జరగనిది చేసి చూపిస్తాం: కోహ్లీ, ఖాళీ ఉండదని హామీ
సిడ్నీ: భారత క్రికెట్ చరిత్రలో జరగని దానిని తాము చేయాలనుకుంటున్నామని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. గురువారం నాడు సిడ్నీలో ఆస్ట్రేలియాతో భారత్ సెమీ ఫైనల్లో భాగంగా తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలుస్తామని కోహ్లీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. భారత్ ప్రపంచ కప్కు మరో రెండు అడుగుల దూరంలో ఉంది. సెమీ పైనల్లో ఆసీస్ను ఓడించి, ఫైనల్లో కివీస్ను ఓడించడం.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బీసీసీఐ ఆఫీషియల్ వెబ్ సైట్తో మాట్లాడాడు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ), వాంఖేడే స్టేడియాల గురించి కోహ్లీ చెప్పాడు. సిడ్నీలో జరగనున్న సెమీ ఫైనల్లో ఆసీస్ పైన భారత్ గెలిస్తే మెల్బోర్న్ స్టేడియంలో భారత్ కివీస్తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఎంసీజీ, ముంబై వాంఖేడే స్టేడియంపై మాట్లాడాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ వాంఖేడే స్టేడియంలో జరిగింది.
ఈ రెండు కూడా క్రికెట్ ఆడేందుకు మంచి స్టేడియాలు అన్నాడు. వాంఖేడేలో చవిచూసిన అభిమానాన్ని మరే క్రికెట్ మైదానంలో చూడలేదని చెప్పాడు. ఎంసీజీలో దక్షిణాఫ్రికాతో అడిన మ్యాచ్ అన్ బిలీవబుల్ అన్నాడు.
భారత్ ఫైనల్కు చేరితే ఎంసీజీ పూర్తిగా నిండిపోతుందని చెప్పాడు. ఎంసీజీ పూర్తిగా 90వేల మంది వీక్షకులతో నిండుతుందన్నాడు. ఇది ఏఎఫ్ఎల్ గ్రాండ్ ఫైనల్ కంటే బాగా ఉంటుందన్నాడు. మేం ఫైనల్కు చేరితే ఎంసీజీలో ఒక్క సీటు కూడా ఖాళీగా కనిపించదని తాను హామీ ఇస్తున్నానని చెప్పాడు.
గతంలో భారత క్రికెట్ జట్టు చేయనిది.. ఈసారి చేసేందుకు ఈ ప్రపంచ కప్ తమకు మంచి అవకాశమని చెప్పాడు. 2011లో గెలిచిన తాము, ఈసారి కూడా గెలిచి వెంట వెంటనే ప్రపంచ కప్ గెలిచిన అనుభూతి ఎప్పటికీ మిగులుతుందని చెప్పాడు.
తాము వరుసగా అన్ని మ్యాచులలో గెలుస్తూ వచ్చామని, ఇప్పుడు తామే ప్రపంచ కప్ ఫేవరేట్ అని అందరు భావిస్తున్నారన్నాడు. ఈ అనుభవం అద్భుతంగా ఉందన్నాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచి కప్ సాధిస్తే.. తన జీవితంలోనే అద్భుతమైన రోజు అన్నాడు. భారత్ రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచింది. 1983లో ఇంగ్లాండులో, 2011లో ముంబైలో కప్ గెలిచింది.