వైయస్ జగన్ బెదురుతున్నాడా?
జగన్ ఓదార్పును సమర్ధిస్తూ మాట్లాడున్న వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. అంబటి రాంబాబు, వరంగల్ జిల్లాకు చెందిన పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ, తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి తదితరులకు షోకాజ్ లు ఇవ్వడం, ఓదార్పను సమర్థిస్తూ మాట్లాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరింపులు చేస్తుంది. నెల్లూరు జిల్లా పిసిసి ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏకంగా పదవి నుంచి తొలగించటమే కాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించింది. ఓదార్పు ఆయన వ్యక్తిగతం అంటూనే ఆయన్ను సమర్థిస్తున్న వారికి హెచ్చరిస్తోంది. ఇటీవల జరిగిన పిసిసి సమావేశంలో పిసిసి అధ్యక్ష్యుడు డి.శ్రీనివాస్ ఏకంగా పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జగన్ వర్గాన్ని ఉద్దేశించి బాహాటంగా హెచ్చరికలు చేశారు.
అయినప్పటికీ జగన్ నుండి ప్రత్యక్షంగా ఎలాంటి స్పందన లేదు. వేటుపడ్డ అనుచరులు మాత్రం అందుకు ధీటుగా స్పందిస్తున్నారు. వారు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక జగన్ హస్తం ఉంది. ఆయన మౌనంగా ఉండి వారితో మాట్లడించటం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టగా తెలుస్తోంది. తండ్రి మరణాన్ని క్యాష్ చేసుకోవటానికే ఓదార్పు చేపట్టాడని ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆయన ఓదార్చాలనుకుంటే ఇంటింటికి ఒక్కడిగా ఎలాంటి ఆర్బాటం లేకుండా వెళ్లవచ్చు. కాని ఆయన అందుకు విరుద్దంగా రాజకీయ చైతన్య యాత్ర చేపడుతున్నాడు. గతంలో రోశయ్య ప్రభుత్వానికి అస్థిర పరచడానికి పలుమార్లు చూశాడనే ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 31 తరువాత తెలంగాణ ఇచ్చినా ఇవ్వకున్నా రోశయ్య ప్రభుత్వం అస్థిరత్వం అవుతుంది. ఎన్నికలు వచ్చే అవకాశమూ లేక పోలేదు. అప్పటిలోగా రాష్ట్రంలోని చాలా జిల్లాలు చుట్టి రావాలన్నది ఆయన అభిప్రాయంగా ఉండి ఉండవచ్చు. ఒకవేళ ఎన్నికలు వస్తే ఇప్పుడు తనతో వస్తున్న ప్రజాబలాన్ని అధిష్టానానికి చూపించి ముఖ్యమంత్రిగా పోటీలోకి దిగటం, అధిష్టానం కాదంటే పార్టీ పెట్టటం. అందుకోసం కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలకన్నా జగన్ ముందుచూపుతో వ్యవహరించటం విశేషం. త్వరలో రానున్న(?) ఎన్నికల కోసమే జగన్ మౌనానికి కారణంగా ఉండవచ్చు.
పార్టీ పెట్టినా, కాంగ్రెస్ తో కలిసి ఉన్నా ఆర్థిక బలం ఒక్కటే సరిపోదని అంగబలం, ప్రజా బలం ఉంటేనే నెగ్గుకు రావచ్చన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఓదార్పు చేపడనేది నిర్వివాదాం. తనకు ఇప్పుడు మద్దతు పలుకుతున్న వారంతా ఎప్పటికీ తనతోనే ఉంటారా అనే భయం కూడా జగన్ లో ఉండి ఉండవచ్చు. వైఎస్ చనిపోయినప్పుడు ఆనం సోదరులు జగన్ కు మద్దతు పలికారు. ఆ తరువాత క్రమంగా దూరమయ్యారు. జగన్ కు దన్నుగా ఉన్న కొండా సురేఖ సైతం తాను జగన్ వర్గం వ్యక్తిని అయినంత మాత్రాన సమైక్యవాదిని కానని, తెలంగాణకు అనుకూలమేనని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పుడు తనకు అనుకూలంగా మాట్లాడుతున్న వారూ భవిష్యత్తులో తనకు సహకరిస్తారో లేదో, అప్పుడు అధిష్టానం అండదండలు తనకు అవసరమవుతాయనే ఆయన మాట్లాడటం లేదని రాజకీయ పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరంజీవికి సభలకు జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. తన తండ్రి మరణం కారణంగా సానుభూతితో తన సభలకు వస్తున్న వారు తనను ఏం చూసి ఓటు వేస్తారనేది ఆయన లోలోన మెదులుతున్న ప్రశ్న.