ఇది నిజమే!: దేశంలో దేవుడికి భయపడేది తెలుగువారే!
హైదరాబాద్: 2011 జనభా లెక్కల ప్రకారం ఇటీవల విడుదల చేసిన డేటాలో తెలుగు ప్రజలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ డేటా ప్రకారం.. దేశంలోనే తెలుగు ప్రజలు దేవుడంటే ఎక్కువగా భయపడతారు. అయితే ఈ డేటా 2011 జనాభా లెక్కల నుంచి సేకరిచింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండగానే ఈ గణాంకాలు సేకరించడం జరిగింది.
అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా 8.45 కోట్లు కాగా, అందులో కేవలం 256మంది ప్రజలు మాత్రమే తాము నాస్తికులమని పేర్కొనడం గమనార్హం. ఇందులో 62మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, 194 మంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఈ 256మందిలో 143మంది పురుషులు కాగా, 113మంది స్త్రీలున్నారు.
దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అత్యంత తక్కువ నాస్తిక జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే. కర్ణాటకలో కేవలం 112మంది నాస్తికులుండగా, తమిళనాడులో 1,297 మంది ఉన్నారు. కేరళలోనైతే అత్యంత ఎక్కువగా 4,896మంది ఉన్నారు.
ఇక దేశ విషయానికొస్తే దేశ జనాభాలో 0.002శాతం మంది నాస్తికులున్నారు. అంటే 120కోట్లకు పైగా జనాభాలో సుమారు 33,304మంది తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే నాస్తికులు ఎక్కువగా ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 22,828 మంది నాస్తికులుండగా, 10,476మంది పట్టణాల్లో ఉన్నారు. మొత్తం నాస్తిక జనాభాలో 17,597 మంది పురుషులు, 15,707మంది స్త్రీలున్నారు. జనాభా లెక్కల్లోని టేబుల్ సీ-01టేబుల్ లో మత సంబంధమైన అంశాల్లో ఈ విషయాలు పొందుపర్చారు.
కాగా, మేఘాలయ, మహారాష్ట్రల్లోనే దేశంలో సగం నాస్తిక జనాభా ఉండటం విశేషం. మహారాష్ట్రలో 9,652 మంది నాస్తికులుండగా, మేఘాలయాలో 9,089 మంది ఉన్నారు. ఈ రెండూ రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నాస్తికులుగా ఎక్కువగా ఉండటం గమనార్హం.
ప్రపంచం విషయానికొస్తే ఐరోపా దేశాల్లో ఎక్కువగా నాస్తికులున్నారు. ఐరోపా కమిషన్ నిర్వహించిన సర్వేలో రోమేనియా జనాభాలో 1శాతం నాస్తికులున్నట్లు తేలింది. ఫ్రాన్స్ లోనైతే ఏకంగా 40శాతం ఉన్నట్లు గుర్తించారు. చెక్ రిపబ్లిక్లో 37శాతం, స్వీడన్లో 34శాతం మంది ఉన్నారు.