జయ నుంచి చౌతాలా వరకూ.. అంతా ఒక్క తానులో...
జయతోపాటు, శశికళ, ఇతరులపైనా నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. సుమారు 20 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసు పలు మలుపులు తిరిగింది.
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సీఎం స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు జైలు పాలవటం జాతీయ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అక్రమాస్తులు సంపాదించారన్న కేసులో తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత దోషి అని తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమవుతున్నా.. ఆమె మరణంతో ఈ కేసు నుంచి జయ పేరు తొలగించినా మిగిలిన నిందితులకు శిక్ష పడింది.
జయతోపాటు, శశికళ, ఇతరులపైనా నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. సుమారు 20 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఇదే విధంగా పలు రాష్ట్రాల సీఎంలు అవినీతి కేసులను ఘటనలు అనేకం. ఆరోపణలు రుజువై శిక్షలు పడిన మాజీ సీఎంలు ఉండగా, మరికొందరు విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈ కేసుల విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. ఇప్పుడు జయలలిత- శశికళ కేసు మాదిరిగానే అప్పట్లో ఆయా కేసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఆర్జేడీ అధ్యక్షుడి పరిస్థితి ఇది..
పశుగ్రాసం కేసులో ఆరోపణలతో సీఎం పదవినికోల్పోయి జైలు పాలైన విచారకరమైన నేపథ్యం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ది. ఆయన బీహార్ సీఎంగా ఉన్నప్పుడు వెలుగుచూసిన ఈ కుంభకోణంతో లాలూ ప్రసాద్ యాదవ్ తనపై వచ్చిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో నాటి జనతాదళ్ నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)ని ఏర్పాటు చేసి సీఎం పదవి నుంచి వైదొలిగారు. ఆర్జేడీ అధినేతగా లాలూ తన భార్య రబ్రీదేవిని సీఎంగా కూర్చుండబెట్టినా కేసు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. 2013లో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆయనను దోషిగా నిర్ధారించి అయిదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్ష వల్ల ఆయన ఆ తర్వాత 11 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడయ్యారు. ఆయనతోపాటు బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా ఈ కేసులో దోషిగా తేలారు.
ఓం ప్రకాశ్ చౌతాలా తీరిలా..
హర్యానాలో 1999- 2000 ప్రాంతంలో టీచర్ల నియామకాల్లో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా 3,206 మంది టీచర్లను నియమించినట్లు, అప్పటి హర్యానా సీఎం ఓం ప్రకాష్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇది రూ.150 కోట్ల కుంభకోణమని దర్యాప్తు సంస్థ సీబీఐ పేర్కొన్నది. హర్యానా ప్రాధమిక విద్యాశాఖ మాజీ డైరెక్టర్ సంజీవ్ కుమార్ 2003 లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వాజ్యం (పిఐఎల్) తో ఈ కుంభకోణం వెలుగు చూసింది. న్యాయస్ధానం ఆదేశం మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం 2013 లో ఓం ప్రకాష్ చౌతాలా, ఆయన కుమారుడు మరికొందరిని దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విధించిన శిక్షను దిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ కేసుతో హర్యానాలో ఓం ప్రకాష్ చౌతాలా పార్టీ ఆదరణ కోల్పోయింది.
మైనింగ్ కేసులో మధుకోడా
జార్ఘండ్లో ఇనుప ఖనిజం, బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం ఇది. అప్పటి జార్ఘండ్ సీఎంగా ఉన్న మధు కోడా ఈ కేసులో ప్రధాన నిందితుడు. 2006 - 2008 మధ్య కాలంలో గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడి రూ.4,000 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జార్ఘండ్ హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. 2009లో మధు కోడా అరెస్టు అయ్యారు. దాదాపు 40 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇంకా మనీ లాండరింగ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్ కేసు, ఇతర కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి.
యూపీలో 2002 - 03 మధ్య..
2002- 03 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి, ఆమె క్యాబినెట్ మంత్రి నసిముద్దీన్ సిద్దిఖి నిందితులు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రాలోని తాజ్మహల్ పరిసరాల్లో పర్యాటక సదుపాయాలను పెంపొందించే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. కానీ ఈ కేసు న్యాయస్ధానాల్లో నిలవలేదు.
కర్ణాటకలో ఇలా..
2008- 2011 మధ్యకాలంలో కర్నాటకలో ఇనుప ఖనిజం గనుల కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప అవినీతి, మోసం, కుట్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఫలితంగా ఆయన సీఎం పదవికి రాజీనామాచేయాల్సి వచ్చింది. కానీ ఆరోపణలు రుజువు కాలేదు. బెంగుళూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం గత ఏడాది అక్టోబర్లో ఈ కేసును కొట్టివేసింది.
హిమాచల్ సీఎంపై అక్రమాస్తుల కేసు
కాంగ్రెస్ పార్టీకి చెందిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. రూ.6.1 కోట్ల ఆస్తి అదనంగా కలిగి ఉన్నారని ఆరోపిస్తూ 2015లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. గమ్మత్తేమిటంటే ఆయన కూతురు వివాహం రోజే సీబీఐ వీరభద్ర సింగ్ నివాసాలపై దాడులు చేసి విమర్శలు కొని తెచ్చుకున్నది. హిమాచల్ ప్రదేశ్కు ఆయన సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న ఘనత నెలకొల్పారు.
మహారాష్ట్రలో ఇలా
ముంబైలో సైనిక వితంతువుల కోసం ఉద్దేశించిన స్ధలంలో నిర్మించిన 31 అంతస్తుల గృహ నిర్మాణ సముదాయాన్ని కొందరు ప్రముఖులు దొడ్డి దారిన చేజిక్కించుకున్నారనే ఘటన ఆదర్శ్ హౌసింగ్ స్కామ్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మాజీ సీఎంలు సుశీల్ కుమార్ షిండే, విలాస్రావ్ దేశ్ముఖ్, అశోక్ చవాన్ పాత్రపై సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగిస్తున్నాయి. బాంబే హౌకోర్టు సారధ్యంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఒక సాగు నీటిపారుదల ప్రాజెక్టులో అవినితికి పాల్పడ్డారనే ఆరోపణలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ప్రేమ్ ఖండు తుంగన్ ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.