కోర్కెలు తీర్చే గూరవనహళ్ళి మహాలక్షి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి సమీపంలోని తుమకూరు జిల్లా, కోరటగెరె తాలూకా, జి. నాగేనహళ్ళి గ్రామానికి 6.5 కిలో మీటర్ల దూరంలో ప్రసిద్ది చెందిన శ్రీ గూరవనహళ్ళి లక్షిదేవి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ నుండి వేలాధి మంది భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం ప్రత్యేకత తెలుసుకున్న భక్తులు వారి కోర్కెలు తీర్చాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం వేలాధి మంది భక్తులు శ్రీ గురవనహళ్ళి లక్షి దేవిని దర్శించుకుంటారు. ఈ మూడు రోజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సంతానం లేని స్రీలు, వివాహం కాని యువతులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు మూడు సార్లు అమ్మవారికి మహా మంగళహారతి ఇస్తారు. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకొవడానికి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయం దగ్గర క్యూలో భారులు తీరుతారు.
ప్రతి రోజు మద్యహ్నం 12 గంటల నుండి నాలుగు గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ సందర్బలో చుట్టు పక్కల గ్రామాలలోని వారు ఇక్కడ భోజనం చేసి వెలుతుంటారు. భక్తులు సమర్పించిన బియ్యం, పప్పు, చుట్టు పక్కల ఉన్న గ్రామస్తులు పండించిన కూరగాయాలతో దేవాలయం కమిటి సభ్యులు ప్రతి రోజు అన్నదానం చేస్తుంటారు. వరమహాలక్షి పండుగ సందర్బంలో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం చేరుకుని పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఉచితంగా పేదలకు సామూహిక వివాహాలు చేస్తుంటారు. వధూవరులకు నూతన వస్రాలు, వధువులు మంగళసూత్రం దేవాలయం కమిటి సభ్యులు ఉచితంగా అందిస్తారు. వివాహానికి హాజరైన వధూవరుల కుటుంబ సభ్యులు, వారి బంధువులకు ఉచిత భోజనాలు ఎర్పాటు చేస్తారు. గూరవనహళ్ళిలో ప్రతి సంవత్సరం లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ దేవాలయానికి నిత్యం వివిద పార్టీల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వివిద రంగాలకు చెందిన వారు వెలుతుంటారు.
గూరవనహళ్ళి కమలమ్మ చల్లని చేతులతో ఆశీర్వాదం........
1918వ సంవత్సరం ఆగస్టు 13వ తేది వేకువ జామున నాలుగు గంటల సమయంలో అక్కిరాంపుర అనే గ్రామంలో కమలమ్మ జన్మించారు. మూడు సంవత్సరాల నుండి కమలమ్మకు దైవభక్తి ఎక్కువ. 1933వ సంవత్సరంలో గూరవనహళ్ళికి చెందిన సుబ్బరావ్ అనే ఆయనతో కమలమ్మ వివాహం జరిగింది. ఇదే గ్రామం శివార్లలో చిన్న దేవాలయం ఉంది. ఈ గుడి పక్కన ఉన్న సత్రంలో దారి దోపిడిలు చేసే దుండగులు తలదాచుకునేవారు. గ్రామస్తులు దేవాలయంలో పూజలు చెయ్యడానికి దుండగులను చూసి భయపడి అటు వైపు వెళ్ళేవారుకాదు. 1935వ సంవత్సరం ఆషాడమాసంలో సుబ్బారావ్ కొత్త చీర తీసుకువస్తానని రూ. 1.50 తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు.
చీర తీసుకు వస్తానని చెప్పి వెళ్ళిన సుబ్బారావ్ తరువాత గ్రామానికి తిరిగి వెళ్లలేదు. కొంత కాలం తరువాత అత్తింటివారు కమలమ్మను ఇంటి నుండి బయటకు పంపించేశారు. కమలమ్మ పుట్టింటికి వెళ్ళలేక, ఆగ్రామంలో ఎవరింటిలో ఉండలేక చెట్టు కిందకు చేరింది. తరువాత ధైర్యం చేసి దేవాలయంలో తలదాచుకునింది. ప్రతి రోజు సమీపంలోని తీతా నదిలో నుండి నీరు తీసుకు వచ్చి దేవాలయంలోని అమ్మవారి రాతి విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు చేసేవారు. అటు వైపు వెళ్ళే భక్తులు ఇచ్చిన బియ్యం, పప్పుతో నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టేవారు. 20 సంవత్సరాలు పూర్తి అయినా వివాహం కాని యువతులకు కమలమ్మ చేతులు మీదుగా నైవేద్యం ఇచ్చేవారు. తరువాత వారికి వివాహం అయ్యేది. అదే విదంగా సంతానం లేని వారికి కమలమ్మ చేతులు మీదుగా పసుపు, కుంకుమ, పండ్లు ఇచ్చేవారు. వారికి సంతానం కలిగిన తరువాత దేవాలయం చేరుకుని మొక్కులు తీర్చుకునేవారు.
ఈ విదంగా గూరవనహళ్ళి దేవాలయం ప్రసిద్ది చెందింది. భక్తులు వారి కోర్కెలు తీరిన తరువాత ఇచ్చిన విరాలలతో నేడు అతి పెద్ద దేవాలయం నిర్మించారు. దేవాలయం నిర్వహణ చూసుకుంటామని కర్ణాటక దేవాదాయ శాఖ ముందుకు వచ్చినా కమలమ్మ అంగీకరించలేదు. కమలమ్మ మరణించిన తరువాత ఆమె పెంపుడు కుమారుడు ప్రసన్నకుమార్ దేవాలయం ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. అప్పటి నుండి నేటి వరకు గూరవహళ్ళి చేరుకుంటున్న భక్తులు తమ కోర్కెలు తీర్చాలని అమ్మ వారిని మొక్కుకుంటున్నారు. గూరవనహళ్ళి లక్షిదేవి దేవాలయం, ఉచిత అన్నదాన భవనం, సంత్రం, దేవాలయం గదులు కొన్ని ఎకరాలలో నిర్మించారు. గూరవనహళ్ళి దేవాలయం పరిసర ప్రాంతాలలో అనేక దేవాలయాలు, చూడ చక్కటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. బెంగళూరు నగరం నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి వెళ్లడానికి బెంగళూరులోని మెజస్టిక్ నుండి కేఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాలలో ప్రత్యేక బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కర్నూలు జిల్లా నుండి 100 నుండి 150 కిలో మీటర్ల దూరంలో గూరవనహళ్ళి దేవాలయం ఉంది.