కెసిఆర్ కేబినెట్లో.. చంద్రబాబు మంత్రులు!
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో ఆయన కేబినెట్లో కీలకంగా వ్యవహరించిన వారే.. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. పార్టీలు, నాయకత్వాలు మారిన వారి పాత్ర మాత్రం కీలకమే.
వారే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆయన మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కె చంద్రశేఖర్రావు.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో ఉన్న కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారే. పోచారం శ్రీనివాసరెడ్డి 2012లో తెలుగుదేశం పార్టీని వీడి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఆ తర్వాత కడియం శ్రీహరి 2013లో టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు 2014 చివరలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో పోచారం శ్రీనివాసరెడ్డి పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
అప్పట్లో భారీ నీటిపారుదల, రోడ్లు భవనాల మంత్రిగా ఉన్న తుమ్మల, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్అండ్బీ మంత్రిగా పనిచేస్తున్నారు. అప్పట్లో కొంతకాలంపాటు సాంఘిక సంక్షేమం, విద్యాశాఖల తోపాటు కీలకమైన భారీ నీటిపారుదల శాఖల బాధ్యతలను నిర్వహించిన కడియం శ్రీహరి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవితోపాటు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.