గడ్డపార పట్టి, తట్ట మోసిన కెసిఆర్ (పిక్చర్స్)
నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పార పట్టి పూడిక తీయడమే కాకుండా మట్టిని ఎత్తిపోశారు. తట్టతో మట్టిని ఎత్తిపోశారు. నల్లగొండ జిల్లా రా సముద్రం చెరువు పునరుద్ధరణ పనుల్లో ఆయన ఈ పనిచేశారు. పెద్ద చెరువుగా కూడా పిలిచే రా సముద్రం చెరువు పునరుద్ధరణ పనుల్లో కెసిఆర్ స్వయంగా పాల్గొన్నారు.
ఎడ్లబండిపై ఊరేగింపుగా వెళ్లి, గడ్డ పలుగు చేతబట్టి, పూడిక మట్టిని తవ్వి, స్వయంగా తట్ట మోశారు. రాణిరుద్రమదేవి అమరత్వం పొందిన విషయాన్ని ప్రకటించే శాసనాన్ని పరిశీలించి, ఈ నేలకున్న చారిత్రక ప్రఖ్యాతిని స్మరించుకుంటూ, కాకతీయ, రెడ్డిరాజుల సాగునీటి ప్రణాళికలు వివరిస్తూ.. వాటిని ఆంధ్ర రాజు లు నిర్వీర్యం చేసిన తీరును తేటతెల్లం చేశారు. ఆనాటి వైభవాన్ని.. చరిత్రను మళ్లీ వెలుగులోకి తెస్తామని ప్రతినబూనారు.
మిషన్ కాకతీయతో చెరువులకు పట్టిన దరిద్రం దెబ్బకు పోవాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని పెద్ద చెరువు (రా సముద్రం) పునరుద్ధరణ పనులను ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం స్వయంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
అప్పుడే వాటర్షెడ్ నిర్మాణం
కాకతీయులు, రెడ్డి రాజులు 11వ శతాబ్దంలోనే తెలంగాణ ప్రాంతంలో వాటర్షెడ్ నిర్మాణం చేపట్టారని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్ర రాజులు అలనాటి చెరువులను ఆగం చేశారని కెసిఆర్ అన్నారు.
చందుపట్ల నివాసి...
తెలంగాణకు సాగునీటిని పరిచయం చేసిన కాకతీయులు తవ్వించిన చారిత్రక పెద్ద చెరువులో మనం ఉన్నామని చెప్పిన కేసీఆర్ రాణీ రుద్రమదేవీ సేనాని మల్లికార్జునుడు ఈ చందుపట్ల ప్రాంత వాసి అని తెలిపారు.
రుద్రమ్మ వీరమరణం ఇక్కడే..
ఇక్కడ కాయస్త అంబదేవుడితో జరిగిన యుద్ధంలోనే రుద్రమ వీర మరణం పొందారని కెసిఆర్ వివరించారు. ఇంతటి చరిత్ర కలిగిన ప్రాంతం గొప్పతనం ఆంధ్ర పాలనలో మనకు తెలియలేదని సీఎం అన్నారు.
విస్మరించారు..
హైదరాబాద్కు సమీపంలో ఉన్నా రా సముద్రం వంటి చారిత్రక ప్రాంతాన్ని వెలుగులోకి రానివ్వలేదని విమర్శించారు.
పెద్ద గుండు ఉండేది..
రా సముద్రం చెరువు మధ్యలో పెద్ద గుండు ఉండేదని.. వర్షం వచ్చినప్పుడు దాని కింద తలదాచుకునే వాళ్లమన్న ఎమ్మెల్యే వీరేశం మాటలు ప్రస్తావిస్తూ.. ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఆ గుండు కనపడకుండా గుండు కొట్టారని దుయ్యబట్టారు.
చిన్నపాటి ప్రాజెక్టులా...
రెండున్నర కిలోమీటర్ల పొడవైన కట్టతో అతి విశాలంగా కనిపిస్తున్న చెరువు చిన్నపాటి ప్రాజెక్టును తలపిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
గత పాలకులకేదీ..
చెరువుకు ఎగువన ఏఎమ్మార్పీ కాల్వ వెళ్తున్నా అక్కడినుంచి నీళ్లు తేవాలనే సోయి గత పాలకులకు లేకపోయిందని కెసిఆర్ అన్నారు.
అదనపు నిధులు..
ఇప్పటికే ఈ చెరువు పునరుద్ధరణకు కేటాయించిన రూ.54 లక్షలతో 110 ఎకరాల విశాలమైన శిఖం తవ్వడం సాధ్యం కాదని, అందుకే అదనంగా మరో రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు.
పునరుద్ధరణ పనలు..
మొత్తం రెండు కోట్లతో జూలై వరకు చెరువు పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. దెబ్బకు చెరువు దరిద్రం పోవాలని కాంక్షించారు.
4 వేలకు పైగా చెరువులు
నల్లగొండ జిల్లాలో మొత్తం 4,762 చెరువులు ఉన్నాయని చెప్పిన కేసీఆర్.. తుంగుతుర్తి ప్రాంతంలోని పెద్ద పెద్ద చెరువులను, శాలిగౌరారం చెరువునూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రస్తావన
కాకతీయుల నుంచి అసఫ్జాహీల కాలం వరకూ ఉన్న ప్రాజెక్టులను అంచనాలో ఉంచుకుని, 1974లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని తెలిపారు.
తన్నుకుపోయారని విమర్శ
గోదావరి బేసిన్లో 175 టీఎంసీలు, కృష్ణా నుంచి 93 టీఎంసీలను తెలంగాణ ప్రాంతానికి కేటాయించిందని అవి మన ఆస్తి అయినా రాకుండా తన్నుకుపోయారని కేసీఆర్ తెలిపారు. 265 టీఎంసీల నీరు తెలంగాణకు దక్కితే.. వరుసగా మూడేండ్లు కరువు వచ్చినా మన ప్రాంతంలో పంటలకు కొదవ ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
రుద్రమ దేవి మరణశాసనం
నకిరేకల్ నుంచి రోడ్డు మార్గాన చందుపట్లకు బయల్దేరిన కేసీఆర్.. గ్రామ శివారులో ఉన్న రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని, బయల్పడిన రాతి విగ్రహాలను, శిల్పాలను పరిశీలించారు. శిలా శాసనానికి పూలమాలలు వేశారు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతా..
చారిత్రక నేపథ్యం ఉన్న చందుపట్ల గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. కాకతీయ వీరవనిత రుద్రమదేవి యుద్ధం చేసిన ఈ ప్రాంతంలో ఆ పోరాటం స్ఫురించేలా విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
నెంబర్ వన్గా నిలపడమే..
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపి, దేశంలో నం.1గా నిలిపి, బంగారు తెలంగాణగా మలచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు.
కళారూపాలతో స్వాగతం
నల్లగొండ నుంచి నకిరేకల్కు హెలికాప్టర్లో ఆదివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు చేరుకున్న సీఎంకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యతోపాటు పలువురు నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
చిందు కళాకారుల నృత్యాలు
కళాకారులు, పీర్లు, కాటికాపరులు, మత్స్యకారులు వలలతో, ఎడ్లబండ్లతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కట్ట ప్రారంభం నుంచి చెరువు మధ్య వరకు ఎద్దుల బండిపై మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే వీరేశంతో కలిసి ప్రయాణించారు.
తలపాగా చుట్టి...
ముఖ్యమంత్రి కెసిఆర్ తలపాగా చుట్టి, గడ్డపారతో పూడిక మట్టిని తవ్వి పనులను ప్రారంభించారు. అనంతరం గంపలతో మట్టిని ట్రాక్టర్లోకి ఎత్తిపోశారు.
నీలాంటి మహిళలుంటే పోరాడుతా...
చందుపట్ల పెద్ద చెరువుకు ఫీడర్ చానల్ ద్వారా నీటిని తీసుకొచ్చే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తున్న సమయంలో పుట్ట జానకమ్మ అనే మహిళ గట్టిగా మాట్లాడారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ఏందమ్మా.. ఏమో అంటున్నవ్ అన్నారు. దీనికి ఆమె మాట్లాడుతూ ఆంధ్రకు పోయే నీళ్లు మలుపుకొస్తెనే మా శెరువు నిండుతది సార్ అని చెప్పారు. ఆ మాట విన్న కేసీఆర్ నీలాంటి వీర వనితలు ఊరికి ఇద్దరుంటే నేను ఎవ్వరితోనైనా పోరాడత అని చెప్పారు.