నో ఎంట్రీ: కొత్త ట్రెండ్, కెసిఆర్, చంద్రబాబు దారిలోనే...
సుదీర్ఘ విరామం తర్వాత కొందరు అధికారంలోకి వచ్చిన పార్టీలు, నాయకులు అనుసరిస్తున్న అణచివేత విధానాలు ప్రజాతంత్ర విధానాలకు గొడ్డలి పెట్టుగా మారాయంటే అతిశేయోక్తి కాదు.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఆధునిక పాలకుల యుగంలో పదేళ్ల పాటు కొందరు, 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కొందరు అధికారంలోకి వచ్చిన పార్టీలు, నాయకులు అనుసరిస్తున్న అణచివేత విధానాలు ప్రజాతంత్ర విధానాలకు గొడ్డలి పెట్టుగా మారాయంటే అతిశేయోక్తి కాదు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ సామాజిక వర్గాల ప్రజలు, కార్మికులు, యువజన విద్యార్థులు ఆందోళన బాట పడ్తున్నారు.
2014లో కేంద్రంలో బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దండం చేబూని మూడేళ్లు దాటింది. ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, వివిధ వర్గాల ప్రజలు.. ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ఆందోళనకు శ్రీకారం చుడ్తున్నాయి.
నిషేధాజ్నలు ఉల్లంఘించిన రాహుల్ అరెస్ట్
తాజాగా మధ్యప్రదేశ్లోని మాండసౌర్ ప్రాంతంలో పర్యటించేందుకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించారు. మాండసౌర్ ప్రజలు ప్రత్యేకించి రైతులు తమకు పంట రుణాలు మాఫీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. కానీ శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. తత్ఫలితంగా హింసాత్మకమైన ఆందోళన పోలీసు కాల్పుల వరకు వరకు వెళ్లింది. గురువారం పోలీసు నిషేదాజ్నలు తోసి రాజని మాండసౌర్ వెళ్లడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందు వల్లే అనుమతించడం లేదని పోలీసు ఉన్నతాధికారులు సాకులు చెప్పడం ఆనవాయితీగా మారింది.
గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన ఇలా
బుధవారం ఉల్లి, పప్పు ధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనబాట పట్టారు. అక్కడి రైతులను కలుసుకుని ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మాండసౌర్ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంది.
రాహుల్ ఎంట్రీకి నో.. సరిహద్దుల్లోనే నిలిపివేత
గత ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లా కేంద్రంలో అధికార బీజేపీ ఎంపీ ఆధ్వర్యంలోనే దళితులు, ఠాకూర్ల మధ్య ఘర్షణ గల ప్రాంతాల మీదుగా ర్యాలీ నిర్వహించి, ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల చివరి వారంలో అంతకుముందు బీఎస్పీ అధినేత మాయావతి వెళ్లి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిన తర్వాత పర్యటనకు వెళ్లేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ సరిహద్దుల నుంచే తిప్పి పంపారు.
శాంతిభద్రతల పరిరక్షణ పేరిట పోలీసులు ఇలా
బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాండసౌర్లో ఆందోళనను వ్యాప్తి చెందకుండా మరింత విస్తరించకుండా అధికారులు ముందస్తుగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. రత్లం, నీముచ్, మాండసౌర్, ఉజ్జయిని ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు డేటా సేవలను నిలిపివేశామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సేవలు పునరుద్ధరించమని అధికారులు తెలిపారు.
మీడియాకు అనుమతి నిరాకరించిన అసెంబ్లీ అధికారులు
ఇదే ధోరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి చేరుకున్నది. ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే అంతర్జాతీయ రాజధాని ‘అమరావతి' నిర్మిస్తామని పదేపదే ప్రజలకు, యావత్ ప్రపంచం ముందు హోరెత్తేలా చెప్తారు. కానీ మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే అసెంబ్లీ, సచివాలయంలోని వివిధ శాఖల చాంబర్లు కురిశాయి. భవనం చిల్లులు పడి కురుస్తుండటంతో నిజా నిజాల నిర్ధారణకు అసెంబ్లీ వద్దకు మీడియాతోపాటు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు అనుమతి నిరాకరించారు. చివరకు ఎమ్మెల్యేలను మాత్రం అనుమతించి... మీడియాను ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. వివాదం ముదురుతుండటంతో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు అసెంబ్లీని సందర్శించి... పైపు కట్ చేయడం వల్లే విపక్ష నేత వైఎస్ జగన్ చాంబర్లోకి నీళ్లు వచ్చాయని సంకేతాలిచ్చేందుకు విఫలయత్నం చేశారు. దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. కానీ సచివాలయంలోని వివిధ శాఖల చాంబర్లు ఎందుకు కురుస్తున్నాయో మాత్రం బయటపెట్టేందుకు నిరాకరించారు.
విశాఖలో ఇలా వైఎస్ జగన్ అరెస్ట్
ఇటీవల తమిళనాటు ‘జల్లికట్టు' క్రీడ నిర్వహణకు చెన్నై నగరంలోని మెరీనా బీచ్ సాక్షిగా యువత సమీక్రుతమై నిరవధిక ఆందోళన చేసి విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే లక్ష్యంతో విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం రామక్రుష్ణ బీచ్ వద్ద భారీగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది. ఫేస్ బుక్ వేదికగా ఏర్పాట్లపై విస్త్రుత ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి.. విశాఖ పట్నం విమానాశ్రయంలో పార్లమెంట్ సభ్యులు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోనే అరెస్ట్ చేశారు. విశాఖ నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఆందోళనకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించలేదని పోలీసులు సెలవిచ్చారు. నాడు ఆంధ్రప్రదేశ్ అంతటా ఆంక్షలు అమలులో ఉన్నట్లు ప్రకటించారు.
కోదండరాం అరెస్ట్నకు ముందు పోలీసులు ఇలా
ఇక తెలంగాణలో ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన మొదలు.. తెలంగాణ జేఏసీ సారథ్యంలో ఉద్యోగాల కల్పించాలని కోరుతూ నిరుద్యోగ ర్యాలీ చేపట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హైకోర్టులో నక్సలైట్ల ముప్పు ఉన్నదని అఫిడవిట్ దాఖలు చేసింది. మరోవైపు ఆందోళన నిర్వహించ తలపెట్టిన ముందు రోజు అర్ధరాత్రి తర్వాత జేఏసీ చైర్మన్ ఎం కోదండరాం ఇంటికి పోలీసులు దూసుకెళ్లి విధ్వంసకాండ స్రుష్టించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. కానీ మీడియాలో వార్తలు రావడంతో పోలీసులే దగ్గరుండి మరమ్మతు చేయించారని కూడా వార్తలు వచ్చాయి.
144 సెక్షన్ మధ్య భూ సేకరణ
అంతకుముందు సిద్ధిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్మాణం కోసం భారీగా భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ విపక్షాలన్నీ రైతులకు భారీగా ఎక్కువ నష్ట పరిహారం ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. దీని ఫలితంగా ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వం భూసేకరణకు నిర్ణయించిన గ్రామాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసింది. బలవంతంగా ప్రజల నుంచి భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. పైపెచ్చు విపక్షాలు ప్రజలను రెచ్చగొడ్తున్నాయని ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది.
మిర్చికి గిట్టుబాటు ధర కోసం రైతులు ఇలా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో భారీగా పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మార్కెట్లో అధికారులతో కుమ్మక్కైన వ్యాపారులు ధరను సగానికంటే తక్కువకు దించేశారు. దీంతో కడుపు మండిన రైతులు వ్యవసాయ మార్కెట్ వద్ద విధ్వంసానికి దిగారు. తత్ఫలితంగా ప్రభుత్వం నివ్వెరబోయింది.
రైతులపై రాజద్రోహం కేసుల నమోదు
రైతులను విపక్షాలు రెచ్చగొట్టాయని ఎదురు దాడికి దిగింది కెసిఆర్ సర్కార్. ఆందోళనలో పాల్గొన్నది రాజకీయ కార్యకర్తలే తప్ప రైతులు కాదని పదేపదే వివరణలు ఇచ్చిన ప్రభుత్వం.. పది మంది రైతులపై అందునా అధికార టీఆర్ఎస్ మద్దతుదారులపై రాజద్రోహం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇది ఇంతటితో ఆగలేదు. రైతులకు సంకెళ్లు వేసి మరీ కోర్టుకు తరలించడంతో ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా కొందరు పోలీసులను సస్పెండ్ చేసి పెట్టుకున్నది ప్రభుత్వం.
ఇలా ప్రతివ్యూహంతో సర్కార్ అభాసు పాలు
ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ధ వివిధ వర్గాల ప్రజల ఆందోళనకు వేదికైన ‘ధర్నాచౌక్'ను నగర శివారుల్లోకి తరలించాలని తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ మొదలు కాంగ్రెస్ సహా విపక్షాలు ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమం ప్రారంభించాయి. ఆందోళన నిర్వహించేందుకు నగర పోలీసులకు దరఖాస్తు చేశాయి. కానీ దీనికి ప్రభుత్వం ప్రతి వ్యూహం రచించింది. స్థానికుల పేరిట ప్రతి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. కానీ స్థానికుల పేరిట హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని డివిజన్ల కార్పొరేటర్లు, నాయకుల ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేసి విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. ఈ ప్రతి ఆందోళనలో మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మఫ్టీలో పాలు పంచుకున్నారు. మీడియా ఎత్తి చూపడంతో ప్రభుత్వం పూర్తిగా అభాసు పాలైంది.