దేశంలోనే నంబర్.1 సీఎంగా కేసీఆర్.. : వీడీపీ సర్వే
న్యూఢిల్లీ : ఉద్యమ నేతగా తెలంగాణ కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్.. రాజకీయాల్లోను తనదైన మార్క్ తో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉద్దండులైన నితీశ్ కుమార్ లాంటి నేతలను సైతం వెనక్కి నెట్టి, మెరుగైన పనితీరులో దేశంలోని మిగతా సీఎంలందరి కంటే ముందున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం వీడిపీ అసోసియేట్స్ పోలింగ్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఇండియాలోనే టాప్ సీఎంగా నిలిచారు సీఎం కేసీఆర్.
దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రజలు ఎంతమేర తమ సీఎంల పాలన పట్ల సంత్రుప్తికరంగా ఉన్నారన్న విషయంపై సర్వే నిర్వహించింది వీడిపీ. ఇందులో 89 శాతం ఓటర్లు వ్యక్తం చేసిన సంతృప్తికర స్పందనతో దేశంలో టాప్ స్థానాన్ని దక్కించుకున్నారు కేసీఆర్. ఇక ఆయన తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ 81 శాతంతో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 75 శాతంతో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 69 శాతం మార్కులతో ఈ జాబితాలో 5వ స్థానంలో నిలవడం గమనార్హం. అలాగే 40 శాతం, 34 శాతం ఓటర్ల సంతృప్తితో జాబితాలో చివరి స్థానాల్లో నిలిచారు ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.