మోడీ, షా రాజకీయ జిత్తులు: ఉపాధి కల్పన మాటేమిటి?
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షల మేరకు పార్టీ రాజకీయ లక్ష్యాల సాధన వైపు వడివడిగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: వారం క్రితం జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు అందుకు అనుగుణంగా బీజేపీలో నూతన తరం విశ్వాసం ఇనుమడించింది.
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన బీజేపీ.. గోవాలో అధికారాన్ని కాపాడుకోవడంతోపాటు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని లాగేసుకున్న విజయం తాలుకూ సంకేతాలు కమలనాథుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షల మేరకు పార్టీ రాజకీయ లక్ష్యాల సాధన వైపు వడివడిగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో దేశానికి భవిత యువతేనని పదేపదే చెబుతున్న ప్రధానమంత్రి మోదీ వారికి ఉపాధి కల్పించే అంశంపై ఇప్పటివరకు ద్రుష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. యువతే తమ ప్రాణ వాయువు అని చెప్తున్న కమలనాథులు వారి ఆకాంక్షలు నెరవేర్చకపోతే భవిష్యత్లో వారే తగిన గుణపాఠం నేర్పుతారని గతానుభవాలు చెప్తున్నాయి.
అన్ని సామాజిక వర్గాల మద్దతు పొందేందుకు కమలనాథుల యత్నం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనునిత్యం బీజేపీని సంస్థాగతంగా అభివ్రుద్ధి చేయడంతోపాటు నూతన ప్రాంతాలకు విస్తరించడమే లక్షంగా ముందుకు సాగాలని బీజేపీ శ్రేణులకు పదేపదే సందేశాలిస్తూ ఉంటారు. సిద్ధాంతపరంగా, భౌగోళికంగా, వివిధ సామాజిక వర్గాల్లోకి పార్టీ విధానాలను చొచ్చుకు వెళ్లాలని ఆయన సంకేతాల పరమార్థం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అను నిత్యం పార్టీ శ్రేణులకు నూతన లక్ష్యాలు నిర్దేశిస్తూ ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్రమోడీ 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ తిరిగి గెలుపొందడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహ రచనచేస్తూ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా బీజేపీ ఏనాడూ గెలువని 120 లోక్సభా స్థానాల్లో పట్టు సాధించాలని, వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించాలని, అందుకు ఆయా ప్రాంతాల్లోని వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టాలని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తల పోస్తున్నారు.
ఓబీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకునే ఎత్తు
దేశంలోని వివిధ ఓబీసీ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రధాని మోదీ పలు కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే పార్లమంట్లో ‘వెనుకబడిన కులాల జాతీయ కమిషన్' కు రాజ్యాంగ హోదా కల్పనకు చర్యలు తీసుకున్నారు. దేశ జనాభాలో దాదాపు 52 % మంది ఓబీసీలే కావడం గమనార్హం. ఓబీసీల్లో దాదాపు అన్ని సామాజిక వర్గాలు ప్రాంతీయ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటే.. గతంలో వారి మద్దతు పొందిన కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్నది.
త్రిపుల్ తలాఖ్పై వ్యతిరేకత పేరిట మైనారిటీ మహిళల దన్ను కోసం యత్నం
ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి సారథ్యంలోని బీఎస్పీ, ములాయం సింగ్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీలను దెబ్బ తీసిన అనుభవంతో ఓబీసీలను తన వైపునకు తిప్పుకునేందుకు ముందుకు సాగుతున్నది. మరోవైపు ముస్లిం మైనారిటీల్లో వెనుకబడిన వారిని, త్రిపుల్ తలాక్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ముస్లిం మహిళలను బీజేపీవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తద్వారా ప్రాంతీయ పార్టీలను మరింత బలహీన పరిచేందుకు పూనుకున్నారు. ప్రత్యేకించి ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు ఓబీసీ వర్గాలను తనవైపునకు తిప్పుకునేందుకు పూనుకుంటున్నారు. ఇప్పటివరకు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించడం దీనికి కారణమని చెప్తున్నారు.
యువత ఆకాంక్షలు నెరవేర్చకుంటే అంతే మరి
భువనేశ్వర్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పేదలకు అనుకూలంగా రెండు తీర్మానాలు చేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడిందన్న విమర్శ ఉన్నది. ఈ అంశం బీజేపీని ఎల్లవేళలా వెంటాడుతూనే ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీ అనునిత్యం దేశానికి భవిష్యత్ 35 ఏళ్లలోపు వయస్కులైన 65 శాతం యువతేనని పదేపదే చెప్తుంటారు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం కూడా ఉపాధి కల్పన ప్రక్రియ నెమ్మదిగా సాగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అయితే యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.