఇంతకాలం భద్రంగా దాచి పెట్టుకున్న గృహిణులు ఇప్పుడు తమ వద్ద ఉన్న పా(జా)కెట్ మనీని బయటకు తీసి ఏమండి ఈ నోట్లు మార్చుకుని రండి ! అంటు భర్తలను బుజ్జగిస్తున్నారు.
ఇంటి ఖర్చులు, అవసరాల కోసం తాము ఇంతకాలం ఇచ్చిన డబ్బులో మా భార్యలు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టుకున్నారా ? అంటు అనేక మంది భర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగాలు చేసుకుంటున్న భర్తలు తమ ఇంటి ఖర్చులు, దినసరి సరుకులు, పిల్లల చదవులు, పాలు, పేపర్, కంరెట్ బిల్లులతో పాటు వివిధ అవసరాలు చూసుకోవడానికి భార్యలకు డబ్బు ఇస్తుంటారు.
నెల వచ్చిందంటే జీతం ఎప్పుడు వస్తుంది అంటూ కొందరు భార్యలు భర్తలను పీడిస్తుంటారు. జీతం వచ్చిన వెంటనే భార్యలకు ఇవ్వాల్సిన వాటా (ఖర్చులు) ఇచ్చేసి హమ్మయ్యా అంటు ఊపిరిపీల్చుకుంటుంటారు.
ఆ డబ్బులో అన్ని ఖర్చులు పోయిన తరువాత మిగిలిన సోమ్మును ఇల్లాలు భర్తకు తెలియకుండా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటుంటారు. ఇది అందరి ఇళ్లలో జరిగే విషయమే. అయితే ఇప్పుడు రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు అయిన తరువాత ఇంత కాలం తమ దగ్గర ఉన్న డబ్బు ఏమి చెయ్యాలో తెలియక అనేక మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.
ఎదో ఒకటి చెప్పి భర్తలకు డబ్బు ఇచ్చి ఈ నోట్లు మార్చుకురండి అంటు ప్రాధేయపడుతున్నారు. కొంత మంది దగ్గర రూ. కొన్ని వేల రూపాయలు చూసిన భర్తలు షాక్ కు గురౌతున్నారు. మా దగ్గరే ఇంత డబ్బులేదే ? అంటూ నాలుక కరుచుకుంటున్నారు.
ఏమైనా ఇల్లాలు ఇల్లాలే అంటు మెచ్చుకుంటు వారి దగ్గర ఉన్న డబ్బులు తీసుకు వెళ్లి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడుతున్నారు. ఆ నోట్లు మార్చుకుని అందులో కొంత డబ్బులో కొట్టేస్తున్న భర్తలు మిలిగిన సోమ్ము భార్యలకు ఇస్తున్నారు.
రూ. 500, రూ. 1,000 నోట్లు మార్చుకుని తిరిగి ఎంత ఇస్తే అంత తీసుకుంటున్న మహిళలు 'చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం'అన్నట్లుగా నొరు మెదపకుండా ఉంటున్నారు. ఇలా దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గురువారం వెలుగు చూశాయి.