2019 టార్గెట్, సంఘ్ ఫోకస్: మహా కూటమికి విరుగుడు
ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో సమావేశమైన ఆర్ఎస్ఎస్ ప్రచారక్లు సమావేశం తాము సంస్థాగతంగా అభివ్రుద్ధి చెందాల్సిన ప్రాంతాలపై, ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై దృష్టి సారించారు.
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీఅంతర్మథనంలో పడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా 'మహా కూటమి' ఏర్పాటుపై సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహం, అమలు చేయాల్సిన ప్రణాళిక రూపొందించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను బీజేపీ కోరింది.
బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి రాంలాల్, సంయుక్త ప్రధాన కార్యదర్శులు శివ్ ప్రకావ్ సింగ్, సౌదాన్ సింగ్, వీ సతీశ్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆర్ఎస్ఎస్ను బీజేపీ నాయకులు కోరినట్లు సమాచారం.
దక్షిణాదిలో పాగాకు కమలనాథుల తహతహ
ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. తమిళనాడు మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలను బీజేపీ, ఆరెస్సెస్ నేతలు గుర్తించారని వినికిడి. పట్టణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేశారని తెలుస్తోంది.
మహా కూటమిని ఎదుర్కొనే వ్యూహం రెడీ
ప్రధాని నరేంద్రమోదీని 2019 లోక్ సభ ఎన్నికల్లో ఢీ కొట్టేందుకు విపక్షాలు మహా కూటమిగా ఏర్పడితే అనుసరించాల్సిన వ్యూహం, సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రధాన పాత్ర పోషించలేని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పార్టీనీ, ఆరెస్సెస్ను మరింత బలోపేతం చేసుకోవాలని తద్వారా మాత్రమే రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని నిర్ణయానికి వచ్చారని సంఘ్ సన్నిహిత వర్గాల కథనం.
యూపీలో విపక్షాల ఓట్ల శాతమే ఎక్కువ
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 42 శాతమైతే.. విపక్షాలన్నింటికి వచ్చిన ఓట్ల శాతం 55గా ఉన్న సంగతిపైనా వారు ద్రుష్టి సారించారు. బీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం దళితులు, గిరిజనులను సంఘ్ గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక, కార్యక్రమాలు రూపొందించాలని కమలనాథులు కోరారని తెలుస్తోంది.
గ్రామాలు, దళితులు, గిరిజనులే లక్ష్యం
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకం కావడానికి ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ క్రుషి చేయాలని కమలనాథులు చెప్పినట్లు వినికిడి. ఇప్పటికే ఆరెస్సెస్.. 'ఏక్ మందిర్, ఏక్ శ్మశాన్, ఏక్ తలాబ్' అనే హిందూత్వ సమగ్ర నినాదంతో ముందుకు సాగుతోంది.
యూపీలో ఆరెస్సెస్ ప్రచారక్ల్లో మార్పులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ఆరెస్సెస్ తన ప్రచారక్లను ఇతర ప్రాంతాలను మార్చివేసింది. వారణాసి ప్రాంత ప్రచారక్ను సంస్థాగతంగా అభివ్రుద్ధి కోసం పూర్వాంచల్ ప్రాంతానికి, కాన్పూర్ ప్రచారక్ను వారణాసికి మార్చివేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అత్యంత సన్నిహితుడైన గోరఖ్ పూర్ ప్రాంత ప్రచారక్ను లక్నోకు, అవధ్ ప్రాంత ప్రచారక్ను కాన్పూర్కు మార్చేసింది.