ఎవరెస్ట్పై ఎఫెక్ట్: 18మంది పర్వతారోహకుల మృతి
ఢిల్లీ: నేపాల్లో భారీ భూకంపం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద శనివారం హిమపాతం పద్దెనిమిది మంది పర్వతారోహకులను బలి తీసుకుంది. పర్వతారోహణకు వచ్చిన వందలాదిమంది విదేశీయుల ఆచూకీ తెలియరావడం లేదని నేపాల్ పర్యాటక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర జ్యేష్ట తెలిపారు.
ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, వారు ఏ దేశానికి చెందిన వారన్నది గుర్తించలేకపోయామన్నారు. తమ దేశానికి చెందిన పర్వతారోహకుల్లో ఒకరు ఈ ఘటనలో మృతి చెందారని చైనా మీడియా పేర్కొంది. హిమపాతం సంభవించిన సమయంలో 400 మంది విదేశీయులు సహా మొత్తం వెయ్యిమంది పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు.
నేపాల్లో వచ్చిన భూకంప ప్రభావానికి మంచుకొండ మీద హిమ విలయం సంభవించింది. దీంతో, మంచుచరియలు విరిగిపడిన తర్వాత ఏర్పడిన మహా మంచు ప్రవాహంలో ఆ 18మంది మరణించారు. వీరి మృతదేహాలను భారత సైన్యానికి చెందిన పర్వతారోహాక బృందం కనుగొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నేపాల్ పర్యాటక శాఖ అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర శ్రేష్ఠ చెప్పారు.
పర్వతం మీది హిమ నదుల వరద పర్వతారోహకులను చెల్లాచెదురు చేసింది. దీంతో బేస్ క్యాంపుతో పాటు పర్వతంపై వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు ప్రాణాలు అర చేతపట్టుకుని పరుగెత్తారు. ఈ హిమ విలయంతో బేస్ క్యాంపులో కొంత భాగం మంచులో కూరుకుపోయి, అక్కడ ఉన్న 300 మంది చిక్కుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారని నేపాల్ టూరిజం అధికారి చెప్పారు. దక్షిణ ఖుంబు ప్రాంతంలో 700 మంది ఉన్నారు.
మంచు చరియలు విరిగిపడి, ఐస్పాల్ రూట్ మూసుకుపోయిందని ఓ పర్వాతరోహకుడు ట్వీట్ చేశారు. మంచు పర్వతాల్లో ఒక హిమనీనదం పారుతూ, ఎక్కడో ఒకచోట గడ్డకట్టుకుపోవడమో లేదా నెమ్మదిగా పారడమో జరిగితే అక్కడ ఏర్పడే మార్గాన్ని ఐస్పాల్ రూట్ అంటారు. తాజా అవలాంచ్లోనూ దారి కనపడక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారని తెలుస్తోంది.
ఐస్ఫాల్ రూట్కు ఎగువన ఉన్నందున బేస్క్యాంపులోని జనం ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నప్పటికీ వారు అక్కడి నుంచి బయటపడడానికి దారులు మూసుకుపోయాయి. దీంతో వాయు మార్గాన వారికి రక్షించడమో ప్రస్తుతానికి ఉన్న దారి. గత ఏడాది ఏప్రిల్లోనూ ఇలాంటి మంచు ప్రవాహమే 16 మంది నేపాలీ గైడ్లను పొట్టన పెట్టుకుంది.