కనీ వినీ ఎరుగని రహస్యం: హిందూస్థాన్ గ్రేట్వాల్
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రహస్యం. చరిత్రకారులనే విస్మయపరుస్తున్న వైనం. భారత దేశానికి సరిగ్గా మధ్యలో కేంద్రీక్రుతమైంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 80 కిలోమీటర్ల పొడవునా ప్రాచీన రాతిగోడ విస్తరించి ఉ
భోపాల్: దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రహస్యం. చరిత్రకారులనే విస్మయపరుస్తున్న వైనం. భారత దేశానికి సరిగ్గా మధ్యలో కేంద్రీక్రుతమైంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 80 కిలోమీటర్ల పొడవునా ప్రాచీన రాతిగోడ విస్తరించి ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుంచి జబల్పూర్ వరకు విస్తరించి ఉన్న ఈ గోడ కొన్ని చోట్ల నేరుగా, మరికొన్ని చోట్ల వంకరటింకర, ఇంకొన్ని ప్రాంతాల్లో 15 అడుగుల ఎత్తుతో టవర్లను.. మరికొన్ని ప్రాంతాల్లో రాళ్ల వరుసను తలపిస్తున్నది. గోరఖ్పూర్ టౌన్షిప్ - డియోరీ నుంచి రైసిన్ జిల్లా చెయిన్పూర్ బర్డీలోని చోకీగఢ్ వరకు విస్తరించి ఉన్నది.
చైనా గ్రేట్ వాల్ తర్వాతీ స్థానం..
అధికారికంగా ధ్రువీకరిస్తే దేశంలోకెల్లా అతిపెద్ద దుర్గంగా.. చైనా గ్రేట్వాల్ తర్వాత అంతర్జాతీయంగా ద్వితీయ స్థానంలో నిలువనున్నది. స్థానికులు మాత్రం 'ది వాల్' అని పిలుస్తారు. వింధ్యా పర్వతశ్రేణుల మధ్య నుంచి నిర్మితమై ఉన్న ఈ వాల్ చుట్టూ టేకు చెట్లు, పొలాలు దర్శనమిస్తాయి. ఒకచోట 20 ఏళ్ల క్రితం నిర్మించిన డ్యామ్ దర్శనమిస్తుంది.
విస్మయం కలిగించే రహస్యాలు
గోడ పొడవునా పాడుబడిన ఇండ్లు, వైభవోపేతమైన ఆలయాల శిథిలాలు, విగ్రహాల విడి భాగాలు, మెట్లు నిర్మించిన బావులు, చెరువులు, వింత పాముల గుర్తులు కనిపిస్తాయి. 1980వ దశకంలో ఈ గోడ గురించి విన్న రాజీవ్ చౌబే (57) అనే ఫార్మసిస్ట్ మోటారు బైక్పై మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక రోజంతా అన్వేషించానని గుర్తు చేశారు. ఈ గోడ రహస్యాల అధ్యయానికి వచ్చే వారికి సుఖ్దేవ్ మహరాజ్ (58) అనే సన్యాసి ఆతిథ్యమిస్తూ గోడ వద్దకు వెళ్లేందుకు గైడ్గానూ వ్యవహస్తున్నారు.
చిక్కుముళ్ల నిలయం
గోడ పొడవునా అద్యంతం చిక్కుముళ్ల పర్వమే. దీని వెంట ఎక్కడా అధికారిక ముద్రలుగానీ, శాసనాలుగానీ లేవని దశాబ్ద క్రితం సర్వేచేసిన నారాయణ వ్యాస్ అనే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ( రిటైర్డ్ ఉద్యోగి పేర్కొన్నారు. 10వ, 11వ శతాబ్దాల్లో పార్మార్ రాజులు ఈ గోడను నిర్మించి ఉంటారని. 9 - 13 శతాబ్దాల మధ్య రాజ్య పాలనచేసిన రాజపుత్రులు నిర్మించి ఉంటారని పరస్పర విభిన్న కథనాలు ఉన్నాయి. కానీ 1975లో ఈ గోడను వీక్షించిన రెహ్మాన్ అలీ అనే చరిత్రకారుడు మాత్రం నారాయణ వ్యాస్ అభిప్రాయాలతో విభేదించారు. ఇది పార్మార్ల కాలం నాటిది కాదన్నారు. ప్రామాణికమైన రాళ్లతో 17వ శతాబ్దిలో బ్రిటిష్ వారు ఈ గోడ నిర్మించి ఉండవచ్చునన్నారు.
ఏ రాజు నిర్మించాడో ముఖ్యం కాదు..
ఏ రాజు నిర్మించాడన్నది ముఖ్యం కాదని, ఎందుకు ఇంత పొడవైన గోడ నిర్మించి వదిలేశారన్నదే ప్రశ్న అని పేర్కొన్నారు. నారాయణ వ్యాస్తోపాటు గతేడాది సర్వేలో పాల్గొన్న గోరఖ్ పూర్ జ్యోతిష్కుడు రాఘవేంద్ర ఖరే స్పందిస్తూ సైనిక రక్షణ వ్యూహంలో భాగంగా ఈ గోడ నిర్మించి ఉండవచ్చునన్నారు. ఈ దుర్గం నిర్మాణంలో అనుసరించిన విశిష్ఠ శైలితో కూడిన డిజైన్.. భోపాల్ సమీపాన గల భోజేశ్వర్ దేవాలయం, మధ్యప్రదేశ్కు దక్షిణాన గల ఓంకారేశ్వర్ ఆలయ డిజైన్, రూపురేఖలను ప్రతిబింబిస్తోంది. తమ అంచనాలను శాస్త్రీయంగా నిర్ధారిస్తే వెయ్యేళ్ల నాటి కట్టడంగా ధ్రువీకరించవచ్చునన్నారు.
రక్షణ కోసం నిర్మించిన గోడ
గోరఖ్పూర్లో 60 ఏళ్లుగా నివసిస్తున్న జమ్నాబాయి ఖరే (80) తాను చూసిన 'సింహవాహిని' దేవతా విగ్రహం ప్రస్తుతం కనిపించకుండా పోయిందన్నారు. ఈ గోడను స్థానిక రాజులు తమ శత్రువుల నుంచి రక్షణ కోసం నిర్మించారని తన మామ చెప్పేవారని జమ్నాబాయి ఖరే వ్యాఖ్యానించారు. అయితే గజనీ మహ్మద్ ఈ ప్రాంతంపై దాడిచేసినప్పుడు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడని కథనాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రజానీకం ఈ గోడ రాళ్లను తమ ఇండ్లలో అవసరాల కోసం దొంగిలించడం ఆనవాయితీగా మారిందన్నారు. వాస్తవంగా గోరఖ్పూర్ గ్రామం ఇక్కడ ఉన్నప్పుడు ఈ గోడ నిర్మించి ఉంటారని అంగన్ వాడీ వర్కర్ జ్యోతి రజాక్ పేర్కొన్నారు.
ఇలా అభివృద్ధి చేయవచ్చు...
చైనా 'గ్రేట్ వాల్' తర్వాతీ స్థానంలో నిలిచే ఈ గోడ.. పరిసర ప్రాంతాలను అభివ్రుద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని రైసిన్ జిల్లా మాజీ కలెక్టర్ లోకేశ్ జాదవ్ తెలిపారు. గత ఏడాది ఆయన రిటైర్మెంట్ కావడానికి ముందు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. చారిత్రకంగా తిరుగులేని కట్టడంగా ఉన్న ఈ గోడ రహస్యాల చిక్కుముడి విడిపించడం కష్ట సాధ్యమన్నారు. సమీపంలో యునెస్కో గుర్తింపు పొందిన సాంచీలోని బౌద్ధ స్తూపాలు, బీంబేట్కా పురాతన కళారూపాలతోపాటు ఈ గోడ పరిసర ప్రాంతాలను డెవలప్ చేస్తే పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దవచ్చునని ప్రకాశ్ జాదవ్ పేర్కొన్నారు. గమ్మత్తేమిటంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాత్రం దీనిపై ప్రస్తుతానికి అధ్యయనంచేసే ప్రతిపాదనలేమీ లేవనడం గమనార్హం.