పన్నీరు పావులు: శశికళ ముందు పెద్ద పరీక్ష.. భవిష్యత్తు ప్రశ్నార్థకం!
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్ష కానున్నాయి. ఎన్నికల నిర్వహణ తేదీల ఖరారుకు హైకోర్టు సూచనలు చేసింది. ఇప్పటికే పార్టీలో, బయట సవాళ్లు ఎదుర్కొంటున్న శశికళకు ఇది మరో సవాల్.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్ష కానున్నాయి. ఎన్నికల నిర్వహణ తేదీల ఖరారుకు హైకోర్టు సూచనలు చేసింది. ఇప్పటికే పార్టీలో, బయట సవాళ్లు ఎదుర్కొంటున్న శశికళకు ఇది మరో సవాల్.
పన్నీరు సెల్వంలో మార్పు
ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తొలుత శశికళ పట్ల విధేయత చూపించారు. ఆ తర్వాత ఆయనలో మార్పు ప్రారంభమయింది. ఆయన మద్దతుదారులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇంకోవైపు తాను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఇంకొందరు దూరం జరుగుతున్నారు. ఇవన్నీ ఆమెకు కంటినిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఇవన్నీ ప్రశ్నార్థకంగా మార్చేశాయి
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆమెలో ఆందోళనను కలిగిస్తున్నాయి. పార్టీలో పెరుగుతున్న తిరుగుబాటు ధోరణి ఓ వైపు, ముఖ్యమంత్రి వర్గం నుంచి, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నుంచి ఆమెకు ఎదురవుతున్న సవాళ్లు మరోవైపు.. ఆమె రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి.
అధికార పార్టీ విజయావకాశాలకు దెబ్బ
జయలలిత మృతి అనంతరం పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పై చేయి కోసం శశికళ, పన్నీరు సెల్వంలు ప్రయత్నిస్తుండగా, దీపా జయకుమార్ వర్గం కూడా పార్టీలో కనిపిస్తోంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం తెస్తుందని అంటున్నారు.
శశికళ పదవికే ఎసరు!
అన్నాడీఎంకే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతింటే శశికళ పదవికే ఎసరు రావొచ్చని అంటున్నారు. శశికళకు ప్రతిపక్ష డీఎంకే సవాల్ కాదని, పార్టీలోనే ఆమె ముందు నిరూపించుకోవాల్సి ఉందని అంటున్నారు. చాలామంది జయ స్థానంలో ఆమెను ఊహించుకోలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు శశికళకు పెద్ద పరీక్షే అంటున్నారు.
గెలిస్తే సీఎం పదవి దిశగా.. వ్యూహం
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నియామకం నుంచి వారి గెలుపు వరకు అన్నీ శశికళకు పరీక్షలే. ఒకవేళ పార్టీ గెలిస్తే మాత్రం ఇక శశికళకు తిరుగు లేదని అంటున్నారు. అంతేకాదు, విజయం సాధిస్తే పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించడం.. తన సత్తా చాటడం ద్వారా సీఎం పదవిని దక్కించుకోవచ్చుననేది ఆమె వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
శశికళ వర్సెస్ పన్నీరు
జల్లికట్టు ఆందోళన విషయంలో శశికళను టార్గెట్ చేశారు. చివరి రోజు అల్లర్లలో శశికళ వర్గీయుల ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, అల్లర్లలో సంఘ విద్రోహశక్తులు, విద్యార్థేతరులు, గూండాలు ఉన్నారని పన్నీరుసెల్వం మండిపడ్డారు. ఇటీవల జయను ప్రశంసించిన పన్నీరు.. శశికళ గురించి మాట్లాడలేదు.
శశికళ భర్తకు షాక్
అంతేకాదు, పార్టీకి రెండాకుల గుర్తు రావడానికి తన కృషి ఎంత ఉందని శశికళ భర్త నటరాజన్ చేశారు. దానికి పన్నీరు కౌంటర్ ఇచ్చారు. రెండాకులు జయలలిత కృషే అని ధీటుగా స్పందించారు. శశికళ నటరాజన్ భర్తకు కౌంటర్ ఇవ్వడం ద్వారా వారి వ్యతిరేకులను కూడా తన వైపు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.