ఫోటోలు: నోట్ల రద్దే కీలకం: పార్టీలో చీలికతో యూపీలో ఎస్పీ నష్టపోతుందా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల రద్దుతోపాటు ఆమ్ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం, మణిపూర్లో ఐరోమ్ షర్మిల ఆందోళన, ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో డ్రగ్ మాఫియా అంశం కీలకం కానున్నా
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల రద్దుతోపాటు ఆమ్ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం, మణిపూర్లో ఐరోమ్ షర్మిల ఆందోళన, ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో డ్రగ్ మాఫియా అంశం కీలకం కానున్నాయి.
ఉత్తరప్రదేశ్లో కులం కీలకం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషించనున్నది. పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోపాటు రాష్ట్రంలోని అధికార సమాజ్ వాదీ పార్టీలో చీలిక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపనున్నాయి. ఉత్తరప్రదేశ్ వాసులంతా నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీలో చీలిక కారణంగా ఎస్పీ ఎన్నికల ఫలితాల రూపేణా నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో కీలక మద్దతుదారులుగా ఉన్న 20 శాతం ముస్లింలు సహా ఎస్పీకి దన్నుగా ఉన్నవారంతా బిఎస్పీ వైపు మళ్లే అవకాశముంది. సిఎం అఖిలేశ్ యాదవ్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ మాత్రమే ఆయనకు ఓట్లు కురిపిస్తుంది. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో పార్టీలు ప్రత్యక్షంగా కుల రాజకీయాలు చేసేందుకు వెనుకాడే అవకాశముంది. కులం, మతం, ప్రాంతం, భాష ప్రాతిపదికన ఓట్లడిగిన అభ్యర్థి విజయం సాధించినా.. కోడ్ ఉల్లంఘన కింద అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
పంజాబ్ తీర్పును నిర్దేశించే డ్రగ్ మాఫియా, ప్రభుత్వ వ్యతిరేకత
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో డ్రగ్స్ మాఫియా, ప్రభుత్వ వ్యతిరేకత కీలకం అంశాలు కానున్నాయి. 2014 ఎన్నికల తర్వాత పంజాబ్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా పెరుగుతూ వచ్చింది. అధికార అకాలీదళ్ - బిజెపి కూటమి, కాంగ్రెస్ పార్టీలతోపాటు 2014 లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగడంతో పంజాబ్ రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన డ్రగ్స్ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోనున్నాయి. రైతుల ఆత్మహత్యలు మరో ప్రచారాస్త్రం కానున్నది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రంగా పంజాబ్ ఉంది. రైతులను ఆదుకునేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న అభిప్రాయం ఉంది.
గోవాలో ‘మహా కూటమి' ఎఫెక్ట్
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రంగ ప్రవేశంచేసిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పెర్పార్మెన్స్ తోపాటు ఆర్ఎస్ఎస్ గోవా శాఖ మాజీ అధిపతి తిరుగుబాటు అధికార బిజెపికి నష్టంచేయనున్నది. ఇప్పటికి కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న శివసేనతోపాటు ఇటీవలి వరకు గోవాలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో కలిసి మహా కూటమిగా ఎన్నికల బరిలోకి దిగింది. 40 నియోజకవర్గాల పరిధిలో 37 స్థానాల్లో పోటీ చేయనుండటం బిజెపి విజయావకాశాలపై గణనీయ ప్రభావం చూపనున్నది.
ఉత్తరాఖండ్లో రాజకీయ అనిశ్చితే ప్రచారాస్త్రం
ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటుకు రాజకీయ అనిశ్చితికి దారితీసింది. ఇది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా కారణమైంది. కానీ సుప్రీంకోర్టు జోక్యంతో రెండు నెలల విరామం తర్వాత తిరిగి హరీశ్ రావత్ ప్రభుత్వం కొలువు దీరింది. దీనివల్ల అవినీతి ఆరోపణల నుంచి హరీశ్ రావత్ బయటపడి ప్రజల సానుభూతి పొందేందుకు అవకాశమేర్పడిందా? లేదా? అన్నది తేలనున్నది.
మణిపూర్ లో ప్రజా వ్యతిరేకతే ప్రధానం
15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి సిఎం ఇబోబిసింగ్కు ప్రభుత్వ వ్యతిరేకతే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారనున్నది. అసోంలో విజయం సాధించిన బిజెపి, తాజాగా మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీపై ద్రుష్టిని నెలకొల్పింది. ఎనిమిది కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ సిఎం ఇబోబిసింగ్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో 16 ఏళ్ల మౌనం తర్వాత తాజాగా జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాజకీయ నిర్ణయం తీసుకోవడం ఎన్నికల ఎత్తుగడేననంటున్నారు. వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు కోసం ఐరోమ్ షర్మిల నిరాహార దీక్ష కూడా ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపనున్నది. ఐరోమ్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయ వేదిక ఏ మేరకు ఓట్లను చీల్చగలదో వేచి చూడాల్సిందే.