చేసిన తప్పులకు చెల్లుచీటి: 2019 ఎన్నికలకు జగన్ ప్లాన్ ఇదే
వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ఆయన పావులను కదుపుతున్నారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ఆయన పావులను కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపిని గద్దె దించడమే లక్ష్యంగా ఆయన పార్టీ సీనియర్లతో సమాలోచనలు చేస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో చేసిన తప్పులు చేయకుండా రానున్న ఎన్నికలకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు జగన్ .ఈ మేరకు ఎన్నికల నాటికి అన్ని రకాలుగా పార్టీని సమాయత్తం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది.
Recommended Video
పార్టీ నాయకత్వం ఇటీవలనే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకొంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాలు, బలహీనతలు ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ప్రశాంత్ కిషోర్ ఓ నివేదికను సమర్చించనున్నారు.బుదవారం నాడు వైఎస్ జగన్ పార్టీ సీనియర్లు, జిల్లాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు.
అయితే ఈ నెల 8, 9 తేదిల్లో పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్ధేశించుకోనుంది. పార్టీ ప్లీనరీ గతంలో ఎప్పుడూ ఇడుపులపాయలో నిర్వహించేది. అయితే దానికి భిన్నంగా ఈ దఫా విజయవాడలో నిర్వహిస్తున్నారు.
గత చరిత్ర పునరావృతం కానివ్వను
2014 ఎన్నికల సమయంలోనే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావించింది.అయితే ఆనాడు రాష్ట్ర విభజనతో పాటు, కొత్తగా రాష్ట్రంగా ఏర్పడినందున అనుభవం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే రాష్ట్రానికి ప్రయోజనమనే అభిప్రాయం నెలకొంది. దీనికితోడు బిజెపి, టిడిపి ల పొత్తు, పవన్ కళ్యాణ్ ఈ కూటమికి మద్దతు పలకడం కూడ కలిసివచ్చిందనే అభిప్రాయాన్ని రాజకీయపరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో టిడిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు కూడ ప్రభావం చూపాయి. ఈ కారణాలతో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైందనే అభిప్రాయాన్ని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో ఈ రకమైన తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. 2014 ఎన్నికల్లో రాజకీయంగా తప్పులు చేశానని, వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఈ రకమైన తప్పులను పునరావతృతం జరగనివ్వనని వైఎస్ జగన్ పార్టీ నాయకులకు హమీ ఇచ్చారు.
గెలిచే అవకాశాలు లేకపోతే టిక్కెట్లు కష్టమే
2019 ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వేలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల బలాలను తెలుసుకొంటోంది. అధికారం కైవసం చేసుకోడమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ నాయకత్వం ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ అంశాలు ఆయా నియోజకవర్గాల్లో ప్రాధాన్యతను చూపుతాయనే విషయమై సర్వేచేస్తోంది. అయితే గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లను కేటాయించాలని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్ పార్టీ సమావేశంలో నాయకులకు సంకేతాలను పంపారు.
సిట్టింగ్ లకు నో ఛాన్స్
గెలిచే అవకాశాలు లేకపోతే సిట్టింగ్ లకు కూడ రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించబోమని జగన్ పార్టీ నాయకులకు చెప్పారు. బుదవారం నాడు పార్టీ సీనియర్ల సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడ హజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు, పార్టీ సమన్వయ కర్తలకు కూడ టిక్కెట్లు ఇవ్వనని జగన్ స్పష్టం చేశారు. ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిస్తేనే పార్టీకి ప్రయోజనం కలుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు.
ఐఐటి విద్యార్థులతో సర్వే
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఐఐటి విద్యార్థులతో సర్వే నిర్వహిస్తున్నట్టు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ రాజకీయంగా తప్పిదాలు చేసిందని ఆయన చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలపై కూడ సర్వేను నిర్వహిస్తున్నట్టు చెప్పారాయన. బూత్ స్థాయిలో నిర్వహించిన ఎన్నికల సర్వే ప్రాథమిక నివేదికను ఈ నెల 8,9 తేదిల్లో జరిగే పార్టీ ప్లీనరీలో అందజేస్తానని ప్రకటించారు.
పదికి పది మార్కులు సాధించాలి
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే గతంలో మాదిరిగా కాకుండా పదికి పది మార్కులు సాధించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బుదవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులకు ప్రశాంత్ కిషోర్ ను జగన్ పరిచయం చేశారు.