దీపా వ్యూహం ఏమిటి: జయలలితలాగా కాదా?
సూటిగా, స్పష్టంగా కొట్టినట్లుగా నిర్ణయాలు ప్రకటించే విషయంలో దీపా జయలలితలాగా వ్యవహరించడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్పష్టంగా చెప్పారు....
చెన్నై: దివంగత నేత జయలలిత రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న ఆమె మేనకోడలు దీపా వ్యూహం ఏమిటనేది స్పష్టం కావడం లేదు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నప్పటికీ తన నిర్ణయాలను ఆమె స్పష్టంగా వెల్లడించడం లేదు. ఈ విషయంలో తాను జయలలితలాగా వ్యవహరించడం లేదని ఆమెనే స్వయంగా చెప్పారు.
మంగళవారం ఆమె మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆచితూచి సమాధానం ఇచ్చారు. పన్నీరు సెల్వం బాగానే పనిచేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో శశికళ అన్నాడియంకె పగ్గాలను చేపట్టడంపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా తన దారిలో తాను ప్రయాణిస్తున్నట్లు మాత్రమే తెలిపారు.
ఆమె చెప్పిన విషయాలను బట్టి ఒక్కటి మాత్రం అర్థమవుతోంది. ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏ ప్రశ్నకు కూడా ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎవరి మీదా తీవ్రమైన ఆరోపణలు చేయలేదు.
జయ ఆస్తులపై, మరణంపై...
జయలలిత ఆస్తులను దక్కించుకోవాలనే ఆలోచన తనకు లేదని దీపా చెప్పారు. జయలిలత మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదనే కోర్టు వ్యాఖ్యలపై కూడా ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. తన సోదరుడు దీపక్ 20 రోజులు ఆస్పత్రిలో అత్తతో ఉన్నట్లు చెప్పాడని, అందువల్ల అమ్మ మరణం గురించి తనకు అంతకు మించి ఏమీ తెలియదని చెప్పారు. జయలలిత ఆస్తులను ప్రభుత్వం చేయాలనే డిమాండ్పై స్పంది్తూ అది ప్రజలను అడగాల్సిన ప్రశ్న అని, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తానని, ఆ తర్వాతే అటువంటి వాటికి సమాధానం ఇస్తానని ఆణె చెప్పారు.
జయ పెన్ను ఇస్తే చాలునట..
తాను జయలలిత ఆస్తులను ఆశించడం లేదని, అలాంటి ఆశలు తనకు లేవని, ఆమె సంపాదించిన కీర్తి ప్రతిష్టలను తాను సంపాదించాలని అనుకుంటున్నానని, ఆమె పెన్ను ఒక్కటి తనకు ఇస్తే చాలునని దీపా అన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఏ విధమైన అనుభవం అవసరం లేదని అంటూ విద్యావంతులు, కొత్తవారు రాజకీయాల్లోకి రావాలని పలువురు ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
బిజెపి నేతలు సంప్రదించలేదు...
బిజెపి తరఫున తనను ఎవరూ సంప్రదించలేదని దీపా స్పష్టం చేశారు. అన్నాడియంకె నేతలు కొంత మంది తనను సంప్రదిస్తున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె కొట్టి పారేశారు. ఎవరూ తనతో మాట్లాడలేదని అన్నారు. అన్నాడియంకె కార్యకర్తలు మాత్రమే తన వద్దకు నిత్యం వస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఏ ఆధారంతో మాట్లాడుతున్నారో..
తమ కుటుంబమే జయలలితను కాపాడుతూ వచ్చిందని దివాకరన్ చేసిన వ్యాఖ్యలపై దీపా కాస్తా ఘాటుగానే స్పందించారు. ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నారో తెలియదని, దాన్ని తాను అంగీకరించబోనని అన్నారు. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారే తనకు మద్దతు తెలుపుతున్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా, తనకు మద్దతు ఇస్తున్న ప్రజల నుంచి తాను చాలా విషయాల్లో అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని, ఇప్పుడే తాను ప్రయాణం ప్రారంభించానని దీపా అన్నారు. శశికళ అన్నాడియంకె పగ్గాలు చేపట్టడంపై వేసిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా తన దారిలో తాను ప్రయాణించాలని భావిస్తున్నానని, ప్రజామద్తతుతో అది కొనసాగుతుందని మాత్రమే జవాబిచ్చారు.
రజనీ కాంత్ రావచ్చు..
ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పనితీరు బాగానే ఉందని దీపా కితాబు ఇచ్చారు. జయలలిత రూపురేఖల్లో ఉన్నానని ఆమె వైఖరిని తనలో ఆశించడం సరి కాదని ఆమె చెప్పారు. మీ సమాధానాల్లో స్పష్టత, దృఢత లేదనే ప్రశ్నకు సమాధానంగా ఆమె అలా అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఏర్పడిందనే రజనీకాంత్ ప్రకటనపై వేసిన ప్రశ్నకు రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని, అది ఆయా వ్యక్తుల ఇష్టమని ఆమె అన్నారు.