యువతుల సాహసం: స్కూటర్లపై హిమాలయం పైకి!
న్యూఢిల్లీ: తాము పురుషుల కంటే ఎందులోనూ తక్కువ కాదని ఓ మహిళా బృందం మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జమ్ముకశ్మీర్లోని ఖర్దుంగ్లా రోడ్డుపై మహిళా బృందం స్కూటర్ యాత్ర నిర్వహించింది.
మామూలుగా అయితే రైడర్లు మోటార్సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ మోటరబుల్ రోడ్డు ఖర్దుంగ్లాపైకి మహిళల బృందం స్కూటర్లపై సాహసోపేతంగా రైడ్ చేశారు. ఆనమ్ హషీమ్ అనే 21ఏళ్ల అమ్మాయి మరో పది మంది యువతులతో కలిసి టివిఎస్ స్కూటీ జెస్ట్ వాహనాలకు 110 సిసి ఇంజన్లను అమర్చుకుని దాదాపు 18,340 అడుగుల మేర రైడ్ చేశారు.
టివిఎస్ కంపెనీ కొత్తగా విడుదల చేస్తున్న ఈ స్కూటర్ అత్యంత ఎత్తైన ప్రాంతాలకు కూడా సులభంగా రైడ్ చేయవచ్చని చూపించడానికే ఈ సాహస కార్యాన్ని చేపట్టింది. లక్నోకు చెందిన ఫ్యాషన్ విద్యార్థి అయిన ఆనమ్ నిరుడు కూడా ఈ సంస్థ లాంచింగ్ ఎడిషన్పై కేవలం 18 రోజుల్లో 2100 కిలోమీటర్లు విజయవంతంగా ప్రయాణం చేసి వచ్చింది.
'ఈ ట్రెకింగ్ ఒక సవాలే.. మండి నుంచి మనాలీ దాకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సర్జు ఉంచి కిల్లాంగ్ వెళ్లే దారిలో ఓ వంతెన కూలిపోతే మేము నీళ్లల్లో దిగి తిరిగి మళ్లీ రోడ్పైకి ఎక్కాల్సి వచ్చింది' అని తమ ప్రయాణం గురించి ఆనమ్ తెలిపింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అనుకోకుండా ఎదురయ్యే విపత్తుల గురించి ముందే తెలిసినా తమ బృందం వెనుకడుగు వేయలేదని ఆమె తెలిపారు. కాగా, 'నిరుడు మేం నిర్వహించిన రైడ్ విజయవంతం కావటంతో ఈసారి దాదాపు 50వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలోంచి కేవలం 10మందిని ఎంపిక చేసి ఈ రైడ్ను విజయవంతం చేశాం' అని టివిఎస్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ అనిరుద్ధ హల్దర్ వెల్లడించారు.