టాలీవుడ్కు సెగ: చిరుతో చెర్రీకి, హరితో ఎన్టీఆర్కి..
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల వల్ల తెలుగు సినిమాల విడుదలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిర్మాణం పూర్తయి విడుదలకు సిద్ధమైన సినిమాలు కూడా ఉద్యమాల కారణంగా విడుదల కావడం లేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలవరపడుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమ ప్రభావం తెలుగు సినిమాల పైన పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో పలుచోట్ల రోజుకు రెండు షోలో వేస్తున్నారు.
రాష్ట్రంలో ఉద్యమాలవల్ల తెలుగు చిత్ర రంగం విలవిల్లాడుతోంది. తెలంగాణలో బంద్ జరిగినప్పుడల్లా థియేటర్లు మూతపడి వసూళ్లపై ప్రభావం చూపాయి. షూటింగ్లను సైతం తెలంగాణవాదులు అడ్డుకోవడంతో నిర్మాతలు నష్టపోయారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా, మరునాటి నుంచే సీమాంధ్రలో ఆందోళన మొదలైంది. దీంతో మార్నింగ్ షో, మ్యాట్నీ నడవక వసూళ్లు పడిపోయాయి.
సీమాంధ్ర ఉద్యమంతో పెద్ద సినిమాలపై అతిగా ప్రభావం చూపింది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా విడుదలవలేదు. కొందరు నిర్మాతలు విడుదల తేదీలనూ వాయిదా వేసుకున్నారు. 7న పవన్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది', 21లేదా 23 తేదీల్లో విడుదల కావాల్సిన రామ్చరణ్ 'ఎవడు' సినిమా నిరవధికంగా వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం విడుదల కాకపోతే ఆ ప్రభావం నేరుగా నిర్మాతపైనా, డిస్ట్రిబ్యూటర్ల మీద పడుతుంది.
ప్రస్తుతం ఆ రెండు సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే వెంటవెంటనే విడుదలకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'రామయ్యా వస్తావయ్యా', నాగార్జున 'భాయ్', మంచు మనోజ్ 'పోటుగాడు', కృష్ణవంశీ 'పైసా', వెంకటేశ్ - రామ్ సినిమా 'మసాలా'పై ఉద్యమాల ప్రభావం పడబోతోంది. చెర్రీ 'తుఫాన్' సినిమా తుఫాను కల్లోలాన్ని చవిచూస్తోంది.
భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 6న విడుదలవుతున్నది. ఇది బాలీవుడ్లో రూపొందిన 'జంజీర్'కు తెలుగు వెర్షన్. షెడ్యూల్ మేరకు 'జంజీర్'ను ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల చేస్తున్నారు. 'తుఫాన్'నూ అదేరోజు విడుదల చేయక తప్పని స్థితి ఉంది. రామ్చరణ్ తొలి బాలీవుడ్ సినిమా కావడంతో 'హైప్' క్రియేట్ అయింది. ఈ క్రేజ్ ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలతో కొనుగోలు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న కేంద్రమంత్రి చిరంజీవి ప్రతిపాదనపై ఇటు తెలంగాణవాదులు; సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయలేదన్న కోపంతో అటు సమైక్యవాదులు గుర్రుగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను ఆడనీయబోమని ఇరువైపులా ఆందోళనకారులు హెచ్చరించారు. 'తుఫాన్'పై స్పందన చూశాక 'భాయ్' విడుదల తేదీ నిర్ణయిస్తామని నాగార్జున వంటి సీనియర్ హీరో చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
టిడిపి సీనియర్ నేత నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'రామయ్యా వస్తావయ్యా' విడుదలను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించారు. పెద్ద సినిమాలపై తక్షణ, ఎక్కువ ప్రభావం పడినా చిన్న సినిమాల పైన కూడా పడిందనే చెప్పవచ్చు. మరోవైపు పెద్ద సినిమాల విడుదల వాయిదా పడటంతో చిన్న సినిమాలు వరుసగా వస్తున్నాయి.
బయటి నుంచి చూస్తే పెద్ద సినిమాల మధ్య నలిగిపోయే పరిస్థితి నుంచి చిన్న సినిమా తప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కానీ, సీమాంధ్రలో థియేటర్లు సరిగా నడవక ఈ సినిమాలూ ఇబ్బంది పడుతున్నాయి. 'రామయ్యా వస్తావయ్యా'ను సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అది విడుదలైతే 'ఎవడు' చిత్రాన్ని అక్టోబర్ 10 లేదా 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు. సానుకూల పరిస్థితులు ఉంటే అవి అనుకున్న తేదీల్లో విడుదలయ్యే అవకాశముంది.