అసెంబ్లీ సీట్ల పెంపు: బాబు, కెసిఆర్లను గట్టెక్కిస్తారా?
హైదరాబాద్/ అమరావతి: అసెంబ్లీ స్థానాల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కే చంద్రశేఖర్రావు, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయమై కేంద్రం నుంచి సానుకూలత సాధించడం ఖాయమనే భావనతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఖాయమని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ సంగతి చెప్పారు. అసెంబ్లీ స్థానాలను పునర్విభజించాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని చెప్పారు.
దీంతో రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయని తెలిపారు. గతంలో అనుకున్నట్లు దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంట్ అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. జిల్లా యూనిట్ కాకుండా లోక్సభ స్థానం యూనిట్గా పునర్విభజన చేయాలని కేంద్రం భావిస్తున్నదని, ఈ లెక్కన ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సీట్లు వస్తాయని వివరించారు.
ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేస్తే మంచిదని, దీనివల్ల కొన్ని అయోమయాలు తొలగిపోతాయని కొందరు ఎంపీలు అన్నారు.ఇటు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కూడా నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంతో చాలా జోరుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
హోంమంత్రి రాజ్నాథ్దే తుది నిర్ణయమా?
ఎన్నికలకు రెండేళ్లలోపు సమయం ఉండడం... పునర్విభజన సుదీర్ఘ.. సంక్లిష్ట ప్రక్రియ కావడంతో త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందనే ప్రచారం ఊపందుకున్నది. ఇప్పటికే రాజ్యాంగంలోని 180వ అధికరణంలో స్వల్ప మార్పులతో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను పెంచడానికి కేంద్ర హోంశాఖ, న్యాయశాఖతో కలిసి దాదాపు కసరత్తు పూర్తి చేసినట్లు వార్తలొచ్చాయి. స్వల్ప సవరణలో ఉత్తమ ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్దే తుది నిర్ణయం. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సంగతి తేలిపోతే భవిష్యత్లో అంటే రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవడమే మిగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణలో జిల్లాలు ప్లస్ మండలాల పునర్విభజన తర్వాత మళ్లీ ఆసక్తి
అంతా సజావుగా సాగితే గానీ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులతోపాటు పోటీలో నిలిచే అభ్యర్థులు.. తాజాగా పోటీకి ఆసక్తిచూపుతున్న వారిలో ఉత్కంఠకు తెర పడదు. ప్రత్యేకించి తెలంగాణలో జిల్లాలు, మండలాల విభజనతో చోటుచేసుకున్న మార్పులతో ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న ప్రజలు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉభయ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు అంశాన్ని ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం'లో పేర్కొనడంతో ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ విషయమై మూడేళ్లుగా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
Recommended Video
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇలా ఏకాభిప్రాయం
అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణపై కేంద్రం నుంచి ఒకసారి అనుకూల ప్రకటన వస్తే, మరోసారి ప్రతికూల ప్రకటనతో ప్రక్రియ అంగుళం ముందుకు.. అడుగు వెనక్కు అన్న చందంగా మారింది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో సఖ్యత నెరుపుతుండడం, అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏకాభిప్రాయంతో కలిసి సాగుతుండడంతో కచ్చితంగా స్థానాల పెంపు ఉంటుందనే భావనకు బలం చేకూరుతోంది.
గతంలో జిల్లా యూనిట్గా స్థానాల నిర్ణయం
2009లో అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు ముందు శాసనసభ నియోజకవర్గాల పరిధి గందరగోళంగా ఉండేది. ఒక మండలంలోని గ్రామాలు రెండు నుంచి మూడు నియోజకవర్గాల పరిధిలో ఉండేవి. కొన్ని మండలాలు ఇతర జిల్లాల నియోజకవర్గాల పరిధిలోనూ ఉండేవి. ఓటర్ల సంఖ్యలోనూ భారీ తేడాలు ఉండేవి. 2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఎన్నికల సంఘం ఒక కనీస పాలన యూనిట్ (మండలం) ఒకే నియోజకవర్గం పరిధిలో.. ఒకే జిల్లా పరిధిలోనే నియోజకవర్గాలు ఉండేలా చూసింది. ఆంధ్రప్రదేశ్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా రాష్ట్రమంతటా ఇది దాదాపు అమలైంది. ఓటర్ల సంఖ్య విషయంలోనూ పది శాతం అటూ ఇటూగా ఉండేలా చేశారు.
ఒక లోక్సభ స్థానం పరిధి రెండు జిల్లాలు మించి
ప్రస్తుతం తెలంగాణలో జిల్లాలు, మండలాలను విభజించారు. దీంతో గతంలో మాదిరే ఒక్కో అసెంబ్లీ స్థానం రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కి పెంచాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అంటే ప్రతి లోక్సభ స్థానం పరిధిలో ప్రస్తుతం ఉన్న ఏడు నియోజకవర్గాలు తొమ్మిదికి పెరగనున్నాయి. లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచడం.. పరిధిని మార్చడం అసాధ్యం. అంటే ఒక లోక్సభ స్థాన పరిధిలోనే మార్పులు, చేర్పులు చేయాలి. ఒకే జిల్లా పరిధిలో నియోజకవర్గాన్ని ఉంచడం అసాధ్యమే. ఉదాహరణకు కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ అసెంబ్లీ స్థానాలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉన్నాయి. భీమదేవరపల్లి మండలం కన్నారం, ఎర్రబెల్లి గ్రామాలను వరంగల్ రూరల్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన వేలేరు మండలంలో చేర్చారు. ఈ ప్రకారం చూస్తే కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని గ్రామాలు ఆరు జిల్లాల పరిధిలో ఉన్నాయి. కానీ ఇక్కడ పెరిగేది రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. పెద్దపల్లి లోక్సభ స్థాన పరిధిలో ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు అవి పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ఉన్నాయి. ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలో కలిపి నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాలు, మండలాల విభజనతో సరిహద్దుల్లో పూర్తి మార్పులు చేర్పులు చోటుచేసుకోవడంతో కొత్తగా ఎక్కడ అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయనేది స్పష్టత లేదు. దీంతో ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకుంటున్నారు.
అనుకూలమా... ప్రతికూలమా...?
2009 అసెంబ్లీ స్థానాల పునర్విభజన సమయంలో రిజర్వుడు స్థానాల ఏర్పాటులోనూ వైవిధ్యం పాటించారు. ఎస్సీ స్థానాల పెంపునకు జిల్లాలు, ఎస్టీ స్థానాల విషయంలో అత్యధిక ఓటర్లు ప్రాతిపదికన ఎంచుకున్నారు. ఇప్పుడు అదే విధానం పాటించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎస్టీ ఓటర్లు తక్కువగా ఉండడంతో ఎస్టీ స్థానం లేదు. జిల్లాల కోటాలో ధర్మపురి, మానకొండూర్, చొప్పదండి ఎస్సీ రిజర్వుడుగా మారాయి. ప్రస్తుతం ఓటర్ల మార్పులుచేర్పులతో వీటిలో ఏవైనా జనరల్గా మారుతాయా, మరో స్థానం అధికంగా ఎస్సీలకు రిజర్వు అవుతుందా అనేదానిపై కూడికలు తీసివేతలు సాగుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ జనాభా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉంది.. జిల్లాల విభజన అనంతరం ఈ లెక్కల్లోనూ తేడా వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల పునర్విభజన పూర్తయితే ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓటర్ల సంఖ్య రెండు లక్షలలోపే ఉండనుండటంతోపాటు పరిధి తగ్గిపోతుంది. ప్రచారం, వ్యయం పరంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ పడుతున్న వారికి అనుకూలించే అంశమే. అదే సమయంలో తమకు పట్టు ఉన్న ప్రాంతాలు చేజారడం, పరిచయం లేని ప్రాంతాలు చేరడం ప్రతికూలాంశం. రిజర్వేషన్ల మార్పుతో కొందరు రాజకీయ జీవితానికి తెరపడితే కొందరికి కొత్తగా అవకాశాలు వస్తాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ నేతలు ఈ అంశంలో తమ అనుకూలతలు, ప్రతికూలతలు అప్పుడే భేరీజు వేసుకుంటున్నారు. పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైతే తప్ప ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.