పాక్పై సర్జికల్ దెబ్బ-రాజకీయం: వీడియోని ఎందుకు విడుదల చేయొద్దు?
న్యూఢిల్లీ: యూరి ఉగ్రదాడికి కౌంటర్గా ఇండియన్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్ ద్వారా పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ సర్జికల్ స్ట్రయిక్ దాదాపు వారం క్రితం అర్ధరాత్రి గం.12.30 నుంచి తెల్లవారుజామున గం.4.30 వరకు జరిగాయి. ఇప్పుడు దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది.
సర్జికల్ స్ట్రయిక్ తప్పని పాక్ మీడియా చెబుతోందని, ఇది నిజమని నిరూపించేందుకు వీడియో విడుదల చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. దీంతో కలకలం చెలరేగింది. దీంతో సర్జికల్ స్ట్రయిక్ వీడియో విడుదల చేయాలా వద్దా అనేది చర్చనీయాంశంగా మారింది.
90 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసేందుకు భారత ఆర్మీకి ఎలాంటి అభ్యంతరం లేదు. తాము వీడియోను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వానికి కూడా అందించామని చెప్పింది. అయితే, అత్యున్నత స్థాయిలో ఉన్న భద్రతాధికారులు మాత్రం విడుదల సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయమై ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలు ఆప్షన్స్ ముందుంచినట్లుగా తెలుస్తోంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్, చీఫ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో వీడియో విడుదలకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కోణంలో ఆలోచించి దేశానికి సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకోలేమని అంటున్నారు.
అంతేకాదు, వీడియోను విడుదల చేస్తే పాకిస్తాన్తో వివాదం మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే సర్జికల్ స్ట్రయిక్ జరగలేదని పాక్ నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. పాక్ను ప్రపంచంలో ఏకాకిని చేసింది మోడీ ప్రభుత్వం. వీడియో ద్వారా మరింత ఇరుకున పడితే పాక్ మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయని అంటున్నారు.
ప్రభుత్వం వీడియోను బహిర్గతం చేయడం సరికాదని ప్రఖ్యాత నేషనల్ సెక్యూరిటీ అనలిస్ట్ నితిన్ గోఖలే చెబుతున్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా చాలామంది చెబుతున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా మాట్లాడుతూ.. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, దీని గురించి ఏం మాట్లాడమన్నారు.