హురియత్ హిపోక్రసీ: వారి పిల్లలు మాత్రం ఇలా..
రావణకాష్టంగా మారిన జమ్ముకాశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్, జమ్ముకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) వంటి వేర్పాటు వాద సంస్థల అధినేతలు, నేతలు సాధారణ కాశ్మీరీలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
న్యూఢిల్లీ/ శ్రీనగర్: రావణకాష్టంగా మారిన జమ్ముకాశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్, జమ్ముకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) వంటి వేర్పాటు వాద సంస్థల అధినేతలు, నేతలు సాధారణ కాశ్మీరీలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ తమ కుటుంబాలు, పిల్లలకు మాత్రం వేర్పాటువాద సంస్థల నేతలు విలాస వంతమైన జీవితాన్ని అందిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ప్రత్యేకించి భారత సైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూళ్లలో పిల్లలను చేర్చొద్దని చెవినిల్లు కట్టుకుని పదేపదే చెప్తూ వస్తున్నారు వేర్పాటు వాద నేతలు. సయ్యద్ అలీ షా జిలానీ వంటి హురియత్ కాన్ఫరెన్స్ నేతలు పెద్ద కారణాల కోసం చదువులు మానేయాలని కశ్మీరీ యువతపై ఒత్తిడి తెస్తుంటారు.
కానీ భారత ఆర్మీ స్కూళ్లు జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తాయని జిలానీ వంటి వారికి భయమని బీజేపీ ఆరోపిస్తున్నది. భారత్ వైవిధ్య భరితమైన దేశం ప్రత్యేకించి కాశ్మీర్లో పరిస్థితులు భిన్నమైతే హురియత్ కాన్ఫరెన్స్, ఇతర వేర్పాటు వాద సంస్థల నేతలు కశ్మీరీలను తమ పిల్లలను ఆర్మీ నడుపుతున్న పాఠశాలలకు పంపొద్దని పదేపదే కోరుతున్నారు.
రావల్పిండిలో వైద్యుడిగా జిలానీ తనయుడు
ఈ విద్యాసంస్థలు భవిష్యత్ తరం పిల్లలకు మతం గురించి, కల్చర్ గురించి తెలియకుండా చేస్తాయని హురియత్, ఇతర కాశ్మీర్ వేర్పాటు వాద నేతలు నూరిపోస్తున్నారు. కానీ ఇదే వేర్పాటు వాద సంస్థల నేతల కుటుంబ సభ్యులు, పిల్లలు మాత్రం అత్యుత్తమైన విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కొంతమంది పిల్లలు విదేశాల్లో స్థిరపడి విలాసవంతమైన జీవితం నడుపుతుంటారు. హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు తమ పిల్లలు, సామాన్య కశ్మీరీల పిల్లల పట్ల పరస్పరం విభిన్నంగా ఎందుకు వ్యవహరిస్తుంటారో తెలియజేసేందుకు ఇది సరైన ఉదాహరణ అని విశ్లేషకులు చెప్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్ సయ్యద్ అలీ షా జిలానీ వంటి నేతలు యువతను రోడ్ల మీదకు తీసుకు రావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పరోక్షంగా భద్రతాదళాలు, ప్రజాప్రతినిధులపై రాళ్లు విసిరేందుకు యువకులను ప్రోత్సహిస్తుంటారు. సయ్యద్ అలీ షా జిలానీ తనయుడు నయీం జిలానీ వంటి వారు పాకిస్థాన్లోని రావల్పిండిలో మెడికల్ ప్రాక్టీషనర్గా వ్యవహరిస్తున్నారు. భారత ఆర్మీ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నదని నయీం జిలానీ ఆరోపిస్తున్నారు.
సెహ్రాయి పిల్లలకు దుబాయిలో విద్యాభ్యాసం
సయ్యద్ అలీ షా జిలానీ మరో తనయుడు జహూర్ భారతదేశంలోని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో క్రూ మెంబర్గా ఉన్నారు. జిలానీ కూతురు జెడ్డాలో టీచర్ గా పని చేస్తుండగా, ఆమె భర్త అక్కడ ఇంజినీర్గా పని చేస్తున్నారు. జిలానీ గ్రూప్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అశ్రఫ్ సెహ్రాయి కూడా తన పిల్లలకు ఉత్తమ విద్యను అందిస్తున్నారు. మహ్మద్ అశ్రఫ్ సెహ్రాయి కొడుకు అబిద్ సెహ్రాయి.. దుబాయిలో కంప్యూటర్ ఇంజినీర్గా ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ సయ్యద్ జిలానీ గ్రూప్ అధికార ప్రతినిధి సర్వర్ యాకుబ్ కుమారుడు అయాజ్ అక్బర్.. పూణెలోని మేనేజ్మెంట్ కోర్సులో విద్యార్థి. జిలానీ మరో గ్రూప్ నేత అబ్దుల్ అజీజ్ దర్ తనయులు ఉమర్ దర్, అదిల్ దర్ పాకిస్థాన్లో విద్యాభ్యాసం చేస్తున్నారు.
గులాం తనయుడు మేనేజ్మెంట్ విద్యార్థి
హురియత్ కాన్ఫరెన్స్లో మరో నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ సోదరి రబియా ఫరూఖ్, ఆయన బంధువు గులాం నబీ ఫాల్ లండన్లో వైద్యులుగా జీవిస్తున్నారు. మరో వేర్పాటు వాద నేత గులాం మహ్మద్ సుమ్జీ కుమారుడు జుగ్ను కూడా ఢిల్లీలో మేనేజ్మెంట్ కోర్సులో విద్యార్థిగా ఉన్నాడు. మాస్ మూవ్ మెంట్ ఫరీదా బెహన్జీ కుమారుడు రూమా మక్భూల్.. దక్షిణాప్రికాలో మెడికల్ ప్రాక్టీషనర్గా ఉన్నాడు.
విదేశాల్లో దుఖ్తన్ ఈ మిల్లర్ కుటుంబం
జమ్ము కశ్మీర్ డెమొక్రటిక్ లిబరేషన్ పార్టీ అధినేత హసీం ఖురేషి తనయులు ఇక్బాల్, బిలాల్లు లండన్లో జీవిస్తున్నారు. అతివాద సంస్థ దుఖ్త్రాన్ ఇ మిల్లర్ అధిపతి ఆసియా ఆండ్రాబి తన కుటుంబ సభ్యులతో కలిసి మలేషియాలో జీవిస్తున్నారు. తన పెద్ద కుమారుడిని మలేషియాకు పంపడానికి ప్రయత్నించినా కానీ అతడికి పాస్ పోర్ట్ నిరాకరించారు. ప్రస్తుతం ఆయేషా పెద్ద కుమారుడు మహ్మద్ బిన్ ఖాసిమ్.. మలేషియాలోని ఇస్లామిక్ యూనివర్సిటీలో ఐటీలో బీటెక్ చదివారు. ఆస్ట్రేలియాలో ఉన్న విద్యాభ్యాసం కోసం వెళ్లారు.
ఇలా జాతీయ వాదంపై బీజేపీ
ఇంతకుముందు హురియత్ నేత జిలానీ మాట్లాడుతూ భవిష్యత్ తరాన్ని మనం నష్టపోతున్నామని అన్నారు. మన పిల్లలను భారత విద్యా సంస్థల్లో చేర్చొద్దన్నారు. భారతీయ విద్యా సంస్థల్లో కశ్మీరీలు నేర్చుకోవాల్సిందేమీ లేదన్నారు. ఆర్మీ స్కూళ్లు దుష్ట కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని కూడా జిలానీ ఆరోపణలకు దిగారు. ఆర్మీ స్కూళ్లు జాతీయ వాదాన్ని ప్రోత్సహిస్తాయని జిలానీకి భయం అని బీజేపీ ఆరోపిస్తున్నది. జిలానీ, బీజేపీ పరస్పర ప్రకటనలే విద్యార్థులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలకు, సామాన్యులు గాయాల పాలవ్వడానికి కారణమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.