ట్విస్ట్: అన్న బాటలోనే చక్రపాణిరెడ్డి, అందుకే టిడిపి బాధ్యతలు అప్పగించలేదా?
నంద్యాల:నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలను పురస్కరించుకొని టిడిపి, వైసీపీల ఎత్తుకు పై ఎత్తును వేస్తున్నాయి. మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి కూడ పార్టీ వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి శిల్పాకు ఆహ్వనం దక్కలేదు.మరోవైపు పార్టీ ఆదేశిస్తే తాను నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తానని చక్రపాణిరెడ్డి ప్రకటించారు. కానీ, పార్టీ నుండి ఆయనకు ఆహ్వనం దక్కలేదు.
నంద్యాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడకముందే వైసీపీ, టిడిపిలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.ఈ ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
టిడిపిలో కంఫర్ట్, టిక్కెట్టు కోసం కుటుంబానిది ఒకేమాట, అంతా ఒట్టిదే: అఖిలప్రియ
అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ తన శక్తియుక్తులను ధారపోస్తోంది. పార్టీలో చేరిన వారం రోజులకే మాజీమంత్రి శిల్పా మోహన్రెడ్డికి వైసీపీ టిక్కెట్టును కేటాయించింది.
టిక్కెట్టు కేటాయింపు విషయంలో పార్టీ నాయకత్వం సాచివేతధోరణిని నిరసిస్తూ శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడారు. రాజకీయంగా తన భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఆయన పార్టీని వీడారు. అయితే ఈ తరుణంలోనే శిల్పా మోహన్రెడ్డి పార్టీ మారకుండా నాయకత్వం చేసిన కృషి ఫలించలేదు. అయితే సోదరుడి బాటలోనే చక్రపాణిరెడ్డి కూడ పార్టీని వీడే అవకాశం ఉందని నంద్యాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
సోదరుడి బాటలోనే చక్రపాణిరెడ్డి
మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడ టిడిపిని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మోహన్రెడ్డి పార్టీ మారిన సందర్భంగా రక్తసంబంధం వేరు. రాజకీయాలు వేరంటూ ప్రకటించారు.అయితే పార్టీలు మారినంతమాత్రాన రక్తసంబంధాన్ని వీడబోనని చెప్పారు.వైసీపీ అభ్యర్థిగా మోహన్రెడ్డి నంద్యాల స్థానం నుండి పోటీచేస్తున్నారు. అయితే తన సోదరుడు టిడిపిని వీడకుండా చక్రపాణిరెడ్డి తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ, సాధ్యంకాలేదు. పార్టీ మారే విషయంలో ఇద్దరిమధ్య విబేధాలు పొడచూపాయనే వార్తలు కూడ వచ్చాయి.నంద్యాలలో పార్టీ ప్రచారకార్యక్రమాల విషయంలో శిల్పాచక్రపాణిరెడ్డికి ఆహ్వనం లేదు.దీంతో ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.
ప్రచార బాధ్యతలను అప్పగించలేదా?
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో ప్రచారబాధ్యతల విషయంలో టిడిపి నాయకత్వం ఆచితూచి అడుగేసిందనే ప్రచారం సాగుతోంది. శిల్పామోహన్రెడ్డి కూడ పార్టీ మారే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో ప్రచారబాధ్యతలను ఆయనకు అప్పగించలేదనే ప్రచారం కూడ లేకపోలేదు.ఈ కారణంగానే పార్టీ ఆయనకు ప్రచారబాధ్యతలను అప్పగించలేదనే ప్రచారం పార్టీవర్గాల్లో సాగుతోంది.
వేర్వేరు పార్టీల్లో సోదరులు
గతంలో కూడ శిల్పా సోదరులు ఇద్దరూ కూడ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.2014 ఎన్నికలకు ముందు శిల్పామోహన్రెడ్డి మంత్రిగా ఉన్నారు. అయితే అదే సమయంలో శిల్పాచక్రపాణిరెడ్డి వైసీపీలో ఉన్నారు. ఏడాదిన్నర తర్వాత ఆయన వైసీపీలో ఇమడలేకపోయారు. టిడిపిలో చేరారు. కర్నూల్ జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చక్రపాణిరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. 2014 ఎన్నికల సమయంలో శిల్పామోహన్రెడ్డి టిడిపిలో చేరారు. గత నెలలో జగన్ సమక్షంలో శిల్పా మోహన్రెడ్డి వైసీపీలో చేరారు.
సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేకనే
వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే పార్టీ సంస్ఘాగత ఎన్నికల సందర్భంగా కర్నూల్ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షుడిని నియమించారు. ఈ ఎన్నికల్లో సోదరుడికి వ్యతిరేకంగా పోటీచేయడం ఇష్టం లేకనే చక్రపాణిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.... లేక పార్టీ నాయకత్వమే ఆయనను దూరం పెడుతోందోననే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే ఈ విషయమై పార్టీ వర్గాల్లో మాత్రం గందరగోళం నెలకొంది. చక్రపాణిరెడ్డి కూడ సోదరుడి బాటలోనే పార్టీని వీడుతారనే ప్రచారం విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే వైసీపీ చీఫ్ జగన్ వ్యవహరశైలి నచ్చకనే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారాడు.ఇదే విషయాన్ని ఆయన గతంలోనే ప్రకటించారు.అయితే ఈ సమయంలో ఆయన టిడిపిని వీడుతారా అనే చర్చకూడ లేకపోలేదు. అయితే ఈ ప్రచారం మాత్రం గందరగోళం సృష్టిస్తోంది. అయితే ఆయనను శాసనమండలి ఛైర్మెన్గా చేస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారంలో వాస్తవమెంత అనే చర్చకూడ లేకపోలేదు.అయితే ఈ విషయమై గందరగోళ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు చక్రపాణిరెడ్డి స్పందిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.