బిజెపికి పోటీ: గోరక్షణ కోసం ముస్లీం ఎమ్మెల్యే ప్రచారం
లక్నో: భారతీయ జనతా పార్టీకి సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే జమీరుల్లా ఖాన్ షాకిచ్చారు! అవులను రక్షించుకోవాలని బిజెపి ఎప్పటి నుంచో చెబుతోంది. తాజాగా, ఎస్పీ ఎమ్మెల్యే జమీరుల్లా 'సేవ్ కౌ' ప్రచారాన్ని ప్రారంభించారు.
పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం అమల్లో ఉంది. దానిపై ప్రత్యేకించి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ముస్లిం వ్యక్తి, అదీ ఎమ్మెల్యే గోవధను వ్యతిరేకిస్తూ ప్రచారం చేపట్టడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జమీరుల్లా ఖాన్ ఆవులను వధించడం తప్పు అని చెబుతున్నారు. అందుకోసం ఆయన మతగురువుల, నేతలతో ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులు తమ సోదరులని, వారు గోవులను పూజిస్తారని చెప్పారు. అందుకే వారి సెంటిమెంట్లను గౌరవించాలన్నారు. గోవధ విషయమై తాను ఖురాన్ ప్రవచన కర్తలతో చర్చకు సిద్ధమేనన్నారు.
గోవధ చేయాలని, తప్పనిసరిగా గొడ్డు మాంసం తినాలని అందులో ఏమీ లేదన్నారు. అదే సమయంలో పలువుతి గోవు వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తద్వారా తమ హిందూ సోదరులకు మద్దతివ్వాలని భావిస్తున్నారు.
మత గురువులు, నేతలతో శుక్రవారం నాడు తొలిసారి ఆవులను రక్షించుదామని ప్రమాణం చేయించేందుకు సిద్ధం చేస్తున్నారు. కాగా, జమీరుల్లా ఖాన్ అలీగర్ లోని కోల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.