ఆంధ్రజ్యోతి సర్వే: కుల సమీకరణాల్లో టీడీపీ-వైసీపీ సత్తా ఎంత?
కుల సమీకరణాల పరంగా చూసుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి అత్యధిక శాతం మంది మద్దతు లభిస్తుండగా.. వైసీపీ వెనబడిపోయినట్టుగా సర్వే తేల్చింది.
హైదరాబాద్: నిన్నటిదాకా చంద్రబాబు-జగన్ లకు జనంలో ఉన్న సమర్థత గురించి సర్వే ఫలితాలు వెలువరించిన ఆంధ్రజ్యోతి.. తాజాగా కుల సమీకరణాలను బేరీజూ వేస్తూ.. ఆయా కులాల్లో ఎవరికెంత సమర్థత ఉందనే విషయాన్ని వెలువరించింది. మొత్తంగా ఈ అంశంలోను టీడీపీదే పైచేయి కాగా.. ఒక్క ఎస్సీ వర్గంలో మాత్రం టీడీపీ-వైసీపీల మధ్య పోటాపోటీ వాతారణం ఉంది.
బీసీలు, ఓసీలు టీడీపీకే మద్దతు పలుకుతున్నారని, ఎస్టీ వర్గంలోను టీడీపీ గట్టి పట్టు సాధించిందని సర్వే వెల్లడించింది. ఇక మొన్నటి సర్వేలో బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ ఒంటరి పోరుకు దిగితే మరిన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించగా.. తాజా సర్వేలో బీజేపీని పక్కనబెట్టి గనుక ఎన్నికలకు వెళ్తే.. ముస్లిం వర్గం మద్దతు కూడా టీడీపీకే దక్కుతుందని పేర్కొంది.
ఎస్సీ వర్గంలో రెండు పార్టీల సామర్థ్యాన్ని పరిశీలిస్తే.. వైసీపీకి 41శాతం, టీడీపీకి 42శాతం మద్దతుతో రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమలో మట్టుకు అత్యధిక శాతం ఎస్సీలు వైసీపీ వైపే మొగ్గుచూపారని సర్వే పేర్కొనడం గమనార్హం. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో.. మూడు నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించగా.. మూడు నియోజకవర్గాల్లోను 50శాతానికి పైగా ఓటర్లు వైసీపీకే ఓటేసినట్టుగా సర్వే ద్వారా వెల్లడైంది.
తూర్పు గోదావరి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో చోట్ల సర్వే నిర్వహించగా.. ఇక్కడ కూడా రెండు చోట్ల వైసీపీ ఆధిక్యం కనబరచడం గమనార్హం. ఒకచోట టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టు తేలింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మూడు చోట్ల నిర్వహించిన సర్వేలో ఎస్సీలంతా టీడీపీ వైపే మొగ్గుచూపినట్టుగా సర్వేలో పేర్కొన్నారు.
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన సర్వేలో.. రెండు పార్టీలు సమతూకంగానే ఉన్నట్టు తేలింది. రెండు చోట్ల టీడీపీ ఆధిక్యం కనబర్చగా.. వైసీపీ కూడా రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడైంది. ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ ఆధిక్యమే కొనసాగుతోంది. మూడో చోట్ల టీడీపీకి అత్యధిక మద్దతు లభించగా.. వైసీపీ ఒక్క చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది.
మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీకి అత్యధికంగా 60శాతం మంది ఎస్సీలు మద్దతు వ్యక్తపరచడం విశేషం. మరోవైపు వైసీపీకి మాత్రం ఏ ఒక్క నియోజవర్గంలోను 60శాతం మద్దతు లభించకపోవడం గమనార్హం.
ఓసీలు, ఎస్టీల్లో టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా 48శాతం మంది మద్దతు తెలపగా.. వైసీపీకి 35 శాతం మంది తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాల్లోను ఇవే సమీకరణాలు కొనసాగుతున్నట్టుగా సర్వే వెల్లడించింది. మొత్తం 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగ్గా.. మైదుకూరు, పీలేరు, రంపచోడవరంలో మాత్రమే వైసీపీకి అత్యధిక మద్దతు లభించింది.
ఇక మిగతా 20 నియోజకవర్గాల్లో ఓసీలంతా టీడీపీకే పట్టం కట్టారని సర్వే చెబుతోంది. ఇందులో 10 నియోజకవర్గాల్లో 50శాతానికి పైగా జనం టీడీపీకే మద్దతు పలికినట్టుగా సర్వేలో తేలింది. నందిగామలో వైసీపీకి అతి తక్కువగా ఓసీల మద్దతు(10శాతం) ఉన్నట్టుగా సర్వే వెల్లడించింది. దర్శి నియోజవర్గంలో మాత్రమే ఇరు పార్టీలకు సమ మద్దతు (44శాతం) లభించినట్టుగా సర్వే పేర్కొంది.
ఇక మొన్నటి సర్వేలో జనసేన ప్రభావం అసలు ఏమాత్రం ఉండబోదని పేర్కొనగా.. తాజా సర్వేలో జనసేనకు చిత్తూరు జిల్లా పీలేరులో 11శాతం మంది ఓసీల మద్దతు ఉందని తేలింది. మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా జనసేనకు ఇంత మద్దతు లేదని సర్వే తెలిపింది. కాంగ్రెస కు కూడా పీలేరులోనే అత్యధికంగా ఏడున్నర శాతం మద్దతు లభించినట్టుగా వెల్లడైంది.
బీసీల విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీదే హవా అని తేల్చేసింది సర్వే. ఒక్క మైదుకూరు నియోజకవర్గం మినహా రాష్ట్ర బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని పేర్కొంది. మొత్తంగా 51శాతం మంది బీసీలు టీడీపీకి మద్దతు పలుకుతుండగా.. వైసీపీకి 30శాతం మంది మాత్రమే మద్దతు పలుకుతున్నట్టుగా తేలింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. కోస్తాంధ్రలో టీడీపీకి 55శాతం వైసీపీకి 30 శాతం మద్దతు పలుకుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో మొత్తం 16నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించగా.. కేవలం రెండు నియోజవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల బీసీల మద్దతు టీడీపీకి 50శాతంగా ఉంది. కొన్ని చోట్ల 60శాతానికి పైగా బీసీలు టీడీపీకి మద్దతు పలికారు.
ఎస్టీల్లో టీడీపీకి 51శాతం మద్దతు లభించగా.. టీడీపీకి 30శాతం మంది మద్దతు లభించింది. ఒక్క మైదుకూరు మినహా వైసీపీకి ఎస్టీల్లో ఎక్కడా పట్టు లేదని సర్వే తేల్చింది. మన్యం నియోజకవర్గమైన రంపచోడవరంలోనూ ఎస్టీల్లో టీడీపీకే భారీ ఆధిక్యం(53శాతం) వచ్చింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ మాత్రం 33శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.