యుపి సిఎం రేసులో వీరు: అది కూడా కలిసొచ్చిందా?
యుపిలో బిజెపి తన సిఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా కలిసి వచ్చిందా.... యుపి ముఖ్యమంత్రి పీఠం కోసం దిగ్గజాలు ఎంతో మంది ఉన్నారు....
లక్నో: ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకపోవడం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో యుపి ప్రభంజనం వీయడానికి ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న దిగ్గజాలు కూడా తమ వంతు చేయి వేసి, వ్యక్తిగత తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం తమకు యుపిలో ఎలా కలిసి వచ్చిందో చివరి విడత పోలింగ్ సమయంలో కేంద్ర టెలికమ్ మంత్రి మనోజ్ సిన్హా వివరించారు. తమ ఎన్నికల ప్రచారంలో ఇమేజ్ ఉన్న నాయకుడిని ముందుకు తెచ్చే ప్రక్రియను బిజెపి కొనసాగిస్తూ వస్తోంది. 1996లో అటల్ బిహారీ వాజ్పేయితో ఈ సంప్రదాయం ప్రారంభమైంది.
తాను జూనియర్ పార్ట్నర్గా ఉన్న రాష్ట్రాల్లో తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందు పెట్టడం ద్వారా భాగస్వామ్య పార్టీని ప్రభావితం చేయడానికి బిజెపి ప్రయత్నించిన సందర్భాలున్నాయి.
గత ఆరు నెలలుగా ఎన్నో పేర్లు...
గత ఆరు నెలల కాలంలో బిజెపి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చ సాగుతూనే ఉన్నది. పలువురు నాయకుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ యుపి ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఆ రెండు అంశాలను....
ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బిజెపి రెండు అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవి - బిజెపికి ఓటు వేసిన కులాల సమీకరణాలతో పాటు 2019 సాధారణ ఎన్నికల్లో కలిసి వచ్చే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బిజెపి నాన్ యాదవ్ ఓబిసిలపై, అగ్రవర్ణాలపై ఆధారపడి తన ఎన్నికల ప్రక్రియను సాగించింది. అందువల్ల ఈ రెండు వర్గాల నుంచి బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కేశవ్ మౌర్య పేరు ముందుకు....
ఓబిసి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని భావిస్తే రెండు పేర్లు ముందుకు వస్తాయి. వారిలో ఒకరు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కేశవ్ మౌర్య కాగా రెండోవారు సంతోష్ గంగ్వార్. కేశవ్ మౌర్య విశ్వ హిందూ పరిషత్ నుంచి పార్టీలోకి వచ్చినవారు. ఎంబిసి కూడా. యుపిలో ఎంబిసి నుంచి ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. ఆయనను ఎంపిక చేస్తే ఆ వర్గాలకు చెందిన మొదటి యుపి ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. దానికితోడు, మరోసారి పూర్వాంచల్కు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది.
బిజెపిలో గంగ్వార్ కీలక పాత్ర...
సంతోష్ గాంగ్వార్ 1989 నుంచి బిజెపిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బిజెపిలో బాగా తెలిసిన పేరు కూడా ఆయనది. నెమ్మదస్తుడైన గాంగ్వార్ కుర్మి. రోహెల్ఖండ్లో ఆ వర్గానికి చెందినవారు బిజెపితోనే ఉంటున్నారు. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆ వర్గాన్ని బిజెపి సంతృప్తి పరచగలుగుతుంది.
అగ్రవర్ణాలకు సిఎం పదవి ఇవ్వదలిస్తే...
అగ్రవర్ణాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలనుకుంటే మహేష్ శర్మ పేరు ప్రధానంగా ముందుకు వస్తుంది. ఆయన నోయిడాకు చెందిన వైద్యుడు. సంఘ్ పరివార్కు సన్నిహితుడు. అయితే, అనవసరమైన వివాదంలో ఆయన తలదూర్చాడు.
ఆయన పేరు కూడా ముందుకు...
టెలికమ్ మంత్రి, ఘాజీపూర్ ఎంపి మనోజ్ సిన్హా కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ అయిన సిన్హా ఆధిపత్యం లేని భూమిహార్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఆధిపత్య వర్గాలు సిఎం పీఠం కోసం పోటీ పడితే ఆయన పేరు ముందుకు రావచ్చు.
ఉమా భారతి పేరు కూడా...
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఉన్న వైరం కారణంగా ఆమె తన కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్కు మార్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఆమె మనసు మాత్రం మధ్యప్రదేశ్లోనే ఉన్నట్లు చెబుతారు.
కలరాజ్ మిశ్రా పేరు...
కలరాజ్ మిశ్రాకు లక్నో, ఢిల్లీల్లో చట్టపరమైన, కార్యనిర్వహణపరమైన అనుభవం ఉంది. డియోరాకు చెందిన బ్రాహ్మణ నాయకుడు ఆయన. బిజెపిలో ఆయన ప్రముఖమైన నాయకుడు.
యోగీ అదిత్యనాథ్ పేరు కూడా...
గోరఖ్పూర్ ఎంపి యోగి ఆదిత్యనాథ్ కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు సమాచారం. గోరఖ్పూర్కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఆయన పేరును ముందుకు తెస్తోంది. కులసమీకరణాలను, ముఖ్యమంత్రి యుపి తూర్పు ప్రాంతంలో, చూసుకుంటే ఆయనకు అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు.