విపాసన యోగా చేసేందుకే యూరప్కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలకు సెలవులు పెట్టి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే తెరలేపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ మాత్రం బాధ్యత లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారని బీజేపీ విరుచుకుపడిన విషయం తెలిసిందే.
అయితే రాహుల్ గాంధీ సెలవు తీసుకున్న మాట వాస్తవమేనని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఆయన దేశంలోనే ఉన్నారని, విదేశాలకు వెళ్లలేదని ప్రకటించింది. గతవారంలో ఉత్తరాఖండ్లోని ఓ ప్రాంతంలో సేదదీరుతున్నారని పార్టీ నేత ఒకరు ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన మాట వాస్తమేనని, ఆయనకు అత్యంత సన్నిహితుడొకరు తెలిపారు. బుద్ధిస్ట్ విపాసన యోగా చేసేందుకే ఆయన యూరప్కు వెళ్లారని ఆ నేత పేర్కొన్నారు. యూరప్ నుంచి మార్చి 9న తిరిగి వస్తారని కూడా ఆ నేత చెప్పారు.
ఇది ఇలా ఉంటే సెలవుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆచూకీ తెలపాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రముఖ న్యాయవాది అశోక్ పాండే శనివారం దీన్ని దాఖలు చేశారు.
రాహుల్ గాంధీకి ప్రత్యేక భద్రత దళం (ఎన్ఎస్జీ) అధికారులు రక్షణ కల్పిస్తుంటారని, వారికి చెప్పకుండా ఆయన ఎక్కడికీ వెళ్లకూడదని ఆయన అందులో పేర్కొన్నారు. రాహుల్ ఎక్కడున్నారో వెతికి, ఆయనకు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్పీజీ డైరెక్టర్ జనరల్ (డీజీ)లను ఆలహాబాద్ న్యాయస్ధానం ఆదేశించాలని ఆయన కోరారు.