బీజేపీకి అడ్డుకట్ట: శివసేనకు కాంగ్రెస్ సపోర్ట్?
ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లో తన పట్టును కాపాడుకునేందుకు బిజెపిని నిలువరించేందుకు చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ముంబయి: బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన.. కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షమైనా బిజెపితో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లో తన పట్టును కాపాడుకునేందుకు బిజెపిని నిలువరించేందుకు చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇందుకనుగుణంగా తెర వెనుక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకోసం పరోక్ష మద్దతునివ్వాలని శివసేన నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ తన పదవికి రాజీనామా చేసింది.
ఒక లౌకిక పార్టీగా ప్రజాభీష్టాన్ని మన్నించి విపక్షంలోనే కూర్చుంటామని బహిరంగ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. శివసేన నుంచి వచ్చిన ప్రతిపాదనతో బయటి నుంచి మద్దతునిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. బయట నుంచి మద్దతునిస్తే కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని శివసేన ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తోంది.
సీనియర్లతో చవాన్ భేటీ
తాజా పరిస్థితిపై మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ పార్టీ సీనియర్లతో సంప్రదించారు. శివసేన నుంచి వచ్చిన ప్రతిపాదనపై పార్టీ సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, నారాయణ్ రాణె, ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్, ఎంపీలు హుస్సేన్ దల్వాయి, రాష్ట్ర మాజీ మంత్రులు నసీంఖాన్, బాలా సాహెబ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ కూడా అశోక్ చవాన్ నివాసం వద్దే తచ్చాడుతున్నారని సమాచారం.
అప్పుడే స్పందిస్తామని కాంగ్రెసు
బయట నుంచి మద్దతు కోసం శివసేన నుంచి సూత్రప్రాయంగా ప్రతిపాదన వచ్చిన తర్వాత ప్రతిస్పందిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తమకు ప్రధాన ప్రత్యర్థి బిజెపి అని, దాన్ని నిలువరించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని తెలిపింది. శివసేన నుంచి వచ్చిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం ద్రుష్టికి తీసుకెళ్లిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కేవలం బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల్లో పరస్పర మద్దతుపై కూడా ద్రుష్టి సారించామని పేర్కొన్నది.
పని చేయని హార్దిక్ పటేల్ కార్డు
బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో ముఖాముఖీ తలపడిన బిజెపి, శివసేన మధ్య భాష, ప్రాంతం ప్రాతిపాదికన ఓటర్లు చీలిపోయినట్లు పోలింగ్ సరళి తెలియజేస్తున్నది. 227 వార్డుల్లో శివసేనకు 84, భాజపాకు 82 స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. మరాఠాల్లోని కార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శివసేన పాగా వేసింది. గుజరాతీలు, ఉత్తర భారతీయులు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో బిజెపి హవా సాగింది. ముంబైలో నివసిస్తున్న గుజరాతీలు, పటేళ్ల మద్దతు కూడగట్టేందుకు శివసేనాధిపతి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తున్నది
ఇలా పాత ముంబైలో..
పాత ముంబయిలోనూ శివసేన జోరు సాగింది. 56 సీట్లలో ఆ పార్టీ 28 గెలుచుకుని.. భాజపా (13)ను వెనక్కినెట్టింది. బాంద్రా, దహిసర్ తదితర పశ్చిమ సబర్బన్ ప్రాంతాల్లోని 114 సీట్లలో 52 సీట్లు బిజెపి సొంతం చేసుకోగా, శివసేన 38 గెలుచుకుంది. తూర్పు బాంద్రాలో మాత్రం బిజెపి ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. శివసేన ఐదు స్థానాలు, ఎమ్ఐఎమ్ ఒక సీటును సొంతం చేసుకున్నాయి. తూర్పు సబర్బన్ ప్రాంతాల్లో బిజెపి (17), శివసేన (18) హోరాహోరీ తలపడ్డాయి. గుజరాతీలు ఎక్కువగా ఉన్న ములుండ్ ప్రాంతంలో ఆరుకు ఆరు సీట్లను బిజెపి తన ఖాతాలో వేసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుకెక్కిన ధారావిలో ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది.
శివసేనకు పెరిగిన మద్దతు
ముంబయి నగరపాలక ఎన్నికల్లో నెగ్గిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు శివసేనలో చేరారు. తాజా చేరికలతో శివసేన బలం 86కు చేరుకుంది. అయితే అధికారం దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో 28 మంది కార్పొరేటర్ల మద్దతు కావాలి. ఏ పార్టీతోనూ పొత్తు గురించి ఆలోచించలేదని.. మేయర్ పీఠం మాత్రం శివసేనకే దక్కుతుందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు పార్టీ సీనియర్ నేతలతో శనివారం సమావేశం అవుతారని తెలుస్తున్నది.