ములాయం ఇంటి కథ: అఖిలేష్పై సవతితల్లి చేతబడి?
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబ రాజకీయాలు రచ్చకెక్కాయి. కుటుంబంలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. కుమారుడు అఖిలేష్ యాదవ్కు, రెండో భార్య సాధన యాదవ్కు మధ్య రాజకీయ విభీషణుడు ములాయం సింగ్ నలిగిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్లో నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న అఖిలేశ్ యాదవ్ ఇన్నేళ్లుగా తండ్రి మాట దాటని మంచి బాలుడిగా పేరు తెచ్చుకున్నారు. ములాయం రెండో భార్య సాధన యాదవ్ గుప్తా అఖిలేశ్కు వ్యతిరేకంగా తెర వెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో పార్టీపై అఖిలేశ్ పట్టు బిగిస్తున్న నేపథ్యంలో తన తనయుడు ప్రతీక్(27)కు భవిష్యత్తు ఉండదని ఆమె ఆందోళన చెందుతున్నారు.
చిన్నమ్మపై సాధనపై ఇప్పటి వరకు అఖిలేష్ వర్గం నోరు చేసుకోలేదు. శుక్రవారం తొలిసారిగా గళం విప్పింది. మారుటితల్లి(పిన్నమ్మ) ముఖ్యమంత్రి అఖిలేశ్పై చేతబడి చేస్తున్నారంటూ అఖిలేశ్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ ఉదయ్వీర్సింగ్ సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రిని గద్దె దించాలని ఆమె కుట్ర పన్నుతున్నారన్నారు.
సాధన చేతిలో పార్టీ అధినేత ములాయం, ఆయన సోదరుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివ్పాల్ యాదవ్లు కీలు బొమ్మలయ్యారని, సాధన వెనకుండి నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. 'మీ అబ్బాయి మీద కుట్రలు జరుగుతున్నాయి. తెలుసుకోండి' అంటూ ఆయన ములాయంకు లేఖ రాశారు. ఇప్పటికైనా అఖిలేశ్కు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు.
రచ్చకెక్కిన ములాయం కుటుంబ వివాదం 2017లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ అవకాశాలను ఘోరంగా దెబ్బతీసే పరిస్థితి కనబడుతోంది. గతనెల ములాయం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనయుడు అఖిలేశ్ యాదవ్ను తొలగించి, తమ్ముడు శివ్పాల్ యాదవ్ను నియమించినప్పటి నుంచి ములాయం కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి.
సమావేశానికి అఖిలేష్ గైర్హాజర్
పారటీ చీఫ్ శివపాల్ యాదవ్ శుక్రవారం ఏర్పాటు చేసిన కీలకమైన సమావేశానికి అఖిలేష్ యాదవ్ డుమ్మా కొట్టారు. దీంతో సమాజ్వాదీ పార్టీలో మరింత తీవ్ర రూపం దాల్చాయి. వచ్చే ఎన్నికలకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
అయితే, అఖిలేష్ యాదవ్ను శివపాల్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో విభేదాలకు అంతం పలకాలని ఆయన భావించినట్లు కనిపిస్తోంది. శివపాల్ యాదవ్ స్వయంగా ఆహ్వానించినా అఖిలేష్ యాదవ్ సమావేశానికి దూరంగానే ఉండిపోయారు.
అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా శాసనసభ్యులు ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని అంతకు ముందు ములాయం సింగ్ చెప్పారు. అయినా విభేదాలకు స్వస్తి చెప్పే ఉద్దేశంతో శివపాల్ యాదవ్ అఖిలేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.