నిన్న ఖాళీ, నేడు జలకళ: తరలి వస్తున్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు నిండి కళకళలాడుతున్నాయి. శ్రీరాంసాగర్, సింగూరు, మిడ్ మానేరు, శ్రీశైలం సహా అనేక ప్రాజెక్టులు మూడేళ్ల తర్వాత నిండాయి.
నిజాం సాగర్లోకి వరద నీరు
ఇటీవలి వరకు నీరు లేని నిజాం సాగర్లోకి కూడా వరద నీరు చేరుతోంది. కడెం, స్వర్ణ, మూసీ ఇలా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న అనేక మధ్య తరహా ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాంసాగర్ రిజర్వాయర్లోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. 90 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో శనివారం ఉదయం 1.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో 65 టీఎంసీల నిల్వ ఉంది.
శ్రీరాం సాగర్ రిజర్వాయర్లోకి నీరు
సాయంత్రానికి నీటి ప్రవాహం 4.50 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. పూర్తి స్థాయిలో నిండటంతో ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేసి 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిసర ప్రాంతాల్లోని వారిని అప్రమత్తం చేశారు. అలాగే వరద నీరు గంట గంటకు పెరుగుతుండటంతో ఎస్సారెస్పీ పునరావాస గ్రామాల్లోకి కూడా నీరు చేరవచ్చునని అప్రమత్తం చేశారు. శ్రీరాంసాగర్లోకి 2006-07లో 5.17 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆ తర్వాత ఎప్పుడూ రెండు లక్షల క్యూసెక్కులు దాటలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడే అధికం.
నిండిన సింగూరు
గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో సింగూరు నిండింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగూరుకు ఎగువ నుంచి భారీస్థాయిలో వరద పోటెత్తుతోంది. 29.91 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో శుక్రవారం రాత్రి వరకే 26.921 టీఎంసీల మేర నీరు చేరింది. తొమ్మిది గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా బయటకు వదులుతున్నారు. మంజీరా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో సింగూరుకు జలకళ వచ్చింది. సింగూరు నుంచి వదిలిన నీటితో నిజాంసాగర్ జలకళను సంతరించుకుంది.
నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీరు
కొన్ని రోజుల క్రితం వరకు నీరు లేక బోసిపోయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుంచి, ఎగువ ప్రాంతాల నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో 1,405 అడుగులున్న ప్రాజెక్టులో 1,382 అడుగులకు నీరు చేరింది. శనివారం సాయంత్రం దీంట్లోకి 35 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గోదావరి బేసిన్లో దాదాపు అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది.
అన్ని ప్రాజెక్టులు కళకళ
నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్నాలా, పోచారం, కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పొలాలు నీట మునిగాయి.
జూరాల
ఆలమట్టికి వరద ప్రవాహం తక్కువగానే ఉన్నా నారాయణపూర్, జూరాల, శ్రీశైలం పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో శ్రీశైలానికి శనివారం వరద ప్రవాహం పెరిగింది. ఆలమట్టిలోకి 29 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 50 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. నారాయణపూర్కు 52 వేలు ఉండగా, 61 వేలు జూరాలకు వదిలారు. జూరాలకు ఉదయం 72 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి 1.24 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, శనివారం మధ్యాహ్నం 876.50 అడుగులు ఉంది. శ్రీశైలం నిండటానికి మరో 45 టీఎంసీలు అవసరం.
గుండన
అదిలాబాద్ జిల్లా గుండన ప్రాజెక్టు కళకళలాడుతోంది. దీంతో దీనిని చూసేందుకు చాలామంది తరలి వస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 2 టీఎంసీల సామర్థ్యమున్న ఎగువ మానేరు జలాశయం శనివారం ఉదయం నుంచి మత్తడి పారుతోంది. ఎగువన ఉన్న మెదక్ జిల్లాలోని కూడెల్లి వాగు, పల్వంచ వాగుల నుంచి భారీగా వరద వస్తుండటంతో 32 అడుగుల ఎత్తున్న జలాశయం మూడు రోజుల్లో నిండింది.