ఈవీఎంలు సురక్షితం కాదా? గోల్ మాల్కు నిలయమా?
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో విజయంపై ఆశలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, దేశానికి కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో గెలుపు భావుటా తనదేనని నమ్మిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి కన్నకలలు కల్లలయ్యాయి. దీనికి కారణం ఈవీఎంలను అధికార బీజేపీ టాంపరింగ్ చేసిందని ఎదురుదాడికి దిగారు.
వీరిద్దరికీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత - పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం - సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ జత కలిశారు.
ఓటర్లు ఏ పార్టీకి ఓటేసినా అవి బీజేపీకే ఓట్లు పడ్డాయని ఈవీఎంలు మోసమని ఆరోపణలు చేశారు. ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనే గతంలో గెలిచి కూడా ఇలాంటివారంతా ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకుంటూ యంత్రాలపై రాజకీయ తంత్రం ప్రదర్శిస్తున్నారు. 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అతి చేరువ వరకు వచ్చి ప్రతిపక్షంలోనే నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తదితరులు.. ఈవీఎంల టాంపరింగ్కు పాల్పడ్డారని, దేశ రాజధాని హస్తిన సాక్షిగా రుజువు చేసి చూపారు.
ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలన్నీ గెలిచినప్పుడు ఒక విధంగా, ఓడిపోతే మరొక విధంగా మాట్లాడుతున్నాయి. దేశంలో ఈవీఎంల వినియోగం ప్రారంభమైనప్పటి నుంచీ పార్టీల ధోరణి ఇలాగే కొనసాగుతున్నది. ఈవీఎంల పారదర్శకత, ఖచ్చితత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పలుసార్లు స్పష్టత ఇచ్చినా, ఉన్నత న్యాయస్థానాలు స్వయంగా పరిశీలించి నమ్మదగ్గవేనని సమర్థించినా విమర్శలు యథాతధంగా సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఇందులో పటిష్ఠ భద్రతాంశాలను పేర్కొంటూ ఇటీవల మరోసారి సమగ్ర వివరణ ఇచ్చింది.
తొలిసారి ఈవీఎంల వినియోగం ఇలా
కేరళలోని ‘ఉత్తర పరవూరు' అసెంబ్లీ స్థానానికి 1982లో జరిగిన ఉప ఎన్నికలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తొలిసారి ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. అంతకుముందే ఈవీఎంలను వినియోగించరాదంటూ సీపీఐ అభ్యర్థి శివన్ పిళ్లై కేరళ హైకోర్టులో సవాల్ చేసినప్పుడూ ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ‘ఈవీఎం' పనితీరుపై న్యాయస్థానం ముందు హాజరై స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీంతో న్యాయస్థానం అడ్డుచెప్పలేదు. ఆ ఎన్నికల్లో 123 ఓట్ల ఆధిక్యతతో పిళ్లై విజయం సాధించారు. కానీ ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జోస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇవి వినియోగించడానికి వీల్లేదని వాదించడంతో 1988 వరకు ఈవీఎంల వినియోగాన్ని నిలిపేశారు.
ఈవీఎంలతో ఇదీ భద్రత
కేంద్రం 1998లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించిన తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఆ తర్వాత 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా వినియోగంలోకి తెచ్చారు. కర్ణాటక హైకోర్టు స్వయంగా 2005లో వీటిలోని భద్రతా ప్రమాణాలను పరిశీలించిన మీదట ఈవీఎంల వినియోగం సమర్థనీయమేనని పేర్కొన్నది. ఓటమి పాలయ్యేవారు తరచూ ఈవీఎంల వినియోగంపై విమర్శలు చేస్తుండడంతో వాటిని 2011లో మరింత అధునాతనంగా తీర్చిదిద్దారు. ఓటు వేయగానే రశీదు వచ్చే సదుపాయాన్ని (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ - వీవీపీఏటీ) తెచ్చారు.
సొంత టెక్నాలజీతోనే ఈవీఎంల తయారీ
భారత్లో ఉపయోగించే ఈవీఎంల పరిజ్ఞానం పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు. వీటిని భారత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ (ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) తయారు చేస్తున్నాయి. 2019 నుంచి జరిగే అన్ని ఎన్నికల్లో పూర్తిగా రశీదు వచ్చే(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ - వీవీపీఏటీ) ఈవీఎంలను వినియోగించనున్నారు. వీవీపీఏటీతో కూడిన ఈవీఎంను తొలిసారి 2013లో నాగాలాండ్లోని నాక్సెన్ అసెంబ్లీ స్థానం పరిధిలో వినియోగించారు. ఒక్కో ఈవీఎం ధర రూ.7,700 ఉంటుందని అంచనా. వచ్చ లోక్సభ ఎన్నికల్లో వినియోగించనున్న వీవీపీఏటీ అనుసంధాన ఈవీఎంల కొనుగోలుకు రూ.9,200 కోట్లు కేటాయించింది.
ఇలా అవకతవకలకు ఆస్కారం లేకుండా..
ఒక ఈవీఎంలో 3840 మంది ఓట్లు నమోదు చేసేందుకు వీలవుతుంది. ఒక్కో ‘ఈవీఎం'లో 16 మంది అభ్యర్థుల పేర్ల చొప్పున చేర్చడంతోపాటు నాలుగు ఈవీఎంలను అనుసంధానిచ్చవచ్చు. వీటిల్లో ఓట్లు గరిష్ఠంగా పదేళ్ల పాటు పోలైన ఓట్లు ఉంచవచ్చు. ఈవీఎంల్లో ఉపయోగించే మాస్క్డ్ చిప్లు ఒకేసారి ప్రోగ్రాం (సాఫ్ట్వేర్) రాయడానికి వీలు కల్పిస్తున్నందున ఎవరూ దీన్ని మార్చలేరు. ఇతర యంత్రాలకు గానీ, ఇంటర్నెట్కు గానీ వీటిని అనుసంధానించరు కనుక హ్యాకింగ్ జరుగుతుందన్న ఆందోళన గానీ, హ్యాకింగ్ భయంగానీ అక్కర్లేదు.
అక్రమాలకు తావివ్వని ఈవీఎంలు
ఈవీఎంలో నియంత్రణ భాగం ప్రిసైడింగ్ అధికారి ఆధీనంలో ఉంటుంది. బ్యాలట్ యూనిట్ ఓటర్ రహస్యంగా ఓటేసే బూత్లో ఉంటుంది. ఓటర్ తాను కోరుకున్న అభ్యర్థికి ఓటేసిన తరువాత యంత్రం దానికదే లాక్ అవుతుంది. మళ్లీ నియంత్రణ అధికారి కొత్త బ్యాలట్ సంఖ్యతో తన వద్ద మీట నొక్కితేనే మరొక ఓటర్ ఓటేసేందుకు వీలు ఉంటుంది. దీనివల్ల ఒక్కరే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా, రిగ్గింగ్ను నియంత్రించొచ్చు. చివరి ఓటర్ తన ఓటుహక్కు వినియోగించుకున్న తరువాత గానీ, ఓటింగ్ సమయం ముగిశాక పోలింగ్ అధికారి తన వద్ద ఉన్న నియంత్రణ విభాగంలో ఉన్న ‘క్లోజ్' మీట నొక్కిన తరువాత ఆ యంత్రం ఓట్లను స్వీకరించదు. కనుక పోలింగ్ తరువాత అక్రమాలకూ ఆస్కారం ఉండదు.
ఇంజినీర్ల తనిఖీ తర్వాతే వినియోగానికి..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతి ఈవీఎంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తయారీ సంస్థల ఇంజినీర్లే మరోసారి తనిఖీ చేస్తారు. చిన్న లోపం ఉన్నాఆ యంత్రాన్ని పక్కన పెట్టేస్తారు. తదుపరి మొత్తం ఈవీఎంలలో 5 శాతం యంత్రాల్లో ప్రతినిధులతో ప్రయోగాత్మకంగా కనీసం వెయ్యి ఓట్లు వేయించి పరీక్షించిన మీదట రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే వీటికి సీల్ వేస్తారు. పోలింగ్ నాడు అభ్యర్థి ప్రతినిధులుగానీ, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోగానీ మరోసారి కనీసం 50 ఓట్లు వేయించి పరీక్షించాక అభ్యంతరాలు లేవని వారు సంతకాలు చేసిన తరువాత ప్రయోగాత్మక ఓట్లు తొలగించి ఇంకో సీల్ వేస్తారు. ఆ తరువాత అసలైన పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈవీఎంల వినియోగం తీరు
మనదేశంతోపాటు ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రెజిల్, కెనడా, స్విట్జర్లాండ్, బెల్జియం, నార్వే, పెరూ, రుమేనియా, పెరూ, ఎస్టోనియా దేశాల్లో పూర్తిస్థాయిలో ఈవీఎంలు వినియోగిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పలు రాష్ట్రాల్లో ఓటేయగానే రశీదు వచ్చే యంత్రాలను వాడుతున్నారు. ఇక నెదర్లాండ్స్, ఉక్రెయిన్, మెసిడోనియా, వెనెజువెలా, ఐర్లాండ్, జర్మనీలలో పూర్తిగా నిషేధించారు.