మధ్యంతరంపై మమత, అవకాశం కోసం ములాయం
అదే ఊపులో ఉన్న మమతా బెనర్జీ.. యూపిఏ ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాలు కైవసం చేసుకొని కేంద్రంలో మరింత క్రియాశీలకంగా మారవచ్చునని భావిస్తోందని, అందుకే మద్దతు ఉపసంహరణ ద్వారా కాంగ్రెసుకు ముచ్చెమటలు పట్టిస్తోందని అంటున్నారు. యూపిఏ ప్రభుత్వంలో కాంగ్రెసు తర్వాత అత్యధిక స్థానాలు టిఎంసివే(19). లోకసభ ఎన్నికలు వస్తే ఈ సంఖ్య మరింత పెంచుకొని కేంద్రంలో కీలకంగా మారవచ్చునని ఆమె భావిస్తున్నారట.
మమత మధ్యంతరం కోరుకుంటుందనడానికి బుధవారం టిఎంసి ఎంపీ కునాల్ ఘోష్ వ్యాఖ్యలే మంచి నిదర్శనం అంటున్నారు. ఉదయం ఘోష్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని, వెంటనే మధ్యంతర ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అయితే మమత పూర్తిగా మధ్యంతరంపై ఆశలు పెట్టుకోకుండా కాంగ్రెసుకు హెచ్చరికలు కూడా పంపిందని అంటున్నారు.
మమత పూర్తిగా మధ్యంతరమే కోరుకుంటే ఆ పార్టీ కేంద్రమంత్రులు అప్పటికప్పుడు రాజీనామా చేసేవారని, శుక్రవారం రాజీనామా చేస్తామని చెప్పి పరోక్షంగా కాంగ్రెసుకు మూడు రోజుల సమయం ఇచ్చి ఉండేవారు కాదంటున్నారు. మధ్యంతరం కాని పక్షంలో బెంగాల్ కోసం పెద్ద మొత్తంలో నిధులు కోరటం వంటి డిమాండ్లను కాంగ్రెసు ముందు వారు పెట్టనున్నారని అంటున్నారు. ఇక మమత బయటకు వెళ్లిన నేపథ్యంలో యుపి చుట్టూ కేంద్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.
22 మంది ఎంపీలు ఉన్న ఎస్పీ, 21 మంది ఎంపీలు ఉన్న బిఎస్పీలు యూపిఏకి బయటి నుండి మద్దతిస్తున్నాయి. మమత వెళ్లినప్పటికీ ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ అయినా అండగా నిలబడితే మన్మోహన్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ఢోకా లేదు. సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ పరిస్థితులను బాగా పరిశీలిస్తున్నారు.
ఓసారి ప్రధాని అయ్యే అవకాశం పోగొట్టుకున్న ములాయం ఇటీవల యుపి ఎన్నికలలో తమ పార్టీ గెలుపొందినప్పుడు తన తనయుడు అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టడం వెనుక ఢిల్లీ పీఠంపై కన్నేయడమే కారణమంటున్నారు. యూపిఏకి బయటి నుండి మద్దతు ఇస్తున్న ములాయం అవకాశాన్ని బట్టి నడుచుకుంటారు. తాము మద్దతివ్వకపోయినా మన్మోహన్ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుందని భావిస్తే యూపిఏకి అనుకూలంగా ఉంటారు, తాము లేకపోతే ప్రభుత్వం కూలుతుందని భావిస్తే వెంటనే పక్కకు తప్పుకుంటారు.
ప్రస్తుతానికి ఢిల్లీ రాజకీయాలను పరిశీలిస్తున్న ఎస్పీ వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది. ఇటీవల అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఘన విజయం సాధించినందున ఎస్పీ అవకాశం వస్తే మధ్యంతరానికే ఓటేస్తుంది. ఇక యుపి ప్రతిపక్ష బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఘోర పరాజయం చవి చూసిన నేపథ్యంలో మధ్యంతరానికి విముఖత వ్యక్తం చూపవచ్చు. అలా అయితే యూపిఏకి మద్దతుగా నిలుస్తుంది. అయితే యూపిఏకి మద్దతిస్తే ఎఫ్డిఐ, డీజిల్ ధరల పెంపు వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి మద్దతిచ్చిన అపవాదు బిఎస్పీని వెంటాడుతుంది.