మిషన్ కాకతీయ ఎఫెక్ట్: నల్గొండలో వెనుకబాటు.. నత్తనడకన పనులు
కాలం కరిగిపోతున్నది. వరుసగా మూడో ఏటా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనులకు అంతరాయం కలుగుతోంది.
హైదరాబాద్: కాలం కరిగిపోతున్నది. వరుసగా మూడో ఏటా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనులకు అంతరాయం కలుగుతోంది. అధికార యంత్రాంగం నిరాసక్తంగా వ్యవహరించడం కూడా ఈ పథకం అమలులో వెనుకబాటు తనం కొనసాగుతున్నది.
పూడిక తీత పనులు చేపట్టేందుకు వరుణ దేవుడు అడ్డుగోడగా మారుతుండటంతో పరిస్థితి మొదటికే మోసం వచ్చేలా ఉన్నదని నిపుణులు అంటున్నారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానస పుత్రిక 'మిషన్ కాకతీయ'. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సారథ్యంలో వరుసగా రెండేళ్ల పాటు ఆగమేఘాల మీద అమలు చేసిన 'మిషన్ కాకతీయ' ముచ్చటగా మూడో ఏడాది అమల్లోకి వచ్చే సరికి లక్ష్యాల సాధనకు దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆలస్యంగా ప్రారంభించిన పనులు పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ప్రత్యేకించి ఫ్లోరైడ్ సమస్యకు ఆలవాలమైన నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లా పరిధిలోనే చెరువులు, కుంటలు, వరదల కాలువల మరమ్మతుకు చేపట్టిన 'మిషన్ కాకతీయ' పనుల్లో జాప్యం జరుగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
వచ్చే ఏడాది వరకూ ఆగక తప్పదా?
టెండర్ల ప్రక్రియలో జాప్యానికి తోడు గుత్తేదారుల ఒప్పందం ఆలస్యం కావటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువుల అభివృద్ధికి శాపంగా మారింది. ఈ నెలాఖరు నాటికి చెరువుల్లో పూడికతీసి వాటి కట్టలను పటిష్ఠపరచాలని పెట్టుకున్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. గడువు కరిగిపోతున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిషన్ కాకతీయ మూడో విడత కింద పలు చెరువులు, కుంటల్లో ఇప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో పూడికతీత పనులకు అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా లక్ష్యం సాధించడం గగనంగానే కనిపిస్తోంది.. పనులు పూర్తి కావాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శిథిలావస్థలో వరద కాల్వలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో విడత మిషన్ కాకతీయ కింద 951 చెరువులు, కుంటలు, వరద కాల్వలను పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనల్లో 866 చెరువుల పునరుద్ధరణకు నీటి పారుదలశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.253 కోట్లు మంజూరుచేసింది. జూలై నాటికి పనులు పూర్తి చేయాలని గడువు విధించింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 852 చెరువులకు మాత్రమే టెండర్ల ప్రక్రియ పూర్తైంది. 681 చెరువుల పనుల కోసం గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం 666 చెరువుల్లో పనులు ప్రారంభించారు.
పనులే కాలేదు..
మరో 200 చెరువులు, వరద కాల్వల అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అందులో సూర్యాపేట జిల్లాలో అధికంగా 159 చెరువుల పనులు ప్రారంభం కాకపోవటం గమనార్హం. వాగులు, వంకల నుంచి చెరువులకు నీరు మళ్లించే కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని మూడో విడత ద్వారా చేపట్టేందుకు అధికారులు శ్రీకారం చుట్టిన అందుకు వరుణుడు సహకరించడం లేదు. దీంతో కాల్వలను అధునికీకరించకపోవడంతో చెరువులను అభివృద్ధి చేసినా.. ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి వరద నీళ్లు వృథాగా వెళుతున్నాయి.
తెలంగాణ వచ్చాకే మిషన్ కాకతీయ ఇలా
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో తొలిసారి కొలువు దీరిన మిషన్ కాకతీయపథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 4,760 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా 20 శాతం చొప్పున చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తొలి విడత మిషన్ కాకతీయలో 952 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపితే అందులో 834 చెరువులకు అనుమతులు మంజూరు చేసింది. వాటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.324 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు 100 % పనులు పూర్తి అయ్యాయి. రెండో విడతలో 1,062 చెరువుల అభివృద్ధికి సర్కారు పచ్చజెండా ఊపింది. రూ.450 కోట్లు మంజూరుచేసింది. ఇప్పటివరకు 60 శాతం చెరువుల్లో పనులు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది మూడో విడతలో 866 చెరువుల్లో చేపట్టిన పనుల్లో 30 శాతం కూడా పూర్తి కాలేదు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుతున్నాయి. పూడికతీత పనులు నిలిచిపోయాయి. చెరువు కట్టల పనులు నత్తనడకన సాగుతున్నాయి.